ఉపాధి కల్పనలో అట్టడుగున బీహార్- వేతనాలూ దారుణమే - ఎన్నికల్లో అవే కీలకమవుతాయా ?
మూడు దశాబ్దాలుగా బీహార్లో రాజ్యమేలుతున్న రెండు పార్టీల నేతృత్వంలోని రెండు కూటములు ఉద్యోగాల కల్పనలో దారుణంగా విఫలమయ్యాయి. కనీస వేతనాలు కూడా కల్పించలేకపోతున్నాయి. ప్రజల్లో పనిచేసే ఆసక్తిని కల్పించడంలోనూ వైఫల్యమే. పారిశ్రామికాభివృద్ధి చూసినా పతనమే. జాతీయ సగటుతో పోలిస్తే పలు అంశాల్లో బీహార్ మూడో వంతు కూడా లేకపోవడం అక్కడి పరిస్ధితికి అద్దం పడుతున్నాయి. ఇప్పుడు ఇవే అంశాలు బీహార్ ఫలితాలను ప్రభావం చేయబోతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని బీహార్లో ఈసారి ఆర్ధికాంశాల ప్రభావంతో జనం తమ ఓటును నిర్ణయించబోతున్నట్లు తెలుస్తోంది.
బీహార్ పోలింగ్ వేళ ఎన్డీయే కూటమిలో లుకలుకలు- బీజేపీ పోస్టర్లలో కనిపించని నితీశ్..
బీహార్ నిరుద్యోగిత..
బీహార్లో నిరుద్యోగిత రేటు జాతీయ సగటుతో పోలిస్తే భారీగా ఉంది. ఒకవేళ ఉద్యోగం దొరికినా లభిస్తున్న వేతనాలు కూడా చాలా తక్కువగానే ఉంటున్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బీహార్లో పనిచేసే పురుషుల శాతం కూడా 64శాతం మాత్రమే. దేశంలో సగటు కంటే ఇది దాదాపు 8 శాతం తక్కువ. గ్రామీణ బీహార్లో పనిచేసే మహిళల శాతం కేవలం 3.9 శాతమే. బీహార్లో 55.9 శాతం మంది పురుషులు స్వయం ఉపాధి పొందుతున్న వారే. నేరుగా శ్రామికులుగా ఉన్న వారు 32.1 శాతంగా ఉన్నారు. ఇది దేశ సగటు అయిన 24.3 కంటే ఎక్కువగానే ఉంది. దేశ పారిశ్రామికాభివృద్ధిలో బీహార్ వాటా కేవలం 0.3 శాతమే. రాష్ట్రంలోని ఫ్యాక్టరీల్లో సగటు కార్మికులు లేదా ఉద్యోగుల సంఖ్య కూడా కేవలం 40 మాత్రమే. అదే జాతీయ సగటు చూస్తే 76.7 శాతంగా ఉంది. హర్యానాలోని ఫ్యాక్టరీల్లో కల్పిస్తున్న ఉద్యోగాల శాతం 120తో పోలిస్తే బీహార్ పరిశ్రమలు మూడో వంతు ఉద్యోగాలు మాత్రమే కల్పిస్తున్నాయి.
లాక్డౌన్లో సగం ఉద్యోగాలు ఆవిరి...
లాక్డౌన్ అమల్లో ఉన్న ఏప్రిల్, మే నెలల్లో బీహార్లో నిరుద్యోగిత శాతం 47కు చేరింది. అంటే దాదాపు ప్రతీ ఇద్దరు బీహారీల్లో ఒకరు ఉపాధి లేకుండా పోయారు. అదే సమయంలో దేశంలోనూ కరోనా లాక్డౌన్ కొనసాగినా నిరుద్యోగిత శాతం మాత్రం 24 శాతంగానే ఉందని గణాంకాలు చెబుతున్నాయి. అంటే దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బీహార్పై లాక్డౌన్ ప్రభావం అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ తర్వాత బీహార్లో నిరుద్యోగిత శాతం తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నా జాతీయ సగటుతో పోలిస్తే ఇంకా సుదూరంలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. లాక్డౌన్ ఎత్తేశాక సెప్టెంబర్లో బీహార్ల నిరుద్యోగిత శాతం 12శాతంగా నమోదు కాగా.. అదే సమయంలో దేశవ్యాప్తంగా నిరుద్యోగిత కేవలం 6.67 శాతంగా ఉంది. లాక్డౌన్ సాధారణ పరిస్ధితుల్లో గమనిస్తే బీహార్లో 12 శాతం నిరుద్యోగిత రేటు పెరుగుతున్నట్లుగానే తెలుస్తోంది. దేశ సగటుతో చూసినా బీహార్లో నిరుద్యోగిత రేటు పెరుగుతూనే ఉంది.
దారుణంగా కార్మికుల వేతనాలు
బీహార్లో కార్మికులు, ఉద్యోగుల వేతనాల శాతం కూడా చాలా తక్కువ. సగటున బీహార్లో ఓ కార్మికుడు ఏడాదికి లక్షా 29 వేల రూపాయల వేతనం అందుకుంటుంటే పొరుగున ఉన్న జార్ఖండ్లో ఉన్న వారు అదే సమయంలో 3 లక్షల 73 వేలు తీసుకుంటున్నారు. మహారాష్ట్రలో చూసినా కార్మికుల ఏడాది సగటు వేతనం 3 లక్షల 44 వేలుగా ఉంది. జాతీయ సగటు చూసినా ఇది 2 లక్షల 52వేలుగా కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే బీహార్లో కార్మికులు, ఉద్యోగుల అవస్ధలు సులువుగా అర్ధం చేసుకోవచ్చు. బీహార్లో గరిష్ట ఉపాధి కల్పిస్తున్న మూడు రంగాలు వ్యవసాయం, అటవీ కార్యకలాపాలు, చేపల వేటగా ఉన్నాయి. ఈ మూడు రంగాలపైనే బీహార్లో 45 శాతం మంది ఆధారపడి జీవిస్తున్నారు.
తలసరి ఖర్చూ తక్కువే..
బీహార్లో ప్రజలపై ప్రభుత్వం పెడుతున్న తలసరి ఖర్చు కూడా గత కొన్నేళ్లలో పెరిగింది చాలా తక్కువ. 2011-12లో బీహార్లో ప్రజలపై ప్రభుత్వం 13.3 శాతం ఖర్చు పెడుతుండగా.. 2018-19 నాటికి అది కేవలం 14.2 శాతానికి పెరిగింది. అదీ విద్య, ఆరోగ్యం వంటి వాటిపై జాతీయ స్ధాయిలో పెడుతున్న ఖర్చుతో పోలిస్తే బీహార్లో చాలా తక్కువగా ఖర్చుపెడుతున్నారు. బీహార్లో మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీఎం నితీశ్ కుమార్ హయాంలో అభివృద్ధి ఏ స్ధాయిలో ఉందని చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలు. దీంతో ఈసారి నితీశ్ ఇస్తున్న ఉద్యోగాల హామీ వారిపై ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.
Recommended Video
దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే మూడో వంతు..
బీహార్ నిరుద్యోగితలోనే కాదు ఆర్ధిక వ్యవస్ధ పరంగా చూసినా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే సుదీర్ఘ కాలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 2019-20లో ప్రభుత్వం విడుదల చేసిన ఆర్దిక సర్వే ప్రకారం చూస్తే 2018-19 ఆర్ధిక సంవత్సరంలో బీహారీల తలసరి ఆదాయం కేవలం రూ.30,617 మాత్రమే. ఇది దేశ తలసరి ఆదాయంలో మూడో వంతు మాత్రమేనంటే ఆశ్చర్యం కలుగకమానదు. అంటే దేశంలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే బీహారీల కొనుగోలు శక్తి మూడోవంతు మాత్రమేనని అర్ధమవుతోంది.
ఉద్యోగాల హామీలే కీలకం..
ఇలాంటి పరిస్ధితుల్లో బీహార్ ప్రజల వద్దకు ఓట్ల కోసం వెళుతున్న ఇద్దరు సీఎం అభ్యర్ధులు నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్ లక్షల కొద్దీ ఉద్యోగాలు సృష్టిస్తామని హామీలు ఇస్తున్నారు. ముందుగా మాహాకూటమి సీఎం అభ్యర్ధిగా రేసులో ఉన్న తేజస్వీ యాదవ్ పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇస్తే దాన్ని ఎద్దేవా చేసిన ఎన్డీయే సీఎం అభ్యర్ధి నితీశ్ కుమార్ .. ఆ తర్వాత దానికి రెట్టింపు ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చేశారు. బీహార్ సీఎం అభ్యర్ధులు ఇస్తున్న హామీల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఉద్యోగాలతో పాటు కొత్త ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుత పరిస్ధితుల్లో ఇవి సాధ్యమేనా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. వీరి హామీలను జనం ఏ మేరకు నమ్ముతున్నారనేది ఇవాళ పోలింగ్ నిర్ణయించబోతోంది.