ప్రస్తుతం అసలు ప్రభుత్వ ఉద్యోగాల్లేవు: రిజర్వేష్లపై గడ్కరీ సంచలనం
న్యూఢిల్లీ: విద్య, ఉద్యోగాల్లో తమకు రిజర్వేషన్లు కల్పించాలని మహారాష్ట్రలో మరాఠాలు ఉద్యమిస్తున్న నేపథ్యంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల డిమాండ్ పెరుగుతుండటంపై గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలే కరువయ్యాయని, అలాంటప్పుడు రిజర్వేషన్లతో పని ఏమిటని ప్రశ్నించారు.
ఈ రిజర్వేషన్ల అంశం ప్రస్తుతానికి అంతగా పనిచేయదన్నారు. మరాఠాలకు రిజర్వేషన్ అంశంపై కేంద్రం చర్చిస్తోందని, అయితే, దీనిని అదనుగా చేసుకుని ప్రతిపక్షాలు ఈ అంశంపై ఆజ్యం పోస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజలను రెచ్చగొడుతున్నాయన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలు లేవని, ఐటీ విప్లవం వల్ల బ్యాంకుల్లో కూడా ఉద్యోగాలు తగ్గిపోయాయని చెప్పారు.
మరి ఉద్యోగాలు ఎక్కడున్నాయని, అవే లేనప్పుడు ఇక రిజర్వేషన్లు ఏమిటని ప్రశ్నించారు. అందరూ మేం వెనుకబడిన వర్గాలకు చెందిన వారమే అంటారని, బీహార్, యూపీలలో బ్రాహ్మణులు ఎక్కువగా ఉన్నారని, అక్కడ వారు రాజకీయంగానూ బలంగానే ఉన్నారని, వాళ్లు కూడా మేం వెనుకబడిన వర్గాల వారిమే అంటారని, అయితే, ప్రతి వర్గంలోనూ ఉన్న నిరుపేదలను మనం గుర్తించాలన్నారు.
అన్ని సామాజిక వర్గాల్లోను ధనికులు ఉన్నారని, అదే సమయంలో తిండి, బట్టకు నోచుకోని నిరుపేదలు అగ్రవర్ణాల్లో కూడా ఉన్నారని చెప్పారు. అలాంటి వాళ్లకే రిజర్వేషన్లు ఉపయోగపడతాయని గడ్కరీ అన్నారు. కులం ఆధారంగా కాకుండా ఆర్థికపరంగా రిజర్వేషన్లు ఇచ్చే అంశం గురించి ప్రస్తుతం ఆలోచన లేదని చెప్పారు.