మీ తల్లిని చూస్కుంటా: మోడీకి అల్వీ, కాశీలో ఉద్రిక్తం
న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత రషీద్ అల్వీ లేఖ రాశారు. ఆటో రిక్షాలో వెళ్తూ, ఒక చిన్న గదిలో జీవితం వెళ్లదీస్తున్న తన తల్లిని బాగా చూసుకోవాలని మోడీకి రషీద్ అల్వీ తన లేఖలో సూచించారు.
మోడీ ప్రచారంలో చేస్తున్న ప్రసంగాల్లో తన తల్లి గురించి మాట్లాడుతూ కష్టకాలంలో ఆమె ఇళ్లల్లో పాచి పనులు చేస్తూ తనను పెంచి పెద్ద చేసిందని చెప్పుకుంటున్నారనీ, మరి అటువంటి ఆమె ఇప్పటికీ ఒక చిన్న గదిలో ఉంటూ, ఆటో రిక్షాలో ఓటు వేయడానికి రావడం చూసి తన మనసు చలించిపోయిందన్నారు.
మోడీ దగ్గర తల్లికి సమకూర్చడానికి తగినంత ఆదాయం ఉన్నా కూడా పట్టించుకోవడం లేదన్నారు. తన ఎదుగుదల కోసం జీవితాన్ని ధారపోసిన తల్లికి ఎందుకు కనీస వసతులు సమకూర్చడం లేదో అర్థం కావడం లేదన్నారు. మీ అమ్మ తనకు కూడా అమ్మ లాంటిందని, తన దగ్గర మీ అంత డబ్బు లేకపోయినా ఆమె యోగక్షేమాలు చూడడానికి తనకు అనుమతి ఇవ్వాలని కోరారు.
నామినేషన్ వేసేప్పుడు మోడీ తన దగ్గర రూ.1.25 కోట్ల కంటే ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నా తన తల్లికి కనీస ప్రాథమికావసరాలు సమకూర్చడంలో విఫలమయ్యారన్నారు. రషీద్ అల్వీ లేఖ పైన బిజెపి స్పందించింది.
వారణాసిలో టెన్షన్
మోడీ ర్యాలీకి వారణాసిలో ఎన్నికల సంఘం అనుమతి తిరస్కరించింది. దాంతో, ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ పార్టీ కార్యకర్తలు కాశీలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. మోడీ సభకు అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన చేస్తున్నారు. ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు.