సమాధులపై రామమందిరం పునాదులా: అయోధ్య ట్రస్ట్కు లేఖ రాసిన సుప్రీంకోర్టు లాయర్
అయోధ్య : సమాధి పై రామాలయం నిర్మాణపు పునాదులు వేస్తారా .. అలా వేయొచ్చా ..? అని అయోధ్య రామాలయం ట్రస్టీలను ప్రశ్నించారు సుప్రీంకోర్టు సీనియర్ లాయర్. పలువురి ముస్లింల తరపున ఆయన ట్రస్టు సభ్యులకు లేఖ రాశారు. గతేడాది అయోధ్య బాబ్రీమసీదు భూవివాదంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది. భూవివాదం ఉన్న స్థలాన్ని రామ్లల్లాకు కేటాయస్తూ మసీదు నిర్మాణానికి అయోధ్యలో ఐదెకరాల స్థలం కేటాయించాలంటూ తీర్పులో పేర్కొంది. అంతేకాదు రాముడి ఆలయం నిర్మాణం కోసం ట్రస్టును ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది.
సమాధిపై రాముడి ఆలయం నిర్మాణం చేపడతారా..?
కూల్చివేసిన బాబ్రీ మసీదు కింద సమాధి ఉందని.. కేవలం పట్టుదలకు పోయి సనాతన ధర్మాన్ని మరిచిపోతారాల అంటూ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది షమ్షద్ ట్రస్టు సభ్యులను ప్రశ్నించారు. సనాతాన ధర్మం ప్రకారం ఒక సమాధిపై రాముడికి ఆలయం నిర్మించవచ్చా అనేది మరోసారి సమీక్షించాలని ఆయన కోరారు. ముస్లింల సమాధిపై రాముడి ఆలయం నిర్మించవచ్చా అని ప్రశ్నించారు. దీనిపై ట్రస్టు నిర్వాకులు ఒక నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
బాబ్రీ మసీదు కింద గంజ్ షాహిదాన్ అనే స్మశాన వాటిక
ముస్లింల నమ్మకం ప్రకారం గంజ్ షాహిదాన్ అనే స్మశానం బాబ్రీ మసీదు కూల్చివేసిన ప్రాంతంలో ఉందని చెప్పారు. 1885లో జరిగిన అల్లర్లలో 75 మంది ముస్లింలు మరణించారని వారందరిని అక్కడే సమాధి చేశారని గుర్తు చేశారు షమ్షద్. ఫైజాబాద్ గెజిట్ను పరిశీలిస్తే ఇదే విషయం అందులో ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు. ముస్లింల స్మశాన వాటిక అక్కడ ఉందన్న విషయాన్ని కేంద్రం మరిచిందని లాయర్ షమ్షద్ చెప్పారు. ఇక ధర్మాన్ని పక్కనబెట్టి ఆ ప్రాంతంలో రామాలయం నిర్మాణంకు ప్లాన్ చేస్తోందని చెప్పారు.
అక్కడ ఎలాంటి స్మశాన వాటిక లేదన్న అయోధ్య కలెక్టర్
కూల్చివేయబడ్డ బాబ్రీ మసీదు కింద సమాధులు ఉన్నాయని ధర్మాన్ని దృష్టిలో ఉంచుకుని, శ్రీరాముడిపై ఉన్న గౌరవంతో అక్కడ ఆలయ నిర్మాణం చేపట్టరాదని షమ్షద్ ట్రస్టు సభ్యులను కోరారు. ఇదిలా ఉంటే రాముడి ఆలయం నిర్మాణం చేపడుతున్న ఆ 67 ఎకరాల్లో స్మశాన వాటిక లేదని అయోధ్య జిల్లా పాలనావర్గం చెబుతోంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు లాయరుకు లేఖ ద్వారా అయోధ్య పాలనావర్గం తెలిపింది. ప్రస్తుతం రాముడి ఆలయ నిర్మాణం చేపడుతున్న 67 ఎకరాల్లో స్మశాన వాటిక లేదని అయోధ్య మెజిస్ట్రేట్ అనూజ్ ఝా తెలిపారు.
Recommended Video
అన్ని విషయాలు సుప్రీంకోర్టుకు తెలిపామన్న కలెక్టర్
అంతేకాదు అయోధ్య రామమందిరం బాబ్రీ మసీదు కేసు విచారణ సందర్భంగా అన్ని అంశాలను సుప్రీంకోర్టుకు తెలియజేశామని చెప్పారు జిల్లా కలెక్టర్ అనూజ్. ధర్మాసనం కేసును విచారణ చేస్తున్న సమయంలో ఈ అంశం కూడా వచ్చిందని దీనిపై కూడా వివరణ ఇవ్వడం జరిగిందని చెప్పారు అనూజ్. ఇక సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాపీలో ఇవ్వన్నీ పొందుపర్చడం జరిగిందని స్పష్టం చేశారు అయోధ్య జిల్లా కలెక్టర్.