కలిసినట్లు కాదు, దేశం గురించే: ఆరెస్సెస్ కార్యక్రమంలో ప్రేమ్జీ
న్యూఢిల్లీ: విప్రో అధినేత అజీమ్ ప్రేమ్జీ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరెస్సెస్కు చెందిన ఎన్జీవో సంస్థ ఏర్పాటు చేసిన, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ పాల్గొన్న కార్యక్రమంలో అజీమ్ ప్రేమ్జీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రేమ్జీ మాట్లాడారు. తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, తాను ఆరెస్సెస్కు ఏమీ ఎండోర్స్మెంట్ చేయడం లేదన్నారు. తాను రాజకీయ నాయకుడిని కాదని, కాబట్టి ఎవరో సూచనలు అవసరం లేదన్నారు.
తాను నిత్యం తన దేశం కోసం ఆలోచిస్తానని అభిప్రాయపడ్డారు. తాను తన దేశ ప్రయోజనాల పైనే ఆసక్తి చూపిస్తానని చెప్పారు. తాను ఒక సంస్థ సమావేశాలో పాల్గొన్నంత మాత్రాన దానికి ఎండోర్స్ చేస్తున్నట్లు కాదన్నారు.
ఆరెస్సెస్ సమావేశాలో పాల్గొన్నంత మాత్రాన ఆ సంస్థ భావజాలాన్ని పాటించాలని నిర్ణయించుకున్నట్లు కాదన్నారు. ఆరెస్సెస్ అనుబంధ రాష్ట్రీయ సేవా భారతి చేస్తున్న మంచి పనులను అభినందించేందుకే తాను వచ్చానని చెప్పారు. అయితే, తాను రాజకీయ నాయకుడిని కాదని, దేశం గురించి తాపత్రయపడే వ్యక్తినని ప్రేమ్జీ చెప్పడం గమనార్హం.