‘నా మెడపై కత్తి పెట్టినా ‘భారత్ మాతాకీ జై’ అనే అంటా’
న్యూఢిల్లీ: భారత్ మాతాకీ జై అనడం తనకు గర్వకారణమని కేంద్ర మంత్రి నజ్మా హెప్తుల్లా చెప్పారు. తన మెడపై కత్తి పెట్టి చంపేస్తానన్నా తాను 'భారత్ మాతా కీ జై' చెబుతానని ఆమె స్పష్టం చేశారు. జీవిస్తున్న దేశానికి జై చెప్పడం గర్వ పడాల్సిన విషయమని, మతాలకు తావు లేదని ఆమె అన్నారు.
భారత్ మాతా కీ జై అనడం నా హక్కు: జావేద్ అక్తర్
'ప్రజాస్వామ్యం, లౌకికవాదం, రాజ్యాంగం, యువశక్తి ఇవి భారత్కు ప్రయోజనకర అంశాలు.. వీటిని ప్రజలు ఆస్వాదిస్తున్నారు.. వాటిని నాశనం చేయకూడదు' అని ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ అన్నారు. ఆయన రాజ్యసభలో తుది ప్రసంగం చేశారు. ఆయన ప్రసంగానికి పార్టీలకతీతంగా సభ్యులందరి నుంచి మంచి స్పందన లభించింది.
దేశంలో అన్ని వర్గాల్లోనూ చర్చ జరుగుతున్న అసహనంపైనా జావేద్ మాట్లాడారు. పలుమార్లు ఆయన తన ప్రసంగంలో 'భారత్ మాతాకీ జై' అని నినదించారు. ఇది తన హక్కు అని నొక్కి చెప్పారు. జావేద్ రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులు.. ఈ ఏడాది ఆయన పదవీ కాలం పూర్తవుతోంది.
ప్రభుత్వానికి మద్దతుగా కూడా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. 'నా పట్ల నా స్నేహితులు కొందరు నిరాశ చెందినప్పటికీ.. ఈ ప్రభుత్వంలో చాలా మంది సమర్థులు ఉన్నారని నేను నమ్ముతున్నాను' అని అక్తర్ అన్నారు. అభివృద్ధి అనేది జీడీపీలో ఉండదని.. మానవ అభివృద్ధి సూచీ మీద ఆధారపడి ఉంటుందని అన్నారు. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు, ప్రభుత్వం తెలుసుకోవాలన్నారు.