Ayodhya verdict: బాల్ థాక్రే సహా వారినే గుర్తు చేసుకోవాలి: అయోధ్యకు వెళతానంటూ ఉద్ధవ్
ముంబై: అయోధ్య రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు శనివారం ఇచ్చిన తుది తీర్పుపై శివసేన అధినే ఉద్ధవ్ థాక్రే హర్షం వ్యక్తం చేశారు. అంతేగాక, తాను నవంబర్ 24న అయోధ్యలో పర్యటించి శ్రీరాముడ్ని దర్శించుకుంటానని అన్నారు.
Ayodhya verdict: అయోధ్య తీర్పుపై పవన్ కళ్యాణ్ స్పందన
సువర్ణాక్షరాలతో.. 24నే
‘అయోధ్య రామమందిరం వివాదాన్ని పరిష్కరిస్తూ సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చిన తీర్పు భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది. ఈ చారిత్రక తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అందరూ ఈ తీర్పును స్వాగతించారు. నవంబర్ 24న నేను అయోధ్యకు వెళుతున్నా' అని ఉద్ధవ్ థాక్రే చెప్పారు. శివ సైనికులు, ప్రజలు ఈ తీర్పు నేపథ్యంలో శాంతి, సామరస్యాన్ని చాటుకోవాలని పిలుపునిచ్చారు. సంబరాలు ఎవరి మనోభావాలను దెబ్బతీయకూడదని వ్యాఖ్యానించారు.
బాల్ థాక్రే సహా వారినే..
ఈ తీర్పు నేపథ్యంలో ఎవరిని గుర్తు చేసుకోవచ్చు అని మీడియా ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. ‘ఈ రోజు నేను శివసేన సుప్రీమో దివంగత బాలాసాహెబ్ థాక్రే, అశోక్ సింఘాల్, లాల్ కృష్ణ అద్వానీ లాంటి ఇతర అగ్రనేతలను, రామమందిరం కోసం పోరాటం చేసిన కరసేవకులను గుర్తు చేసుకోవాలి' అని ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యానించారు. ఎల్కే అద్వానీని తాను కలుస్తానని చెప్పారు.
అద్వానీని కలుస్తా..
అద్వానీని కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతానని ఉద్ధవ్ థాక్రే చెప్పారు. అయోధ్య రామ మందిరం కోసం ఆయన రథయాత్ర చేశారని గుర్తు చేశారు. అద్వానీని తప్పకుండా కలుస్తానని, ఆయన ఆశీస్సులు తీసుకుంటానని ఉద్ధవ్ థాక్రే చెప్పుకొచ్చారు. ఏడాది క్రితమే తాను అయోధ్యను సందర్శించినట్లు తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మస్థలం నుంచి మట్టి తీసుకెళ్లానని, అది ఎంతో మహత్వపూర్వమైనదని చెప్పారు. శివాజీ పుట్టిన ప్రదేశమైన శివ్నేరికి, అయోధ్యకు తప్పకుండా వెళతానని ఉద్ధవ్ థాక్రే చెప్పుకొచ్చారు.
అక్కడే రామమందిరం
కాగా, అయోధ్యలోని వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని ఆదేశించింది. ముస్లింలకు అయోధ్యలోనే 5 ఎకరాల స్థలం ఇవ్వాలని తీర్పు చెప్పింది. స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో ట్రస్ట్ వేర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం లేదా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్మోహి అఖారా వ్యాజ్యాన్ని కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. పురావస్తు శాఖ నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద స్థలం ప్రభుత్వానికి చెందిందని పేర్కొన్నారు. వివాదాస్పద స్థలంపై ఎవరూ యాజమాన్య హక్కులు కోరలేదని తెలిపారు. నిర్ణయానికి ముందు రెండు మతాల విశ్వాసాలను పరిగణలోకి తీసుకున్నామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ చెప్పారు. అక్కడ మందిరం ఉన్నట్లు పురవాస్తు శాఖ నివేదికలు చెబుతున్నాయని పేర్కొన్నారు.