కర్నాటక ఎన్నికలు: నరేంద్ర మోడీ 'నేపాల్' వ్యూహానికి ఎన్నికల సంఘం ఝలక్
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీ నేపాల్ పర్యటన, అటు నుంచి శనివారం పశుపతినాథ్ ఆలయ సందర్శన అంతా ప్రణాళిక ప్రకారం జరిగిందా? కర్నాటక ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందా అనే చర్చ సాగుతోంది. మోడీ రెండు రోజుల పాటు నేపాల్లో పర్యటిస్తున్నారు. శుక్రవారం నేపాల్ చేరుకున్న ఆయన సీతాదేవి జన్మస్థలమైన జనక్పూర్లోని జానకీ దేవాలయంలో పూజలు నిర్వహించారు.
ఆ తర్వాతే మారిన సీన్: నిజమేనా.. కర్నాటకపై లగడపాటి సర్వే, బీజేపీదే గెలుపు!
కర్నాటక ఎన్నికల పోలింగ్కు ఒకరోజు ముందు, పోలింగ్ రోజు ఆయన పర్యటన ఉండటం ఆసక్తిని కలిగిస్తోంది. ఆయన వ్యూహాత్మకంగా ఈ పర్యటన ఖరారు చేసుకొని ఉండవచ్చునని అంటున్నారు. గతంలో గుజరాత్ ఎన్నికల సమయంలో సముద్రంపై ప్రయాణించే విమానంలో మీడియా ద్వారా రాష్ట్రం మొత్తం దృష్టిని తిప్పుకోగలిగారు.
గుజరాత్, వారణాసిలోను మోడీ ఇలాగే
గుజరాత్ ఎన్నికల ప్రచారం గడువు ముగిసిన తర్వాత ప్రధాని మోడీ అలా చేశారు. 2014లోను దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్ జరుగుతుండగా వారణాసిలో భారీ ర్యాలీ నిర్వహించారు. తద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించారని అంటున్నారు. ఎక్కువ కాకున్నా ఇలాంటివి బీజేపీకి లాభిస్తాయని అంటున్నారు. ఇప్పుడు కర్నాటక ఎన్నికల సమయంలోనే మోడీ పర్యటన కూడా వ్యూహాత్మకమే అంటున్నారు.
జనక్పూర్లో జానకీ ఆలయ సందర్శన
రెండురోజుల షెడ్యూల్లో భాగంగా శుక్రవారం తొలుత మోడీ జనక్పూర్లోని జానకీ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం జనక్పూర్-అయోధ్యల మధ్య బస్ సర్వీస్ను కూడా ప్రారంభించారు. అయితే శనివారం షెడ్యూల్లో భాగంగా మోడీ ముక్తినాథ్, పసుపతినాథ్ ఆలయాలను సందర్శించనున్నారు.
కర్నాటక ఎన్నికల సమయంలో మోడీ పశుపథినాథ్ వద్దకు
అదేరోజు కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. పసుపతినాథ్లో శివుడు జ్యోతిర్లింగ స్వరూపుడు. కర్ణాటకలోని లింగాయత్లు శివుడిని ఇదే రూపంలో పూజిస్తారు. అక్కడ లింగాయత్ ఓట్ల కోసం అక్కడకు వెళ్లి ఉంటారని అంటున్నారు.
బీజేపీకి షాకిచ్చిన ఈసీ
అయితే, ఇక్కడే మరో ట్విస్ట్. శనివారం మోడీ ఆయా ఆలయాలను సందర్శించుకునేటప్పుడు ఆ వార్తలను లేదా ఆ పర్యటనకు సంబంధించి ఏ అంశాన్నీ ప్రసారం చేయకూడదని ఎన్నికల సంఘం ఆయా ఛానెల్స్కు ఆదేశాలు జారీ చేసింది. ప్రసారం చేయడం వల్ల ఓటర్లను ప్రభావితం చేసినట్లవుతందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.