సలాం అభినందన్: పాక్ భూభాగంలో ఉన్నట్లు గ్రహించి ఏం చేశాడు..ఎలా వ్యవహరించాడు?
బుధవారం ఉదయం పాక్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పాక్ గగనతలంలోకి వెళ్లిన భారత యుద్ధవిమానంను కూల్చామని పాక్ చెప్పింది. ఆ సమయంలో భారతవాయుసేనకు చెందిన వింగ్ కమాండర్ పైలట్ అభినందన్ను కస్టడీలోకి తీసుకుంది. అయితే తాను పాక్ భూభాగంలో పడిపోయినట్లు గ్రహించిన అభినందన్ వర్ధమాన్ ఏమి చేశాడు... తప్పించుకునేందుకు ప్రయత్నించాడా..?
నేను ఇంతే చెబుతాను.. టీ బాగుంది: అభినందన్ వీడియో పోస్ట్ చేసిన పాకిస్తాన్
పాక్ కస్టడీలో పైలట్ అభినందన్
భారత్ పాక్ల మధ్య యుద్ధమేఘాలు అలుముకుంటున్నాయి. మంగళవారం భారత్ పాక్ గగనతలంలోకి చొచ్చుకుపోయి ఉగ్రవాద శిబిరాలపై వైమానికదాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ బుధవారం సరిహద్దులు ఉల్లంఘించి భారత గగనతలంలోకి ప్రవేశించి దాడులకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే భారత వాయుసేన దాడులను తిప్పికొట్టడంతో పాక్ యుద్ధవిమానాలు తోకముడిచాయి. అయితే దాడులను తిప్పికొడుతున్న క్రమంలో భారత యుద్ధవిమానం దురదృష్టవశాత్తు పాక్ దాడుల్లో కూలింది. ఇందులో ఉన్న పైలట్ అభినందన్ వర్ధమాన్ సురక్షితంగా కిందకు దిగారు. కానీ తాను పాక్ భూభాగంలో దిగినట్లు గ్రహించిన వెంటనే అక్కడి స్థానికుల నుంచి తప్పించుకునే క్రమంలో అతని దగ్గర ఉన్న తుపాకితో గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అంతేకాదు శత్రువులకు తన దగ్గర ఉన్న ఆధారాలు ఏమీ దొరక్కూడదన్న ఆలోచనతో ఆ డాక్యుమెంట్లను మింగేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
పాక్ అధికారుల విచారణలో భారత రహస్యాలు బయటపెట్టని అభినందన్
ఇక యుద్ధఖైదీగా పట్టుబడ్డ అభినందన్ వర్ధమాన్ ఆయన నిబంధనలకు అనుగుణంగానే నడుచుకున్నట్లు పాక్ మీడియా డాన్ కథనాలను ప్రచురించింది. యుద్ద ఖైదీగా పట్టుబడితే వారు ఎలా నడుచుకోవాలో అనేదానిపై ముందుగానే వారికి కొన్ని సూచనలు చేయడం జరుగుతుంది. అభినందన్ విషయంలో కూడా ఆయన ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇక పాక్ విడుదల చేసిన వీడియోలో అభినందన్ను ప్రశ్నిస్తున్న సమయంలో ఎక్కడే కానీ ఆయన ఎలాంటి యుద్ధ విమానం నడిపాడో, అతని నివాసం ఎక్కడో లాంటి విషయాలపై పాక్ అధికారులు గుచ్చి గుచ్చి అడిగినా వాటిని వెల్లడించలేదు. తన దేశానికి సంబంధించిన విషయాలను బయటపెట్టలేదు.
తాను పాక్లో ఉన్నట్లు ఇలా గ్రహించాడు
ఇక పాక్ మీడియా ప్రచురించిన కథనాల ప్రకారం ముందుగా అభినందన్ దగ్గరకు వెళ్లింది అక్కడి స్థానికులు అని తెలుస్తోంది. ఇక స్థానికులు అభినందన్ను పట్టుకోగానే తను పాకిస్తాన్లో ఉన్నానా లేక భారత్లో ఉన్నానా అని వారిని అడిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రశ్న అడగగానే అక్కడికి గుమికూడిన యువత తాను భారత్లోనే ఉన్నట్లు ముందుగా చెప్పినట్లు పాక్ మీడియా తన కథనంలో ప్రచురించింది. అయితే అక్కడి యువత కొన్ని నినాదాలు చేస్తుండటం విన్న అభినందన్.... భారత్ అయితే ఏప్రాంతంలో ఉన్నామో చెప్పాల్సిందిగా స్థానికులను కోరాడట. దీనికి సమాధానంగా ఖిల్లాన్ అని అదే వ్యక్తి సమాధానం చెప్పడంతో ప్రస్తుతం తను గాయపడి ఉన్నట్లు తాగేందుకు మంచినీరు ఇవ్వాలని కోరినట్లు కథనంలో పేర్కొంది. ఇంకా నమ్మకం కుదరకపోవడంతో అభినందన్ భారత్కు అనుకూలంగా కొన్ని నినాదాలు చేయడంతో వెంటనే అక్కడి స్థానికులు పాక్ ఆర్మీకి అనుకూలంగా నినాదాలు చేసినట్లు కథనం పేర్కొంది. ఇక తాను పాక్లో ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాత తన వద్ద ఉన్న పిస్తోలుతో గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అదే సమయంలో అక్కడి పాక్ స్థానిక యువత రాళ్లు పట్టుకుంది. వారి నుంచి తప్పించుకునేందుకు వారిపై గన్ ఎక్కుబెట్టి ఒక అరకిలోమీటర్ వరకు అభినందన్ పరిగెత్తాడు. ఆ తర్వాత చిన్న కుంటలోకి ఆయన దూకినట్లు కథనంలో వెల్లడించింది.
నీటి కుంట నుంచి ఎలా బయటపడ్డాడు..?
కుంటలోకి దూకిన వెంటనే అభినందన్ తన వద్ద ఉన్న డాక్యుమెంట్లను, మ్యాపులను, కొన్ని మింగి మరికొన్ని నీటిలో పడేశాడు. ఇక ఒక స్థానికుడు ఓ తుపాకీతో వచ్చి అభినందన్ దగ్గర ఉన్న తుపాకీని తమకు ఇచ్చేయాల్సిందిగా కోరాడు. ఆ సమయంలో ఒక వ్యక్తి అభినందన్ కాలికి తూటా పేల్చాడు. అయితే తను బయటకు వస్తానని తనను చంపరాదని అభినందన్ మాటతీసుకున్నాడు. ఇక నీటి కుంట నుంచి బయటకు వచ్చాక యువత పట్టుకుని స్థానిక ఆర్మీకి అప్పగించింది. అయితే పాక్ విడుదల చేసిన వీడియోలో అభినందన్పై యువత దాడి చేస్తున్నట్లుగా ఉంది. వారు దాడి చేయడంతోనే ఆయన ముఖం తీవ్ర రక్తస్రావానికి గురైంది.
మొత్తానికి అభినందన్ను పాక్ చెర నుంచి భారత్ విడిపించేందుకు అన్ని దారుల్లో ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా పాక్పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కూడా భారత్ చేస్తోంది. అయితే భారత పైలట్కు ఎలాంటి హానీ తలపెట్టరాదని పాకిస్తాన్ను భారత్ కోరింది. మరి చూడాలి పాక్ ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తుందో....