విప్రోకు వార్నింగ్: రూ. 500 కోట్లు ఇవ్వకుంటే దాడి చేస్తాం, ఉద్యోగులపై, స్విజర్లాండ్ లో !
రూ. 500 కోట్లు మేము చెప్పిన అకౌంట్ లో జమ చెయ్యాలని, లేదంటే బెంగళూరు నగరంలోని విప్రో కంపెనీల మీద దాడులు చేస్తామని ఈ మెయిల్ లో హెచ్చరించారు.
బెంగళూరు: ఐటీ, బీటీ రంగాలకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన బెంగళూరు నగరంలోని ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీకి ఓ బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. 72 గంటల్లో రూ. 500 కోట్లు మేము చెప్పిన అకౌంట్ లో వెయ్యకుంటే మీ అంతు చూస్తామని నిందితులు ఈ మెయిల్ లో బెదిరించారు.
విప్రో కంపెనీకి వార్నింగ్: రూ. 500 కోట్లు ఇవ్వకుంటే కార్యాలయాలపై దాడులు !
ప్రసిద్ధి చెందిన విప్రో కంపెనీకి బెదిరింపు ఈ మెయిల్ రావడంతో బెంగళూరు పోలీసులు విచారణ మొదలు పెట్టారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి గాలిస్తున్నామని బెంగళూరు నగరంలోని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
మే 5 గేమ్ మొదలు పెట్టారు !
మే 5వ తేదీ ఓ అనామకుడి నుంచి విప్రో కంపెనీకి ఈ మెయిల్ వెళ్లింది. అందులో మీరు రూ. 500 కోట్లు మేము చెప్పిన అకౌంట్ లో జమ చెయ్యాలని, లేదంటే బెంగళూరు నగరంలోని విప్రో కంపెనీలు అన్నింటి మీద దాడులు చేస్తామని హెచ్చరించారు.
బిట్ కాయిన్ రూపంలో రూ. 500 కోట్లు !
ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు నేరుగా నగదు లావాదేవీలు నిర్వహించవు. బిట్ కాయిన్ (డిజిటల్ లావాదేవీలు) రూపంలో లావాదేవీలు నిర్వహిస్తారు. ఈ విషయం తెలుసుకున్న నిందితులు తాము చెప్పిన అకౌంట్ లో బిట్ కాయిన్ రూపంలో రూ. 500 కోట్లు చెల్లించాలని సూచించారు.
టైం ఇచ్చిన నిందితులు !
రూ. 500 కోట్లు చెల్లించడానికి నిందితులు విప్రో కంపెనీకి సమయం ఇచ్చారు. మే 5వ తేదీని బెదిరింపు ఈ మెయిల్ పంపించిన నిందితులు మే 25వ తేదీ వరకు గడుపు ఇచ్చారు. అంతలోపు రూ. 500 కోట్లు చెల్లించాలని, లేదంటే మీ కంపెనీల మీద దాడులు చేస్తామని హెచ్చరించారు.
సమయం లేదు మిత్రమా !
మేము ఇచ్చిన సమయం మించిపోయిందని, ఇంత వరకూ డబ్బు చేతికి అందలేదని, ఏం తమాషా చేస్తున్నారా ? అంటూ మరో సారి విప్రో కంపెనీకి ఈ మెయిల్ బెదిరింపు వచ్చిందని వెలుగు చూసింది. ఇప్పటికే విప్రో కంపెనీ ప్రతినిధులు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చిక్కిపోతామని హైటెక్ టెక్నాలజీ !
విప్రో కంపెనీకి బెదిరింపు లేఖ పంపించిన నిందితులు తెలివిగా వ్యవహరించారు. నేరుగా డబ్బు తీసుకున్నా, బ్యాంకులో డిపాజిట్ చేయించుకున్నా చిక్కిపోతామని గుర్తించారు. అందుకే మార్కెట్ లో చెలామణిలో ఉన్న (రూపాయి, డాలర్, పౌండ్) డిజిటల్ లావాదేవీల రూపంలో నగదు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారని వెలుగు చూసింది.
విదేశాల్లో ఐపీ అడ్రస్ !
విప్రో కంపెనీ ప్రతినిధులు ఫిర్యాదు చెయ్యడంతో బెంగళూరు నగరంలోని బెళ్లందూరు పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. రెండు సారి వచ్చిన మరో ఈ మెయిల్ బెదిరింపు లేఖను పోలీసులు పరిశీలించారు. రెండు బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చింది ఒకే ఈ మెయిల్ ఐడీ నుంచి అని గుర్తించారు. ఈ మెయిల్ ఐడీ అడ్రస్ స్విజర్లాండ్ లోనిది అని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.
మాజీ ఉద్యోగులపై అనుమానం ?
విప్రో కంపెనీకి రూ. 500 కోట్లు ఇవ్వాలని, లేదంటే దాడులు చేస్తామని, పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించిన నిందితులను గుర్తించడానికి పోలీసులు కసరత్తులు చేస్తున్నారు. విప్రో కంపెనీ మాజీ ఉద్యోగులు, లేదా ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులే ఇలా బెదిరింపు ఈ మెయిల్ పంపించి ఉంటారని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విప్రో కంపెనీకి రెండో సారి ఈ మెయిల్ బెదిరింపు లేఖ వచ్చిందని ఓ మీడియా సంస్థకు కంపెనీ ప్రతినిధులు దృవీకరించారు.