చిక్కులు - శశికళ ఆందోళన: మొదటి అడుగులోనే దెబ్బ తగిలితే!
శశికళకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు భయం ఉంది. అప్పీలు కేసులో ప్రతికూలంగా తీర్పు వెలువడితే తన రాజకీయ భవిష్యత్తును దెబ్బ తీస్తుందని ఆమె భావిస్తున్నారు.
చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి పదవుల కోసం దివంగత జయలలిత నెచ్చెలి శశికళ ఉబలాటపడుతున్నారు. అయితే ఆమెకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు భయం ఉంది. అప్పీలు కేసులో ప్రతికూలంగా తీర్పు వెలువడితే తన రాజకీయ భవిష్యత్తును దెబ్బ తీస్తుందని ఆమె భావిస్తున్నారు. ఈ కారణంగా కూడా ఆమె పార్టీ బాధ్యతలపై డైలమాలో ఉన్నారని అంటున్నారు.
శశికళ రెండో ముద్దాయి
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో దివంగత జయలలిత తొలి ముద్దాయి. శశికళ రెండో ముద్దాయి. ఇళవరసి, సుధాకరన్ మూడు, నాలుగో ముద్దాయిలుగా ఉన్నారు. చెన్నై, బెంగళూరులలో పద్దెనిమిదేళ్లుగా సాగిన కేసులో జయకు రూ.100 కోట్ల జరిమానా, పదేళ్ల జైలు శిక్ష పడింది. శశికళ, ఇళవరసి, సధాకరన్లకు రూ.10 కోట్ల జరిమానా, పదేళ్ల జైలు శిక్ష పడింది. 2014లో బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది.
జైలు జీవితం
వీరంతా కొద్ది రోజులు జైలు జీవితం గడిపారు. అనంతరం బెయిల్ పైన బయటకు వచ్చారు. బెంగళూరు హైకోర్టులో అప్పీలు చేసుకున్నారు. నిర్దోషులుగా బయటపడ్డారు. అయితే దీనిని కర్నాటక ప్రభుత్వం, డీఎంకేలు సుప్రీం కోర్టులో సవాల్ చేశాయి. ఈ అప్పీలు కేసు ఇప్పుడు సుప్రీం కోర్టులో విచారణలో ఉంది.
శశికళ ప్రోద్బలంతోనే..
ఈ నేపథ్యంలో, జయలలిత మృతి చెందారు. శశికళ కేసులో నెంబర్ 2 ముద్దాయి. శశికళ ప్రోద్బలంతోనే జయలలిత అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. బెంగళూరు కోర్టు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు ప్రకారం నలుగురు దోషులే.
శశికళకు అవినీతి నిరోధక చట్టం వర్తింపుపై..
అవినీతి నిరోధక చట్టం కింద జయపై కేసు నమోదయింది. ప్రభుత్వ బాధ్యతల్లో ఉన్న వారే ఈ చట్టం కింద శిక్షార్హులు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జయకు ఈ చట్టం వర్తిస్తుంది. శశికళకు ఈ చట్టం వర్తించదనే వాదన వినిపిస్తోంది. అవినీతికి ప్రోత్సహించారని ఆరోపిస్తూ శశికళపై ఐపీసీ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ చట్టం కిందనే వారికి బెంగళూరు కోర్టు శిక్ష వేసింది. ఈ తీర్పును సుప్రీం కోర్టు సమర్థిస్తే శశికళ, ఇళవరసి, సుదాకరన్లకు జైలు శిక్ష తప్పదంటున్నారు.
పగ్గాలపై శశికళ డైలమా వెనుక..
ఇటు పార్టీ పగ్గాలు, అటు ప్రభుత్వ పగ్గాలు చేపట్టాలని శశికళ ఉవ్వీళ్లురుతున్నారని అంటున్నారు. అయితే, పార్టీలో అందరు సానుకూలంగా ఉన్నప్పటికీ కొంత వ్యతిరేకత ఉంది. మెజార్టీ మద్దతు ఉన్నప్పటికీ శశికళ పార్టీ పగ్గాలు లేదా ప్రభుత్వ చేపట్టడానికి ఆలోచించడం వెనుక కేసు కారణమని అంటున్నారు. తీరా ఆమె పగ్గాలు చేపట్టగానే... సుప్రీం కోర్టు తీర్పు వెలువడితే మళ్లీ ఆమె దిగి పన్నీరు సెల్వంకో మరొకరికో సీఎం పగ్గాలు అప్పగించాలి. దీనికి బదులు నిరీక్షిస్తే బాగుంటుందని శశికళ భావిస్తున్నారని తెలుస్తోంది. పార్టీ పగ్గాలు చేపట్టడానికి కూడా ఆలోచించడం వెనుక కేసు కారణం కావొచ్చని అంటున్నారు. అయితే, ఆమె డైలమాలో ఉండగానే.. మద్దతు పలికిన పన్నీరు సెల్వం చక్రం తిప్పుతున్నట్లుగా కనిపిస్తోంది.