తప్పుకొన్న విప్రో సీఈవో: కుటుంబ వ్యవహారాలే కారణమంటోన్న టెక్ జెయింట్
న్యూఢిల్లీ: దేశీయ సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ విప్రో ముఖ్య కార్యనిర్వహణాధికారి, మేనేజింగ్ డైరెక్టర్ అబిద్ అలీ జెడ్ నీమూచ్వాలా తప్పుకొన్నారు. తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్జీకి పంపించారు. కుటుంబ కారణాల వల్లే తాను పదవి నుంచి వైదొలగినట్లు ఆయన తన రాజీనామాలో పేర్కొన్నారు. ఇతరత్రా కారణాలేవీ లేవని స్పష్టం చేశారు. తన స్థానంలో కొత్త వ్యక్తిని నియమించేంత వరకూ ఆయన కొనసాగుతారు.
Coronavirus: ఎయిర్ లిఫ్టింగ్: భారతీయుల తరలింపు షురూ: ఎయిరిండియా జంబో ఫ్లైట్..!
ఎన్ఐటీ-రాయ్పూర్ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో బ్యాచిలర్ డిగ్రీ, ఐఐటీ-బోంబే నుంచి ఇండస్ట్రీయల్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసిన అబిద్ అలీ.. మొదట టీసీఎస్లో ఉద్యోగిగా చేరారు. అంచెలంచెలుగా ఎదిగారు. అనంతరం అజీమ్ ప్రేమ్జీ స్థాపించిన విప్రో సంస్థలో చేరారు. 2015లో విప్రోలో చీఫ్ ఆపరేషన్ ఆఫీసర్ (సీఓఓ)గా పదోన్నతిని పొందారు. మరుసటి ఏడాదిలోనే ముఖ్యకార్యనిర్వహణాధికారిగా నియమితులయ్యారు.
75 సంవత్సరాల చరిత్ర గల విప్రో సంస్థలో అత్యున్నత పదవిలో పనిచేయడాన్ని తాను అదృష్టంగా భావిస్తున్నానని అబిద్ అలీ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ముఖ్యకార్యనిర్వహణాధికారి హోదాలో సంస్థ పురోగమింపజేయడానికి అవకాశాలను ఇవ్వడం పట్ల సంస్థ వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్జీ, రిషద్కు కృతజ్ఙతలు తెలియజేస్తున్నానని అన్నారు. తన వారసుడిగా కొత్త వారిని ఎంపిక చేసేంత వరకూ పదవిలో కొనసాగుతానని చెప్పారు.