10 గంటల్లోనే లక్షన్నర ఫాలోవర్లు.. సోషల్ మీడియా స్టార్ ప్రియాంక
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ తురుపుముక్క ప్రియాంక గాంధీ చరిష్మా ఆ పార్టీకి బాగానే కలిసివస్తోంది. అంతా ఊహించినట్టుగానే సోమవారం ఆమె రాజకీయ ఆరంగ్రేట ర్యాలీకి కార్యకర్తలు పోటెత్తారు. తన అన్న, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో కలిసి లక్నోలో ర్యాలీ తీసి పశ్చిమ యూపీ ఇంచార్జీగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత సామాజిక మాధ్యమం ట్విట్టర్ లో ఆమె ప్రభంజనం మొదలైంది.
సోమవారం సాయంత్రం నుంచి ట్విట్టర్ లో ప్రియాంక ఫాలోవర్ల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం ఉదయానికి కల్లా అంటే దాదాపు 10 గంటల్లో లక్షన్నర మంది ఆమెను ఫాలో అయ్యారు. దీనిపై ఆ పార్టీ నేత శశిథరూర్ స్పందిస్తూ .. ప్రియాంక సోషల్ మీడియాకు కొత్త స్టార్ అని అభివర్ణించారు. ప్రియాంకకు వచ్చిన స్పందన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను మించిపోయే అవకాశం ఉందన్నారు.
ట్విట్టర్ అకౌంట్ తెరిచిన 24 గంటల్లో రజనీకాంత్ కు 2 లక్షల మంది ఫాలో అయ్యారని తెలిపారు. 10 గంటల్లో ప్రియాంకకు లక్షన్నర మంది ఫాలో అవుతున్నారని .. ఒకరోజులో ఆ సంఖ్య పెరుగచ్చొని అభిప్రాయపడ్డారు. రజనీకాంత్ రికార్డును బీట్ చేసే అవకాశం కూడా ఉందన్నారు. ట్విట్టర్ లో ప్రియాంక ట్వీట్ చేసిన వెంటనే ఫాలోవర్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోందని చెప్పారు థరూర్. ప్రియాంక మాత్రం ఏడు ట్విట్టర్ ఖాతాలను ఫాలో అవుతున్నారు. అందులో కాంగ్రెస్ పార్టీ అధికార సైట్ ఒకటి కాగా .. రాహుల్ గాంధీ, జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ ఫైలట్, అశోక్ గెహ్లాట్, రణదీప్ సింగ్ సుర్జేవాలా, అహ్మద్ పటేల్ మిగతా ఖాతాలు ఉన్నాయి.
2014 లోక్ సభ ఎన్నికల్లో సోషల్ మీడియాను వేదికగా చేసుకొని అధికార యూపీఏను నరేంద్ర మోదీ టార్గెట్ చేశారు. ప్రశాంత్ కిశోర్ సలహాలతో జనంలోకి వెళ్లి .. బీజేపీకి తిరుగులేని ఆధిక్యాన్ని సాధించి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి వెళ్లాని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగా ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ, శశిథరూర్ మిగతా నేతలంతా సోషల్ మీడియాను ఫాలో అవుతున్నారు. తాజాగా ప్రియాంక గాంధీ జనాలకు మరింత దగ్గరయ్యేందుకు ట్విట్టర్ అకౌంట్ తెరిచి .. ముందుకెళ్తున్నారు. కానీ సోషల్ మీడియాలో ఓ వరుస ముందు ఉండే నరేంద్రమోదీ ఫాలోవర్ల లిస్ట్ మాత్రం అగ్రస్థానంలో కొనసాగుతోంది.
మోదీ ట్విట్టర్ ఫాలోవర్లు 45.4 మిలియన్లు ఉన్నారంటే ఆయన చరిష్మా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆయనకు కనుచూపు మేరలో ఏ నేత లేకపోవడం గమనార్హం. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ 8.47 మిలియన్లతో ఆ పార్టీలో అగ్రస్థానంలో కొనసాగగా .. 6.75 మిలియన్లతో ఆ తర్వాతి స్థానంలో శశిథరూర్ ఉన్నారు. ఇప్పుడు ప్రియాంక గాంధీకి సోషల్ మీడియాలో నెటిజన్లు జేజేలు పలుకుతుండటంతో .. మోదీ మార్క్ చేరడం కష్టమేమీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వచ్చే ఎన్నికల్లో యూపీ పశ్చిమకు ప్రియాంకను ఇంచార్జీగా నియమించడంతో కాంగ్రెస్ స్ట్రాటజీ అర్థమవుతోంది. అనుకున్నట్టుగానే ప్రజల మద్దతుతోపాటు ... సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య పెరుగడంతో ఓటుబ్యాంకు పెరుగుతుందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.