అందుకే.. విప్రో యూనిట్ మూత, ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకం
ఐటీ దిగ్గజం, కన్స్యూమర్ ఉత్పత్తుల సంస్థ విప్రో కర్నాటకలో ఉన్న ఓ ప్రధాన కార్యాలయాన్ని మూసివేసింది. మైసూరులో ఉన్న లైటింగ్ ఉత్పత్తుల కేంద్రాన్ని షటన్ డౌన్ చేసింది.
మైసూర్: ఐటీ దిగ్గజం, కన్స్యూమర్ ఉత్పత్తుల సంస్థ విప్రో కర్నాటకలో ఉన్న ఓ ప్రధాన కార్యాలయాన్ని మూసివేసింది. మైసూరులో ఉన్న లైటింగ్ ఉత్పత్తుల కేంద్రాన్ని షటన్ డౌన్ చేసింది.
డిమాండ్ భారీగా పడిపోవడంతో మైసూరులో ఉన్న కేంద్రాన్ని మూసివేస్తున్నట్లు విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్ తెలిపింది. ఎల్ఈడీ ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతో తమ సిఎఫ్ఎల్ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిపోయిందని తెలిపింది.
అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పరిస్థితిని మెరుగుపరిచేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశామని, అయినప్పటికీ ఏడాదిగా ఆర్థిక భారం భరించలేకుండా ఉందని పేర్కొంది.
ఆందోళనలో వారి భవితవ్యం
హుటాగల్లీ పారిశ్రామిక ప్రాంతంలో ఈ యూనిట్ మొత్తం 7.5 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ యూనిట్ లాకౌట్ను సంస్థ సోమవారం నాడు ప్రకటించింది. లాకౌట్ నోటీసులు అతికించింది. దీంతో కంపెనీ కార్మికుల భవితవ్యం ఆందోళనలో పడింది.
Recommended Video
ముందే ప్రభుత్వానికి నోటిఫికేషన్
ఈ ప్లాంటును మూసివేస్తున్నట్లు ప్రభుత్వం, సంబంధిత అధికారులు, ఇతర రెగ్యులేటరీ సంస్థలకు రెండు నెలల క్రితమే నోటిఫికేషన్ ఇచ్చామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. తద్వారా అన్ని రెగ్యులేటరీ అవసరాలకు కట్టుబడి ఉన్నామని చెప్పింది.
రోడ్డున పడ్డ కార్మికులు
లాకౌట్ నేపథ్యంలో మొత్తం 84 మంది శాశ్వత కార్మికులు, 66 మంది కాంట్రాక్టు ఉద్యోగులు రోడ్డున పడ్డారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ స్వచ్చంద విరమణ పథకాన్ని ప్రతిపాదించినట్లు వెల్లడించింది.
కార్మికుల ఆందోళన
మరోవైపు, కంపెనీ లాకౌట్ నేపథ్యంలో సోమవారం రాత్రి కార్మికులు ఆందోళనకు దిగారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తమకు కంపెనీ తీరని అన్యాయం చేసిందని వారు ఆరోపించారు.