ఎమ్మెల్యేగా గెలిచినా, ఛాన్సిస్తే క్రికెట్ వదలను: శ్రీశాంత్
తిరువనంతపురం: తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనా కూడా క్రికెట్ ఆడుతానని శ్రీశాంత్ చెప్పాడు. శ్రీశాంత్ ఇటీవలే బిజెపిలో చేరారు. ఆయన కమలం పార్టీ తరఫున కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాడు.
ఈ నేపథ్యంలో ఆయన క్రికెట్కు ఫుల్స్టాప్ పెట్టి, రాజకీయాల్లో కొనసాగుతారనే ఊహాగానాలు వినిపించాయి. దీనిపై శ్రీశాంత్ స్పందించాడు. తనకు అవకాశం వస్తే మళ్లీ క్రికెట్ మైదానంలో అడుగు పెడతానని చెప్పాడు.
కెరీర్ ప్రారంభంలోనే అద్భుత ప్రతిభ కనబరచి కేరళ స్పీడ్ స్టర్గా పేరు తెచ్చుకున్న శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఆటకు దూరమైన విషయం తెలిసిందే. అయితే ఇటీవలే రాజకీయాల్లో కొత్త ఇన్నింగ్స్ ఆరంభించాడు.
జీవితంలో ఎన్ని రంగాల్లో రాణించాలనుకున్నా తనకు గుర్తింపునిచ్చింది క్రికెట్ మాత్రమేనని చెప్పాడు. అవకాశం వస్తే మళ్లీ క్రికెట్ ఆడుతానని చెప్పాడు. శ్రీశాంత్కి బిజెపితో రెండేళ్ల క్రితం నుంచే పరిచయం ఉందని అతని తండ్రి శాంతా కుమారన్ నాయర్ చెప్పారు.
వచ్చే నెలలో జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తోన్న బిజెపి.. తొలి విడతగా 51 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. సిటీల్లో బిజెపికి చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉండటంతోపాటు యువతరం ఓట్లను కొల్లగొట్టగలడనే నమ్మకంతోనే శ్రీశాంత్ను తిరువనంతపురం నుంచి ఎన్నికల బరిలోకి దింపుతోందని తెలుస్తోంది.