కనీస వేతనం నేరుగా పేదల అకౌంట్లోకే: ఎన్నికల వేళ రాహుల్ సరికొత్త వ్యూహం
2019లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలకు కనీస వేతనం అందిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. పేదవారికి నేరుగా తమ బ్యాంకు ఖాతాలోకి ఈ కనీస వేతనం జమ అవుతుందని దీనిపై ఇప్పటికే చర్చించామని రాహుల్ గాంధీ తెలిపారు. ప్రపంచంలో ఏదేశం అమలు చేయని పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా అమలు చేస్తుందని హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ.
कांग्रेस पार्टी ने एक ऐतिहासिक निर्णय लिया है कि 2019 चुनाव जीतने के एकदम बाद कांग्रेस पार्टी गारंटी करके न्यूनतम आमदनी देने जा रही है : कांग्रेस अध्यक्ष @RahulGandhi #CongressForMinimumIncomeGuarantee pic.twitter.com/jTttgR2wFB
— Congress (@INCIndia) January 28, 2019
పేదలకు కనీస వేతనం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎవరూ పేదవారిగా ఉండరని ఆకలితో ఎవరూ పస్తులు ఉండరని అన్నారు రాహుల్ గాంధీ. ఇది ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పేదలకు కనీస వేతనం అమలు చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. ఈ చారిత్రక పథకాన్ని కాంగ్రెస్ అమలు చేసి తీరుతుందని పునరుద్ఘాటించారు. అయితే అంతకంటే ముందు కాంగ్రెస్ను ఆశీర్వదించాలని అధికారంలోకి తీసుకురావాలని రాహుల్ గాంధీ ప్రజలను వేడుకున్నారు.
కాంగ్రెస్ విజయంలో రైతులదే కీలక పాత్ర
గతేడాది జరిగిన ఛత్తీస్గడ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టినందుకు రాహుల్ ఛత్తీస్గడ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అక్కడ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. కిసాన్ అబహార్ సమ్మేళన్ పేరుతో నిర్వహించిన సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ 15 ఏళ్ల తర్వాత కాంగ్రెస్కు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా రైతులు కాంగ్రెస్ గెలుపులో కీలకంగా వ్యవహరించారని ఆయన కొనియాడారు. ఇదే స్ఫూర్తిని రేపు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా చూపించాలని రాహుల్ గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు.
రైతు రుణమాఫీకి లేని డబ్బులు పారిశ్రామికవేత్తలకు ఇచ్చేందుకు ఉన్నాయా..?
విపక్షంలో ఉన్న సమయంలో రైతుల గురించి వారు రుణాలను మాఫీ చేయాలని బీజేపీపై ఒత్తిడి తీసుకొచ్చామని గుర్తు చేశారు రాహుల్ గాంధీ. అయితే డబ్బులు లేవని ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చిందని చెప్పారు. మధ్యప్రదేశ్లో అడిగినా నాటి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం కూడా ఇదే సమాధానం ఇవ్వగా ... రాజస్థాన్లోని వసుంధర రాజే సర్కారు కూడా డబ్బులు లేవనే సమాధానం ఇచ్చిందని గుర్తు చేశారు రాహుల్. ఢిల్లీలో కూడా ప్రధాని మోడీ రైతు రుణమాఫీ చేసేందుకు డబ్బులు లేవని చెబుతున్నారని అయితే 15 మంది బడా పారిశ్రామికవేత్తలకు మాత్రం ఇచ్చేందుకు డబ్బులు ఉన్నాయని రాహుల్ విమర్శించారు. భారతదేశానికి ఒక వాచ్మన్ అని చెప్పుకుంటున్న ప్రధాని మోడీకి రైతులకు రుణ మాఫీ చేసేందుకు రూ.6వేల కోట్లు లేవంటున్నారు కానీ... అదే అనిల్ అంబానీకి మాత్రం రూ. 30వేల కోట్లు ఇచ్చేందుకు సిద్ధపడ్డారని రాఫెల్ ఒప్పందాన్ని ఉద్దేశిస్తూ రాహుల్ వ్యాఖ్యలు చేశారు.