రాజకీయాలకు రాంరాం, కానీ ఎంపీగా కొనసాగుతా: మనసు మార్చుకున్న బాబుల్ సుప్రియో -బీజేపీ చీఫ్ నడ్డాతో భేటీ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇచ్చిన షాక్ నుంచి బీజేపీ నేతలు ఇంకా తేరుకోలేకపోతున్నారు. బెంగాల్ లో బీజేపీ పరాజయాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ పార్టీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో రెండ్రోజుల కిందటే సంచలన నిర్ణయం ప్రకటించారు. ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పిన ఆయన ఇవాళ అనూహ్యంగా మనసు మార్చుకున్నారు..
రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాననే మాటపై నిలబడతానంటూనే రాజీనామా విషయంలో మాత్రం యూ-టర్న్ తీసుకున్నారు బాబుల్ సుప్రియో. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండబోనన్న మరోసారి స్పష్టం చేసిన ఆయన.. రాజ్యాంగ పదవి కాబట్టి ఎంపీగా మాత్రం కొనసాగుతానని క్లారిటీ ఇచ్చారు. సోమవారం ఢిల్లీలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ బాబుల్ ఈ విషయాన్ని తెలిపారు. అంతేకాదు,
రాజ్యంగ పదవి కాబట్టి ఎంపీగా కొనసాగుతాన్న బాబుల్.. ఒక వేళ తన పనిలో ఎక్కడైనా రాజకీయాలు చేయాల్సి వస్తే పదవి నుంచి తప్పుకుంటానన్నారు. ఇప్పటికే మమత ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా బీజేపీకి చెందిన నేతలు పెద్ద ఎత్తున టీఎంసీలో చేరుతోన్న దరిమిలా, బాబుల్ సుప్రియో కూడా అదే పని చేస్తారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. తాను ఏ పార్టీలోనూ చేరబోనని క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలోని ఎంపీ బంగ్లాను ఖాళీ చేస్తానని, భద్రతా సిబ్బందిని కూడా వెనక్కి ఇచ్చేస్తానని చెప్పారాయన.
Recommended Video
పశ్చిమ బెంగాల్ లో కోల్ కతా తర్వాత అతిపెద్ద సిటీ అయిన అసన్సోల్ సిటీ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తోన్న బాబుల్ సుప్రియో 2014 నుంచి కేంద్రంలో వివిధ మంత్రిత్వశాఖలకు సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినమరీ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఘోరంగా ఓడిపోవడం, గత నెలలో మోదీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో చోటు దక్కకపోవడం ఆయనలో అశాంతిని రేకెత్తించింది. అప్పట్నుంచి నిరుత్సాహంతో ఉంటూ వచ్చిన బాబుల్.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు శనివారం ప్రకటించారు. ఇవాళ నడ్డాతో భేటీ తర్వాత కాస్త మెత్తబడి, ఎంపీగా కొనసాగుతానన్నారు. బాబుల్ రాజకీయ సన్యాసం వట్టి డ్రామా అని, దమ్ముంటే రాజీనామా చేయాలని టీఎంసీ నేతలు వ్యాఖ్యానించారు.