ఆప్ బహిస్కృత నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ల కొత్త పార్టీ..!
న్యూఢిల్లీ: జాతీయ రాజకీయాల్లో ఓ సంచలనం సృష్టించిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. ఇటీవల కాలంలో ఆపార్టీలో జరుగుతున్న పరిణామాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. దాంతో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కార్యవర్గం నుంచి గత వారం పార్టీ వ్యవస్థాపకులు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ను తొలగించిన విషయం తెలిసిందే.
దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన నేతలంతా కలిసి కొత్త పార్టీని స్థాపించనున్నారనే వార్తలు జాతీయ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కొత్త పార్టీ స్ధాపనపై ఏప్రిల్ 14న ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన వారంతా సమావేశమై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఈ సమావేశం ఆప్ మాజీ సీనియర్ నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ నేతృత్వంలో జరగనుందని తెలుస్తోంది. ఈ సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ అంతర్జాతీయ లోక్పాల్ ఎల్ రామ్ దాస్తో పాటు, సామాజిక వేత్త మేథా పాట్కర్ను కూడా ఆహ్వానించనున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీలో 'ప్రశ్నించడం, అసమ్మతిని' తెలియజేసిందుకు గాను ఆప్ జాతీయ కార్యవర్గం పార్టీ వ్యవస్థాపకులు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ను తొలగించడంపై ఆదివారం నాడు ఆప్కు సామాజిక వేత్త మేథా పాట్కర్ రాజీనామా చేశారు.
సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి పార్టీలో ఎలాంటి సమస్యలేదని అన్నారు. ఆందోళన పడాల్సిన అవసరంలేదని, తమ పార్టీలో పరిస్ధితి చక్కబడిందని తెలిపారు. డోన్ట్ వర్రీ, ఆల్ ఈజ్ వెల్ అంటూ వ్యాఖ్యానించారు.