నో కామెంట్, చెప్పేదేం లేదు: బీజేపీలో చేరడంపై రజనీకాంత్ సస్పెన్స్
తాను రాజకీయాల్లో వస్తానని బుధవారం రజనీకాంత్ మరోమారు సూచనప్రాయంగా తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఏం చెప్పాలనుకుంటున్నానో అది అభిమానులకు చెప్పానని, ఇక ఇప్పుడు చెప్పేందుకు ఏమీ లేదన్నారు
చెన్నై: తాను రాజకీయాల్లో వస్తానని బుధవారం రజనీకాంత్ మరోమారు సూచనప్రాయంగా తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఏం చెప్పాలనుకుంటున్నానో అది అభిమానులకు చెప్పానని, ఇక ఇప్పుడు చెప్పేందుకు ఏమీ లేదన్నారు.
తన అభిమానులను కలుసుకొని సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అదే సమయంలో ఆయన బీజేపీలో చేరుతారనే వార్తలను సమర్థించలేదు. అలాగని ఖండించలేదు. రాజకీయాల్లోకి ఒకవేళ వస్తే బీజేపీలో చేరుతారా అంటే ఆశించిన సమాధానం రాలేదు. దీనిపై నో కామెంట్ అన్నారు.
రాజకీయాల్లో ప్రస్తుతానికి చేరాలని లేదని అభిప్రాయపడ్డారు. చేరాలనుకుంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. దీంతో రజనీకాంత్ రాజకీయాల్లో చేరడంపై కన్ఫ్యూజన్ కొనసాగుతోంది.
2009 తర్వాత రజనీ తొలిసారి ఫ్యాన్స్తో సమావేశమవుతున్నారు. రజనీ స్పెషల్ దర్బార్లో మూడో రోజు భేటీ సందర్భంగా అభిమానులు ఆయనతో ఫొటోలు దిగేందుకు పడ్డారు.
తరచూ తన మనసు మారిపోతుందని మీడియా చేస్తున్న వ్యాఖ్యలను రజనీకాంత్ తోసిపుచ్చారు. తాను ఏ విషయం పైన అయినా స్పష్టంగా ఆలోచిస్తానని, బలంగా నిర్ణయాలు తీసుకుంటానన్నారు.
ఎనిమిదేళ్లు ఎందుకంటే..
అభిమానులను కలుసుకునేందుకు ఎనిమిదేళ్లకు పైగా సమయం పట్టడానికి రజనీ కారణాలు చెప్పారు. ఎంథిరన్ తర్వాత వచ్చిన చిత్రాలు నిరాశపర్చడంతో అభిమానుల మందుకు రాలేకపోయినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన 2.0 సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం 2018 జనవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
రజనీ రాకపై డీఎంకే
రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారంపైడీఎంకే స్పందించింది. అది ఆయన వ్యక్తిగత నిర్ణయమని చెప్పారు. పీఎంకే వంటి పార్టీలు ఆయన రాజకీయాల్లోకి రావడాన్ని వ్యతిరేకిస్తున్నారు.
బీజేపీలో రెండు రకాలుగా..
కేంద్రమంత్రి పోన్ రాధాకృష్ణన్, బీజేపీ తమిళనాడు అధ్యక్షులు తమిళసాయి సౌందరరాజన్లు సూపర్ స్టార్ రాజకీయాల్లోకి వస్తామంటే స్వాగతిస్తామన్నారు.
అదే సమయంలో అదే బీజేపీకి చెందిన సుబ్రహ్మణ్య స్వామి మాత్రం ఆయన రాజకీయాల్లోకి రావొద్దని, ఆయనకు రాజకీయాలు తెలియవంటున్నారు. అంతేకాదు, రజనీకాంత్ బెంగళూరుకు చెందిన మరాఠీ అని, తమిళుడు కాదని అంటున్నారు.