భారత ఐటీకి ఊహించని దెబ్బ!: విప్రోను అమ్మేస్తున్నారట!?..
గడిచిన ఐదేళ్లలో విప్రో వృద్ధి రేటు సింగిల్ డిజిట్ కే పరిమితమైనా.. కంపెనీ మిగులు నిధులు మాత్రం రూ.34,474కోట్లు ఉన్నాయి.
ముంబై: భారత ఐటీ రంగానికి సమీప కాలంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా దెబ్బకు ఇప్పటికే చాలావరకు ఐటీ కంపెనీలు అంతర్గతంగా నష్టాలు చవిచూస్తుండగా.. కొత్త ప్రాజెక్టులు లేకపోవడం చాలామంది ఉద్యోగులను సాగనంపేలా చేసింది.
ఇలాంటి తరుణంలో.. భారత ఐటీ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన విప్రో అనూహ్య నిర్ణయం తీసుకోబోతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. సంస్థ చైర్మన్ అజిమ్ ప్రేమ్ జీ కంపెనీని అమ్మేయాలనే యోచనలో ఉన్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది.
పూర్తి వాటా అమ్మేస్తారా?
ప్రస్తుతం విప్రో కంపెనీలో మేజర్ వాటా ప్రేమ్జీ పేరునే ఉంది. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు కలిపి కంపెనీలో 73శాతం ఈక్విటీ ఉంది. అయితే రాబోయే రోజుల్లో ఇందులో కొంతైనా, లేదంటే పూర్తి వాటానైనా విక్రయించాలని ప్రేమ్ జీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు మనీకంట్రోల్.కామ్ కథనాన్ని వెలువరించడం గమనార్హం.
ఏదైనా ఎంఎన్సికి అమ్మేయాలని:
తన వాటాలను మంచి ధరకు కొనుగోలు చేయడానికి ఏదైనా ఎంఎన్సి ముందుకొస్తే.. విక్రయించడానికి ప్రేమ్ జీ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎంఎన్సి కానీ పక్షంలో ఏదైనా ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ కైనా విప్రో కంపెనీని అమ్మేయాలని ప్రేమ్ జీ భావిస్తున్నారు. అయితే విప్రో యాజమాన్యం మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తోంది.
ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులతో చర్చలు:
కంపెనీ మొత్తం విలువ ఎంత? ఎంత ధరకు అమ్మవచ్చనే విషయం కోసమే ప్రస్తుతం ప్రేమ్ జీ కుటుంబం ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులతో చర్చలు జరుపుతున్నట్లు ఓ బ్యాంకర్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే కంపెనీకి చెందిన కొన్ని యూనిట్లను మదింపు చేయాలని ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులను కోరినట్లు కూడా పేర్కొన్నారు.
ఐటీ వృద్ధి రేటు ఢీలా:
ఐటీ వృద్ధి రేటు ఆశించినంత స్థాయిలో లేకపోవడం వల్లే కంపెనీలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయన్న వాదన వినిపిస్తోంది. అమెరికా హెచ్1బి వీసాలను తగ్గించేయడం, భారీ వేతనాలున్న వారినే అక్కడి ఉద్యోగాలకు పంపించేలా నిబంధనలను సడలించడంతో లాభాలు తగ్గినట్లు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే చాలావరకు ఐటీ కంపెనీలు ఉద్యోగులను సాగనంపుతూ వస్తున్నాయి. అమ్మకాలకు సిద్దమవుతున్న కంపెనీల ఖాతాల్లో భారీ ఎత్తున నిధులు ఉండటంతో.. ఎంఎన్సి ఐటి సంస్థలు, పిఇ సంస్థలు, ఇన్వె స్ట్మెంట్ బ్యాంకులు కొనుగోళ్లకు ముందుకొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
విప్రో అమ్మకం పెద్ద కుదుపే:
గడిచిన ఐదేళ్లలో విప్రో వృద్ధి రేటు సింగిల్ డిజిట్ కే పరిమితమైనా.. కంపెనీ మిగులు నిధులు మాత్రం రూ.34,474కోట్లు ఉన్నాయి. చాలామంది ప్రమోటర్లు అమ్మకాలకు సిద్దమవుతుండటంతో వచ్చే 12-18నెలల్లో భారత ఐటీ మేనేజ్ మెంట్ లో మార్పులు రానున్నాయి. కంపెనీ మిగులు నిధులను రాబట్టుకునేందుకు అమ్మకాలకు సిద్దమవుతున్నట్లు మర్చంట్ బ్యాంకర్లు చెబుతున్నారు. ఏదేమైనా దేశీ ఐటీ రంగంలో దిగ్గజ కంపెనీగా వెలుగొందిన విప్రో మేనేజ్ మెంట్ వేరే వారి చేతుల్లోకి వెళ్లడం పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అభిప్రాయపడుతున్నారు.