ప్రధాని ఇంటి బయట నిరసన చేపడుతాం..? అసెంబ్లీ సమావేశపరచాలని రాష్ట్రపతిని కోరతాం: గెహ్లట్..
రాజస్తాన్ రాజకీయలు ఆసక్తికరంగా మారుతోన్నాయి. అసెంబ్లీని సమావేశ పరచాలని కాంగ్రెస్ గట్టిగా కోరుతోంది. నిన్న ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్ భవన్ ఎదుట ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఇవాళ కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనకు దిగాయి. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోంది. అసెంబ్లీని సమావేశ పరచాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కోరతామని సీఎం అశోక్ గెహ్లటె్ తెలిపారు.
రాష్ట్రపతి భవన్ వద్దకెళ్లి కోవింద్ను కలుస్తామని పేర్కొన్నారు. తర్వాత అవసరమైతే ప్రధాని నరేంద్ర మోడీ నివాసం బయట ఆందోళన చేపడుతామని తెలిపారు. జైపూర్లో సీఎల్పీ సమావేశం తర్వాత గెహ్లట్ మీడియాతో మాట్లాడారు. జైపూర్ సహా జిల్లాల్లో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. తక్షణమే అసెంబ్లీని సమావేశపరచాలని కోరారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీని సమావేశ పరిస్తే.. గెహ్లట్ తన బలాన్ని నిరూపించుకుంటారని శ్రేణులు తెలిపారు.
శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా ఆరు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. 200 మంది సభ్యులు గల అసెంబ్లీలో తనకు తగిన బలం ఉంది అని గెహ్లట్ చెబుతున్నారు. తిరుగుబాటు నేత పైలట్ సహా 19 మంది క్యాంప్లో ఉన్న సరే తనకు మద్దతు ఉంది అని గెహ్లట్ విశ్వాసంతో ఉన్నారు.
శుక్రవారం ఉదయం గవర్నర్ కల్ రాజ్ మిశ్రాతో గెహ్లట్ సమావేశమై.. అసెంబ్లీని సమావేశపరచాలని గెహ్లట్ కోరారు. అయితే కరోనా వ్యాప్తి ఎక్కువ ఉన్న నేపథ్యంలో సమావేశ పరచలేమని స్పష్టంచేశారు. దీంతో గెహ్లట్ సహా ఎమ్మెల్యేలు రాజ్ భవన్ వద్ద ఆందోళన చేపట్టారు.
Recommended Video
ఇదిలాఉంటే మరోవైపు రాజస్తాన్ బీజేపీ నేతల ప్రతినిధి బృందం గవర్నర్ కల్ రాజ్ మిశ్రాను కలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అరాచకత్వం కొనసాగిస్తోందని వినతిపత్రం అందజేశారు. రాజ్ భవన్ ముట్టడించాలని సీఎం గెహ్లట్ ప్రకటన గవర్నర్, కార్యాలయ సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేయడమేనని తెలిపారు.