విప్రో టెక్కీలకు దెబ్బ: తక్కువ రేటింగ్ ఉన్నవారికి ఉద్వాసనే!
ప్రస్తుతం విప్రో సంస్థలో 1.8లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. బోటమ్ 10శాతంలోకి 5/2 రేటింగ్ ఇచ్చిన వారందరికి పింక్ స్లిప్పులు చేతుల్లో పెట్టనున్నట్లు వారు చెప్పారు.
హైదరాబాద్: ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు.. తక్కువ నైపుణ్యం కలిగిన తమ ఉద్యోగులపై వేటు వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడదే బాటలో విప్రో కూడా పయనిస్తోంది. తమ సంస్థలో తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్దమవుతోంది.
ఇందుకోసం బీ10(బోటమ్ 10శాతం) కోడ్ నేమ్ తో విప్రో సంస్థ ప్రాజెక్టును ప్రారంభించబోతుంది. ఏప్రిల్ తో ముగిసిన అప్రైసల్స్ తో కింది స్థానంలో ఉన్న 10శాతం మందిని గుర్తించాలని హెచ్ఆర్ డిపార్ట్ మెంట్ ఆదేశించినట్లు విప్రో మేనేజర్స్ తెలిపారు. దీని ప్రకారం కంపెనీలో తక్కువ స్కిల్ కలిగిన ఉద్యోగులపై ఏ క్షణంలోనైనా వేటుపడే అవకాశం లేకపోలేదు.
అయితే విప్రో యాజమాన్యం మాత్రం ఇవన్నీ ఊహాగానాలే అని కొట్టిపారేయడం గమనార్హం. ఈ రూమర్లకు ఎలాంటి ఆధారాలు లేవని, విప్రో కంపెనీ తమ ఈమెయిల్స్ ద్వారా తెలిపింది. మరోవైపు మేనేజర్లు మాత్రం ఉద్యోగాల కోతను ధ్రువీకరించడం గమనార్హం. ప్రస్తుతం విప్రో సంస్థలో 1.8లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. బోటమ్ 10శాతంలోకి 5/2 రేటింగ్ ఇచ్చిన వారందరికి పింక్ స్లిప్పులు చేతుల్లో పెట్టనున్నట్లు వారు చెప్పారు.
ఈ ప్రభావం కేవలం ఇండియాలోని ఉద్యోగుల పైనే కాక విదేశాల్లో పనిచేస్తున్న వారిపై కూడా ఉండవచ్చునని అన్నారు. ఆటోమేటెడ్ ప్రభావంతో రాబోయే మూడేళ్లలో విప్రో 47వేల మందిని తగ్గించుకోనుందని 2015లొోనే సీఈవో టీకే కురియన్ ఒక సమావేశంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.