షాకింగ్: కొత్త లెక్కలు, వారణాసిలో నరేంద్ర మోడీపై నితీష్ కుమార్ పోటీ?
న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఊహాగానాల జోరు మామూలుగా లేదు. తెలుగు రాష్ట్రాలలో ఏ పార్టీ ఏ పార్టీతో కలిసి ముందుకు సాగుతుంది? ఏ నాయకుడు ఏ పార్టీలో ఉంటారు? ఏ పార్టీలో చేరుతారు? అనే ఆసక్తి మామూలే. జాతీయస్థాయిలోను సార్వత్రిక ఎన్నికలకు ముందు మరో ఆసక్తికర చర్చ సాగుతోంది.
ప్రధాని నరేంద్ర మోడీ పైన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఇరువురు వారణాసిలో తలపడే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు. 2014లో నరేంద్ర మోడీ రెండు చోట్ల నుంచి పోటీ చేసి అద్భుత విజయం సాధించారు. వారణాసి నుంచి నిలిచి, మరోచోట రాజీనామా చేశారు. ఈసారి కూడా ఆయన వారణాసి నుంచే పోటీ చేయనున్నారు.
వారణాసి నుంచి మోడీ
ఈ నేపథ్యంలోనే మోడీపై నితీష్ పోటీ చేస్తారనే చర్చ ఢిల్లీలో జోరుగా సాగుతోంది. 2014లో మోడీ వారణాసి నుంచి పోటీ చేసి 3,71,784 ఓట్లతో గెలిచారు. నాడు ఆయన సమీప ప్రత్యర్థి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. వచ్చే ఎన్నికల్లో మోడీపై పోటీ చేసే అభ్యర్థి పేరు ఇప్పటి వరకు రాలేదు. కానీ ఇప్పుడు ఢిల్లీలో నితీష్ పేరు చక్కర్లు కొడుతోంది.
నితీష్, ఆర్జేడీ కలుస్తారా?
ప్రస్తుతం బీజేపీ, నితీష్ కుమార్ పార్టీ జేడీయులు కలిసి ముందుకు సాగుతున్నాయి. త్వరలో ఆయన ఎన్డీయే నుంచి వైదొలిగి మూడో ఫ్రంట్ వైపు అడుగులేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్కు నితీశ్ కొద్ది రోజుల కిందట ఫోన్ చేసి ఆరోగ్యం గురించి వాకబు చేశారు. దీని వెనుక ఆయన బీజేపీకి దూరం కావడమే ఉద్దేశ్యమని చెబుతున్నారు.
ఎలా ముందుకు వెళ్తారు?
వాస్తవానికి లాలూ తనయుడు, ఆర్జేడీ వ్యవహారాలు చూస్తున్న తేజస్వీ యాదవ్కు నితీశ్ పొడ గిట్టనే గిట్టడం లేదు. నితీష్కు డోర్లు క్లోజ్ అయ్యాయని ఇప్పటికే తేజస్వి తేల్చి చెప్పారు. ప్రస్తుతం తేజస్వీ తన పార్టీ శ్రేణులను కూడా నితీశ్ వ్యతిరేకతతోనే సమాయత్తపరుస్తున్నారు. కాబట్టి ఎన్డీయే నుంచి బయటకు వచ్చి తమతో కలిసినా నితీశ్ను సీఎం అభ్యర్థిగా తేజస్వి అంగీకరించరు.
ఢిల్లీకి నితీష్, బీహార్కు తేజస్వి?
నితీశ్ కుమార్కు ప్రధాని పీఠంపై ఎప్పటి నుంచో ఆశలు ఉన్నాయి. బీహార్ను వదిలేసి వస్తే ఆయన దాన్ని సాధించుకునే ప్రయత్నాలు చేయవచ్చని అంటున్నారు. మూడో ఫ్రంట్ ఇప్పటికే గట్టి నేత కోసం ఎదురుచూస్తోంది. ఒకవేళ వారణాసి నుంచి పోటీచేస్తే నితీశ్ పేరు జాతీయ స్థాయిలో మార్మోగిపోనుందని అంటున్నారు. నితీష్ ఢిల్లీకి వెళ్తే, తేజస్వి బీహార్కు పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయా అనే చర్చ కూడా సాగుతోంది. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ కూడా నితీష్ కుమార్ను మహాగఠ్బంధన్ కిందకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.