అసోంలో కమల వికాసమే.. ఏబీపీ న్యూస్ సీ ఓటర్ ఓపినీయన్ పోల్..
అసోం.. కాంగ్రెస్ కంచుకోట.. ఐదేళ్ల క్రితం వరకు ఆ పార్టే రూలింగ్. వరసగా 15 ఏళ్ల ఏకఛత్రాధిపత్యం కొనసాగింది. కానీ 5 ఏళ్ల క్రితం పరిస్థితి మారింది. బీజేపీ కూటమి అధికారం చేపట్టింది. 126 సీట్లు గల అసోంలో ఏజీపీ, బీపీఎఫ్తో కలిసి కూటమి ఏర్పాటు చేసింది. బీజేపీ 60, ఏజీపీ 14, బీపీఎఫ్ 12 సీట్లను గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 26 సీట్లకే పరిమితమైపోయింది. వరసగా మూడుసార్లు సీఎం పదవీ చేపట్టిన తరుణ్ గొగొయ్ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. ప్రభుత్వ వ్యతిరేకతను బీజేపీ క్యాష్ చేసుకుంది.
మరి కొద్దిరోజుల్లో అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏబీపీ సర్వే చేపట్టింది. అందులో వివిధ ప్రశ్నలను అసోం ప్రజలను అడిగారు. ఈ వివరాలను తెలుసుకుందాం పదండి. కేంద్ర ప్రభుత్వ తీరుతో మీరు సంతృప్తి చెందారా అని అడిగితే 25 శాతం మంది చాలా సంతృప్తి చెందామని చెప్పారు. మెజార్టీ 43 శాతం మంది సంతృప్తి చెందామని వివరించారు. 20 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. 12 శాతం మంది ప్రజలు ఏం చెప్పలేకపోయారు.
ప్రధాని మోడీ పనితీరుపై 33 శాతం చాలా సంతృప్తి చెందామని చెప్పగా.. 37 శాతం ఓకే అని చెప్పారు. 16 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. 14 శాతం మంది ఏమీ చెప్పలేకపోయారు. సీఎం సోనోవాల్ పనితీరు గురించి 35 శాతం ఆహా ఓహో అన్నారు. 31 శాతం మంది సంతృప్తి చెందారు. 22 శాతం మంది మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. 12 శాతం మంది ఏమీ చెప్పలేకపోయారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు గురించి 33 శాతం మంది వెరీ సాటిస్ఫైడ్, 37 శాతం సంతృప్తి చెందారు. 19 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. 11 శాతం మంది ఏమీ చెప్పలేకపోయారు.
అసోంలో ఎన్డీఏ కూటమి 73-81 సీట్లు గెలుచుకుంటుందని.. యూపీఏ 36-44 సీట్లు గెలుచుకుంటుందని చెప్పారు. ఏఐడీయూఎఫ్ 5-9, ఇతరులు 4 సీట్ల వరకు గెలుచుకుంటారని పేర్కొన్నారు. ఎన్డీఏ 43 శాతం ఓట్లు, యూపీఏ 35 శాతం, ఏఐడీయూఎఫ్ 8 శాతం, ఇతరులు 14 శాతం సాధిస్తారని పేర్కొన్నది.