కరోనా: 24 గంటల్లో 1755 కొత్త కేసులు.. HCQ ఉత్పత్తి పెంపు.. కేంద్రం తాజా ప్రకటన..
ఒకదిక్కు లాక్ డౌన్ సడలింపులకు అవకాశాల్ని పరిశీలిస్తున్నా, భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదు. గడిచిన రెండు వారాలుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1755 పాజిటివ్ కేసులు, 77 మరణాలు నమోదయ్యాయి. తద్వారా మొత్తం కేసుల సంఖ్య 35, 365కు పెరిగింది. అందులో 25 శాతం రికవరీ రేటుతో 9065 మంది కోలుకోగా, చనిపోయినవాళ్ల సంఖ్య 1152కు పెరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ శాఖ రోజవారీ బ్రీఫింగ్ లో భాగంగా శుక్రవారం ఈ వివరాల్ని వెల్లడించింది.
Recommended Video
రెడ్ జోన్లు మినహా ఆరెంజ్, గ్రీన్ జోన్లలో లాక్ డౌన్ సడలింపులు ప్రకటించిన దరిమిలా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రజలు వ్యక్తిగత స్థాయిలో కృషిచేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ లవ్ అగర్వాల్ పిలుపునిచ్చారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రెడ్, ఆరెంజ్ జోన్ ప్రాంతాలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా పాలనా వ్యవస్థలు ప్రత్యేక దృష్టి పెట్టాలని హెచ్చరించారు. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీల్ని సొంత ప్రాంతాలకు చేరవేసేందుకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది.
ఎంపవర్డ్ గ్రూప్-3 చైర్మన్ పీడీ వాఘేలా మాట్లాడుతూ.. కరోనా కారణంగా మెడికల్ సామాగ్రికి డిమాండ్ ఏర్పడిందని, మొత్తం 2.01కోట్ల పీపీఈ కిట్స్ అవసరంకాగా, ఇప్పటికే 1.42 కోట్ల కిట్స్ ను సమకూర్చుకున్నామని, దేశవ్యాప్తంగా ప్రతి రోజూ 1.87 లక్షల కిట్స్ రూపొందుతున్నాయని తెలిపారు. అలాగే, 75వేల వెంటిలేటర్ల అవసరంకాగా, ప్రస్తుతానికి 19,398 వెంటిలేటర్లు అందుబాటులోకి తెచ్చామని, మరో 60,884 యూనిట్లకు ఆర్డర్ చేశామని చెప్పారు. వీటితోపాటు హైడ్రాక్సీ క్లోరోక్విన్(HCQ) ట్యాబ్లెట్స్ ఉత్పత్తిని కూడా 12.33 కోట్ల నుంచి 30కోట్లకు పెంచామని, ఇప్పటికే 16 కోట్ల ట్యాబ్లెట్లను మార్కెట్ లోకి విడుదల చేశామని వాఘేలా వివరించారు.