విప్రో ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్..జీతాలు పెంచుతూ కంపెనీ నిర్ణయం ఎవరికి ఎంతంటే..?
బెంగళూరు:ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ విప్రో తమ ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు జీతభత్యాలు పెంచుతున్నట్లు వెల్లడించింది. పెంచిన జీతం జూన్ 1 నుంచి అమలు చేస్తామని స్పష్టం చేసింది. ఇక ఈ జీతాల వర్తింపు భారతదేశంలో పనిచేసే ఉద్యోగులతో పాటు విదేశాల్లో ఆన్సైట్పై పనిచేసే ఉద్యోగస్తులకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇక డిజిటల్ టెక్నాలజీ ప్లాట్ఫాంలపై పనిచేస్తున్న ఉద్యోగులకు ఇన్సెంటివ్స్ ప్రకటించింది. ముఖ్యంగా మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లపై పనిచేస్తున్న ఉద్యోగస్తులకు ఈ ఇన్సెంటివ్స్ ప్రకటించింది.
ఇక జూనియర్ లెవెల్ ఎంట్రీలో ఉన్న ఉద్యోగస్తులకు అంటే ఎంట్రీ లెవెల్ నుంచి ఐదేళ్లు అనుభవం ఉన్న ఉద్యోగులకు 6శాతం నుంచి 8 శాతం జీతాల్లో పెంపు ఉండగా మరికొందరికి 6శాతం లేదా అంతకన్నా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కంపెనీ విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.ఇక భారత దేశంలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతం పెంపు కాస్త ఎక్కువగా ఉంటుందని ఇక ఆన్సైట్పై విదేశాలకు వెళ్లి పనిచేస్తున్న వారికి కాస్త తక్కువగా ఇంక్రిమెంట్ దక్కే అవకాశం ఉన్నట్లు కంపెనీ వర్గాల విశ్వసనీయ సమాచారం. ఇక విప్రోలో తమ ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి మోడ్రన్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్న వారికి విప్రో సంస్థ ప్రత్యేక ప్రోత్సహాకాలను ప్రకటించింది.
ఇక జూలై 31న విప్రో సంస్థ నుంచి వ్యవస్థాపకులు అజీమ్ ప్రేమ్జీ పదవీ విరమణ చేయనున్నారు. అదేసమయంలో ఆయన కుమారుడు రిషబ్ ప్రేమ్జీ అధికార బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో విప్రో ఉద్యోగులకు వేతనాలను పెంచడం శుభపరిణామం అని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. తన సుదీర్ఘ ప్రయాణంలో తన పదవి తనకు ఎంతగానో తృప్తి కలిగించిందని అజీమ్ ప్రేమ్జీ తెలిపారు. భవిష్యత్తులో దాతృత్వ జీవితం గడపాలని తాను భావిస్తున్నట్లు అజీమ్ తెలిపారు. అంతేకాదు రిషద్ సమర్థవంతంగా కంపెనీని నడుపగలరనే పూర్తి విశ్వాసం తనకు ఉందని అన్నారు. తన కొడుకు కంపెనీని మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. మంచి దాతృత్వం ఉన్న వ్యక్తిగా అజీమ్ ప్రేమ్జీ పేరు సంపాదించారు. అంతేకాదు భారత ఐటీకి సీజర్లాంటి వాడని ఐటీ ఇండస్ట్రీ అభివర్ణిస్తుంది.