శోభా డే ‘భారీ బందోబస్తు’: తెరపైకి వచ్చిన పోలీస్, షాకింగ్ కౌంటర్ ఇచ్చారు!
స్థూలకాయంతో ఉన్న ఓ పోలీసు ఫొటోను రచయిత్రి శోభాడే ట్విటర్లో పోస్ట్చేసి ‘భారీ బందోబస్తు’ అంటూ అపహాస్యం చేసి విమర్శల పాలైన విషయం తెలిసిందే. కాగా, ఆ పోలీసు ఆమె విమర్శల నేపథ్యంలో ఇప్పుడు తెరపైకి వచ్చారు.
ముంబై: స్థూలకాయంతో ఉన్న ఓ పోలీసు ఫొటోను రచయిత్రి శోభాడే ట్విటర్లో పోస్ట్చేసి 'భారీ బందోబస్తు' అంటూ అపహాస్యం చేసి విమర్శల పాలైన విషయం తెలిసిందే. కాగా, ఆ పోలీసు ఆమె విమర్శల నేపథ్యంలో ఇప్పుడు తెరపైకి వచ్చారు. చికిత్స తీసుకోవాలంటూ శోభా డే ఇచ్చిన ఉచిత సలహా గురించి విన్న ఆయన.. ఆమెకు సరైన జవాబిచ్చారు. అంతకుముందు మహారాష్ట్ర పోలీసులు కూడా ఆమెకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
'భారీ బందోబస్త్': శోభాడేకు ముంబై పోలీస్ స్ట్రాంగ్ కౌంటర్
అతిగా తినడం వల్ల కాదు..
180 కిలోల బరువున్న జోగావట్ తాను అతిగా తినడం వల్ల లావవలేదని, ఇన్సులిన్ అసమతౌల్యత వల్ల స్థూలకాయం వచ్చిందని దౌలత్రామ్ జోగావట్(58) పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ పోలీస్ శాఖకు చెందిన జోగావట్ నీముచ్ పోలీస్ లైన్స్లో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఫొటోను ఎవరో ట్వీట్ చేయగా శోభ దాన్ని రిట్వీట్ చేస్తూ ‘ఎన్నికలకు భారీ బందోబస్తు' అని క్యాప్షన్ ఇచ్చి పోస్ట్ చేశారు.
తొలినాళ్లలో సన్నగానే..
పాతికేళ్లక్రితమే తనకో శస్త్రచికిత్స జరిగిందని, ఆ తర్వాత ఇన్సులిన్ అసమతౌల్యం వల్ల స్థూలకాయం వచ్చిందని జోగావట్ పత్రికలవారికి తెలిపారు. ఉద్యోగంలో చేరిన కొత్తలో తాను సన్నగా ఎలా ఉండేవాడో ఆ ఫొటోను కూడా చూపారు.
శోభాడే ట్వీట్తో నొచ్చుకున్న జోగావట్
శోభాడే వ్యాఖ్యలపట్ల నొచ్చుకున్నట్లు కన్పించిన జోగావట... ‘సన్నగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు? మేడమ్ అని అన్నారు. ‘కావాలనుకుంటే నా చికిత్సకు సాయపడవచ్చు..' అని జోగావట్ శోభా డేకు సూచించారు.
అంకిత భావంతో విధులు
కాగా, జోగావట్ లావుగా ఉన్నప్పటికీ విధి నిర్వహణ ఎంతో అంకిత భావంతో చేస్తారని, ఆయనకు అప్పజెప్పిన కేసుల్లో సమర్థంగా విచారణ జరిపినందుకు పలుమార్లు పై అధికారుల ప్రశంసలందుకున్నారని నీముచ్ ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు.సింహస్థ కుంభమేళా సమయంలో కూడా ఆయన నెలరోజులపాటు చక్కగా విధులు నిర్వహించారని వెల్లడించారు.