చైనాపై సర్జికల్ స్ట్రైక్ దాడులు చేస్తారా !
ముంబై: భారత్ సరిహద్దుల్లో చైనా దూకుడుగా వ్యవహరిస్తుందని, ఇటీవల లడఖ్ లో చైనా సైన్యం చొచ్చుకుని వచ్చినట్లు వార్తలు వచ్చాయని, ఈ సందర్బంలో ఆదేశం మీద సర్జికల్ స్ట్రైక్ దాడులు చేసే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి ఉందా ? లేదా ? అని బీజేపీ మిత్రపక్షం శివసేన సూటిగా ప్రశ్నించింది.
ఊరీ ఉగ్రదాడి తరువాత భారత్ పాక్ అక్రమిత కాశ్మీర్ లోకి చొరబడి ఉగ్రవాద శిభిరాలపై సర్జికల్ స్ట్రైక్ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో శివసేన తన మిత్రపక్షం బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది.
పాక్ అక్రమిత కాశ్మీర్ లో జరిగిన సర్జికల్ స్ట్రైక్ దాడులు చూసి మేము గర్వంగా ఉన్నాం. పక్కనే ఉన్న చైనా కూడా మనల్ని రెచ్చగొడుతుందని, ఇలాంటి సమయంలో చైనా మీద సర్జికల్ స్ట్రైక్ దాడులు చేసే అవకాశం ఉందా ? అని శివసేనకు చెందిన సామ్నా పత్రిక తన సంపాదకీయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
మన కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ నిత్యం సొంత డబ్బా కొట్టుకునే వ్యక్తి అని శివసేన మండిపడింది. చైనా చొరబాటుకు వ్యతిరేకంగా భారత సైనికులు ఏం చర్య తీసుకున్నారో బడాయిలు చెప్పుకొనే రక్షణ శాఖా మంత్రి మనోహర్ పారికర్ ఆ వివరాలు వెల్లడించాలని శివసేన డిమాండ్ చేసింది.
మనం కేవలం పాకిస్థాన్కు హెచ్చరికలు జారీచేస్తే సరిపోదు. రక్షణమంత్రిగా మన సరిహద్దులను భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉందని శివసేన గుర్తు చేసింది.
బహిరంగ సభల్లో పాక్ కు వ్యతిరేకంగా మాట్లాడితే హర్షాతిరేకాలు లభిస్తాయి అది సహజం. అయితే రాజకీయ హర్షాతిరేకాల కోసం కాకుండా దేశ సమగ్ర భద్రతపై దృష్టి పెట్టాల్సిన భాద్యత ఆయన మీద ఉందని, ఆ సమయం ఇప్పుడు వచ్చిందని సామ్నా పత్రిక పేర్కొంది.
ఇతర దేశాల సరిహద్దుల్లో భద్రతను గాలికొదిలేసి కేవలం పాకిస్థాన్తో ఉన్న సరిహద్దులపైన కేంద్రం దృష్టి పెట్టినట్టు కనిపిస్తోందని, ఇది ప్రజలను తప్పుదోవపట్టించినట్లు అవుతుందని సామ్నా విమర్శించింది.
పాకిస్థాన్ తో ఇప్పుడు ఎలాగున్నామో చైనా పట్ల మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాల ఉందని శివసేన చెప్పింది. పాకిస్థాన్కు ఒక్క అంగుళం కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదని మనం మాట్లాడుతున్నాం అని శివసేన గుర్తు చేసింది.
అదే సమయంలో లడఖ్, అరుణాచల్ ప్రదేశ్, లేహ్లో చైనా తీవ్రంగా చొచ్చుకొచ్చినా మనం మాట్లాడటం లేదు. ఎందుకని ? ఈ పద్దతి సరికాదని సామ్నా పత్రిక పేర్కొంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో మిత్రపక్షంగా కొనసాగుతున్నప్పటికీ ఆ పార్టీతో శివసేన అంటీముట్టినట్టు వ్యవహరిస్తూ గతకొన్ని నెలలుగా విమర్శలు సంధిస్తున్నది.