మీ 'టేక్ హోమ్ సాలరీ' రాబోయే రోజుల్లో తగ్గిపోనుందా... ఎందుకని?
Click here to see the BBC interactive
మీరు ఎక్కడైనా ఉద్యోగం చేస్తుంటే, రెండు విషయాలు మీకు బాగా తెలిసుంటాయి.
ఒకటి 'కాస్ట్ టు కంపెనీ' అంటే ఉద్యోగిగా మీకోసం మీ కంపెనీ ఎంత ఖర్చు చేస్తుంది అనేది.
రెండోది 'టేక్ హోం సాలరీ' అంటే కాస్ట్ టు కంపెనీ కంటే తక్కువగా ఉంటుంది. ఎందుకంటే, చేతికందే సాలరీ తరచూ రకరకాల భాగాలుగా కట్ అయిన తర్వాతే వస్తుంది.
దేశంలో ఇప్పటివరకూ 29 కార్మిక చట్టాలు ఉండేవి. కానీ, ఇప్పుడు ప్రభుత్వం వాటన్నింటనీ 4 చట్టాల్లో కుదించే సన్నాహాల్లో ఉంది.
వీటిలో ఒకటి వేతనానికి సంబంధించినది. ఈ చట్టం పార్లమెంట్ నుంచి ఆమోదం పొందింది. కానీ, ఇప్పుడు దీని నియమాల డ్రాఫ్ట్ మాత్రమే సిద్ధంగా ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్ 1కి ముందే దీని నియమాలను నోటిఫై చేస్తారని భావిస్తున్నారు.
ఈ నియమాలు వచ్చిన తర్వాత ఉద్యోగుల టేక్ హోమ్ సాలరీపై ప్రభావం పడుతుందని, కాస్ట్ టు కంపెనీ కూడా పెరుగుతుందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఎందుకంటే, వీటివల్ల నేరుగా మీ జేబు మీద ప్రభావం పడుతుంది. అందుకే, వాటి గురించి కాస్త సులభంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఉద్యోగులు, కంపెనీలకు ఎలాంటి తేడాలు వస్తాయి
ఉద్యోగులు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఇప్పటివరకూ మీ వేతనంలో 50 శాతం బేసిక్ సాలరీగా, మిగతా 50 శాతం అలవెన్సెస్ అంటే భత్యంగా లభిస్తూ ఉంటే, కొత్త నియమాల వల్ల మీపై ఎలాంటి ప్రభావం పడదు.
కానీ, మీ వేతనం బేసిక్ 50 శాతం కంటే తక్కువగా ఉంటే, అప్పుడు మీ టేక్ హోం శాలరీ మీద వీటి ప్రభావం పడుతుంది.
అది ఎలా అనేది టాక్క్స్ ఎక్స్పర్ట్ గౌరీ చద్ధా వివరంగా చెప్పారు.
"మీ జీతం వంద రూపాయలు అనుకోండి. 40 శాతం అంటే 40 రూపాయలు ఇప్పటివరకూ బేసిక్ సాలరీగా మీకు లభిస్తూ, 60 శాతం అంటే 60 రూపాయలు అలెవెన్సెస్గా ఇస్తుంటే.. ఇప్పుడు ప్రభుత్వం కొత్త డ్రాఫ్ట్ ప్రకారం మీ కంపెనీ తమ సాలరీ స్ట్రక్చర్ మార్చాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం కంపెనీలు ఇప్పుడు సాలరీలో 50 శాతానికి పైగా అలెవెన్సులుగా ఇవ్వకూడదు. అంటే మీ బేసిక్ సాలరీ ఇంకా పెరుగుతుంది. ఇది మొదటి మార్పు"
ఇక రెండో మార్పు మీ బేసిక్ సాలరీతో జోడించి ఉన్న కంపొనెంట్స్ మీద ఉంటుంది. వాటిలో ఒకటి ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్), ఇంకొకటి గ్రాట్యుటీ. ఇవి కాకుండా మరికొన్ని కూడా ఉండచ్చు. అవన్నీ మారుతాయి.
మొట్ట మొదట పీఎఫ్ విషయానికి వద్దాం
భారత్లో ఇప్పటివరకూ ఎక్కువ కంపెనీలు ప్రావిడెంట్ ఫండ్ కింద బేసిక్ సాలరీలో 12 శాతం అందిస్తున్నాయి.
కొత్త నిబంధన ప్రకారం బేసిక్ పెరుగుతుంది. అంటే మీ పీఎఫ్ ఖాతాలో ఎక్కువ డబ్బు జమ అవుతుందనేది తెలిసిన విషయమే.
పాత నిబంధనల ప్రకారం మీకు 40 రూపాయల బేసిక్ సాలరీ వస్తుంటే, దానిలో 12 శాతం అంటే 4.8 రూపాయలు మీకు పీఎఫ్ కట్ అయ్యేది. కానీ, ఇప్పుడు కొత్త నిబంధనలు అమలైతే 50 శాతం బేసిక్కు మీ పీఎఫ్ 6 రూపాయలు కట్ అవుతుంది.
పీఎఫ్ రెండు భాగాలుగా ఉంటుంది. అందులో ఒక భాగం కంపెనీది, ఇంకో భాగం ఉద్యోగులది. అంటే మీ సాలరీ నుంచి ఇప్పుడు ఎక్కువ పీఎఫ్ కట్ అవుతుంది. అంటే 'టేక్ హోం సాలరీ' తగ్గిపోతుంది.
అలాగే కంపెనీకి కూడా పీఎఫ్ పెరగడం వల్ల తమ వాటాను పెంచి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే 'కాస్ట్ టు కంపెనీ' పెరుగుతుంది. కానీ ఈ భారం మీపై వేయాలా, లేక తామే భరించాలా అనేది ఆ కంపెనీపై ఉంటుంది.
అదే విధంగా ఉద్యోగికి కొత్త నిబంధనలతో గ్రాట్యుటీ కూడా ఎక్కువగా లభిస్తుంది.
ఎందుకంటే, గ్రాట్యుటీని కూడా మీ బేసిక్ సాలరీని బట్టే నిర్ణయిస్తారు. అందుకే, మీ బేసిక్ సాలరీ పెరిగితే, గ్రాట్యుటీ కూడా పెరుగుతుంది. కానీ, కంపెనీ ఎక్కువగా ఈ మొత్తాన్ని కూడా మీ జీతం నుంచే కట్ చేస్తుంది. అంటే, దీనివల్ల కూడా మీ 'టేక్ హోం సాలరీ' తగ్గుతుంది. పీఎఫ్, గ్రాట్యుటీ కాకుండా మీ హౌస్ రెంట్ అలవెన్స్, లీవ్ ఎన్కాష్మెంట్ కూడా మీ బేసిక్ సాలరీ ఆధారంగా నిర్ణయించి ఉంటే, వాటిపై కూడా ఈ కొత్త నిబంధనల ప్రభావం పడుతుంది.
అయితే, బాడ్ న్యూస్ ఏంటి?
కానీ ఈ మొత్తం మార్పుల వెనుక మరో కోణం కూడా ఉంది.
ఈ కొత్త నియమాల అమలు వల్ల ఉద్యోగుల్లో సామాజిక భద్రత భావన కూడా పెరుగుతుందని ఉద్యోగులకు లభించే సౌకర్యాలపై పనిచేసే టీమ్లీజ్ సంస్థ కో-ఫౌండర్ రీతుపర్ణా చక్రవర్తి చెప్పారు.
"పీఎఫ్, గ్రాట్యుటీలో డబ్బు ఎక్కువ కట్ అవుతుంది. అంటే, మీ టేక్ హోం సాలరీ తగ్గుతుంది అనేది తెలిసిన విషయమే. కానీ, వాటిని రిటైర్మెంట్ బెనిఫిట్ రూపంలో చూడవచ్చు. ఇప్పుడు ఆ ఖాతాల్లో డబ్బు ఎక్కువ జమ అవుతుంది. టేక్ హోం శాలరీ తగ్గినా, అదంతా మీ ఖాతాలోనే జమ అవుతూ ఉంటుంది. దానివల్ల మీ రిటైర్మెంట్ బెనిఫిట్పై మంచి ప్రభావం పడుతుంది. ఉద్యోగి కాస్ట్ టు కంపెనీలో మీ కంపెనీ షేర్ కూడా పెరుగుతుంది" అన్నారు.
కంపెనీలపై పడే అదనపు భారం గురించి వివరించిన రీతూ, "కంపెనీలకు 29 చట్టాల నుంచి విముక్తి కల్పించిన కేంద్రం వాటికి చాలా ఉపశమనం అందించింది. వాటితో పోలిస్తే ఈ భారం పెద్దదేం కాదు. కొత్త చట్టాల వల్ల కంపెనీలకు చాలా డబ్బు ఆదా అవుతుంది" అని చెప్పారు.
"గత ఏడాది సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఒక తీర్పు ప్రకారం పీఎఫ్ను బేసిక్ సాలరీ మీద కాకుండా, మిగతా వాటన్నింటినీ జోడించి కాలిక్యులేట్ చేయాల్సుంటుంది. మార్చి 2020న సుప్రీం తీర్పు ప్రకారం బేసిక్ శాలరీ, డీఏ, ఒక కంపెనీలో ఉద్యోగులందరికీ సమానంగా లభించే భత్యాలు.. అంటే మెడికల్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్ లాంటి అన్నింటినీ కలిపి పీఎఫ్ నిర్ణయించాల్సి ఉంటుంది. ఈ తీర్పు ప్రకారం పీఎఫ్ నిర్ణయించేటపుడు బోనస్, హౌస్ రెంట్, ఓవర్ టైమ్ లాంటివి కలపకూడదు" అని రీతూపర్ణా చక్రవర్తి చెప్పారు.
ఈ నిబంధనలు వచ్చినా ఏ మార్పులు చేయాల్సిన అవసరం లేని చాలా కంపెనీలు ప్రభుత్వ నిర్ణయాన్ని అప్పుడే అమలు చేసేశాయి. కానీ, నోటిఫికేషన్ తర్వాత కొత్త నిబంధనలు అమలు చేయాల్సిన కంపెనీలు వీటిని ఇంకా అమలు చేయలేదు.
అలవెన్సులు తగ్గితే ఏం జరుగుతుంది
కొన్ని కంపెనీల్లో ఇంకొకటి కూడా జరుగుతుంది. ప్రతి నెలా బిల్లులు జమ చేస్తే, మీ సాలరీలోని ఒక పెద్ద భాగాన్ని అలెవెన్సుల రూపంలో అందుకోవచ్చు. టాక్స్ నుంచి బయటపడ్డానికి తరచూ ఇలాంటివి చేస్తుంటారు.
దీని గురించి చెబుతూ "కొత్త నిబంధలు వచ్చిన తర్వాత మీ అలవెన్సులపై ప్రభావం పడుతుంది. కంపెనీ మీ సాలరీలో 50 శాతానికి పైగా అలవెన్సుల రూపంలో ఇవ్వడం ఇక కుదరదు" అని గౌరి చెప్పారు.
దీనితో ప్రభుత్వం ఏం సాధిస్తుంది
"కంపెనీలకు ఒక వైపు నష్టం జరుగుతున్నట్టు కనిపిస్తున్నా.. ఇంకో వైపు 29 చట్టాల నుంచి విముక్తి లభించి, కేవలం 4 చట్టాలను రూపొందించడం వల్ల వాటికి చాలా ఉపశమనం లభిస్తుంది. వాళ్లకు లెక్కలు వేయాల్సిన పని చాలా తగ్గుతుంది. ఈ పనులన్నీ పూర్తి చేయడానికి ఎంత మంది స్టాఫ్ ఉంటారో, వాళ్లను తగ్గించవచ్చు. ఆ డబ్బును వేరేవాటికి ఉపయోగించవచ్చు. ఉద్యోగుల్లో సామాజిక భద్రత భావన కూడా పెరుగుతుంది" అన్నారు రీతూపర్ణ చక్రవర్తి.
దీని వల్ల ప్రభుత్వానికి మరో ప్రయోజనం కూడా ఉంటుందని గౌరి చెప్పారు.
కొత్త నిబంధనలతో పీఎఫ్లో ఎక్కువ డబ్బు జమ అవుతుంది. దాంతో, ప్రభుత్వం దగ్గర ఎక్కువ నగదు ఉంటుంది. ఆ మొత్తాన్ని ప్రభుత్వం కొంతకాలంపాటు ఉపయోగించవచ్చు.
ఇవి కూడా చదవండి:
- చైనా: 'అర్ధరాత్రి వస్తారు.. నచ్చిన ఆడవాళ్లను ఎత్తుకెళ్లిపోతారు.. అడిగేవారే లేరు’
- 'కొకైన్ హిప్పోలు’: శాస్త్రవేత్తలు వీటిని చంపేయాలని ఎందుకు చెబుతున్నారు?
- ఉత్తరాఖండ్: వరద వేగానికి మృతదేహాలపై బట్టలు కూడా కొట్టుకుపోయాయ్
- బీరుబాలా: మంత్రగత్తెలనే నెపంతో దాడులు చేసేవారికి ఈమె పేరు చెబితేనే వణుకు పుడుతుంది
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు? చరిత్రలో అక్కడ జరిగిన కుట్రలెన్ని? తెగిపడిన తలలెన్ని
- బైరిపురం: పంచాయితీ ఎన్నికల్లో ఒక్కసారి కూడా ఓటు వేయని గ్రామమిది.. ఏకగ్రీవాలతో ఇక్కడ అభివృద్ధి జరిగిందా?
- 'నా భార్య నన్ను పదేళ్ళు రేప్ చేసింది'
- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమానికి 'గంటా’ పిలుపు.. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది
- '18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)