దేశీయ విమాన ఛార్జీల పరిమితి 30 శాతం పెంపు, దిల్లీ-హైదరాబాద్ టికెట్ ఎంత పెరిగింది?
దేశంలో డొమెస్టిక్ విమాన ఛార్జీలు 30 శాతం పెరిగాయి. వివిధ మార్గాల్లో ప్రస్తుతం ఉన్న దేశీయ విమాన ప్రయాణ కనిష్ట-గరిష్ఠ ఛార్జీల పరిధిని కేంద్రం 10 నుంచి 30 శాతం వరకూ పెంచింది.
ఛార్జీల పెంపుతోపాటూ ఎయిర్ లైన్స్ తమ పూర్తి సామర్థ్యంలో 80 శాతం విమానాలను నడిపే గడువును కేంద్రం మార్చి 31 వరకూ పొడిగించింది.
కొత్త ధరల ప్రకారం దేశీయ విమానాల గరిష్ఠ ఛార్జీలు 30 శాతం ఎక్కువగా ఉంటాయి.
అంటే దిల్లీ-ముంబయి మధ్య విమాన ఛార్జీ ప్రస్తుతం రూ.3,500 నుంచి 10 వేల రూపాయలు ఉంటే, కొత్త ధర ప్రకారం అది రూ.3900 నుంచి 13 వేల వరకూ పెరుగుతుంది.
ఇది ఎకానమీ క్లాస్ ఛార్జీ మాత్రమే. దీనితోపాటూ విమానాశ్రయాల యూజర్ డెవలప్మెంట్ ఛార్జీలు, ప్రయాణికుల భద్రతా రుసుము(దేశీయంగా రూ.150), జీఎస్టీ లాంటివి ఉంటాయి. ఇవన్నీ కలిపి విమాన ఛార్జీలు మరింత పెరుగుతాయి.
విమానయాన మంత్రిత్వ శాఖ గత ఏడాది మేలో విమాన ప్రయాణం సమయం ఆధారంగా డొమెస్టిక్ విమాన సేవలను ఏడు కేటగిరీలుగా విభజించింది. వాటి కాల వ్యవధి 40 నిమిషాల నుంచి మూడు, 3.30 గంటల వరకూ ఉంది.
గత ఏడాది మే నుంచి ఇప్పటివరకూ జెట్ ఇంధనం ధరలు విపరీతంగా పెరగడంతో కేంద్రం దేశీయ విమాన ఛార్జీలు పెంచాల్సి వచ్చింది.
ఈ ఏడాది వేసవిలో కోవిడ్ ముందు నాటి పరిస్థితులు ఏర్పడేవరకూ, కొత్త ఛార్జీలు అమలులో ఉండవచ్చని కేంద్రం చెప్పింది.
- ఆకాశంలోని విమానాలను నేలకు దించిన మనిషి.. కెప్టెన్ జీఆర్ గోపీనాథ్
- మీరు ఎక్కే విమానం ఎంత వరకు సురక్షితం?
ధరల్లో ఎంత తేడా వస్తుంది
- 40 నిమిషాల విమాన ప్రయాణం- ప్రస్తుత ఛార్జీలు రూ. 2,000- 6,000. కొత్తధరల ప్రకారం ఈ ఛార్జీలు రూ.2,200-7,800 అవుతాయి. ఈ పరిధిలో దిల్లీ-చండీగఢ్, గోవా-ముంబయి, మంగళూరు-బెంగళూరు, శ్రీనగర్-జమ్ము మార్గాలు ఉన్నాయి.
- 40 నుంచి 60 నిమిషాల విమాన ప్రయాణం- ఇంతకు ముందు టికెట్ ధర రూ.2.500-7,500. కొత్త ఛార్జీలు రూ.2,800-9,800 మధ్య ఉంటాయి. మార్గాలు- అహ్మదాబాద్-భోపాల్, లేహ్-దిల్లీ, హైదరాబాద్-ముంబయి, దిల్లీ-శ్రీనగర్.
- 60 నుంచి 90 నిమిషాల విమాన ప్రయాణం-ప్రస్తుత ధర రూ.3000-9,000. కొత్త ఛార్జీలు రూ. 3,300 -11,700. వీటిలో బెంగళూరు-ముంబయి, కోల్కతా-లఖ్నవూ, పట్నా-దిల్లీ, చెన్నై-కోల్కతా మార్గాలు ఉన్నాయి.
- 90 నుంచి 120 నిమిషాల ప్రయాణం- ప్రస్తుత టికెట్ ధర రూ.3,500-10,000. కొత్త ఛార్జీలు - 3,900-13,000. మార్గాలు- దిల్లీ-ముంబయి, చెన్నై-ముంబయి, పోర్ట్బ్లెయిర్-చెన్నై, జైపూర్-వారణాసి.
- 120 నుంచి 150 నిమిషాల ప్రయాణం- ప్రస్తుత ధర రూ.4,500-13,000, కొత్త ఛార్జీలు రూ.5,000-6,900. మార్గాలు దిల్లీ-హైదరాబాద్, దిల్లీ-బెంగళూరు, గువాహటి-దిల్లీ, జైపూర్-బెంగళూరు, గోవా-దిల్లీ.
- 150 నుంచి 180 నిమిషాల ప్రయాణం-ప్రస్తుత ధర రూ.5,500-15,700. కొత్త ఛార్జీలు - రూ.6,100-20,400. మార్గాలు. దిల్లీ-కొచ్చి, ముంబయి-గువాహటి, ముంబయి-శ్రీనగర్, చెన్నై-గువాహటి
- 180 నుంచి 210 నిమిషాల ప్రయాణం-ప్రస్తుత ధర రూ. 6,500-18,600. కొత్త ఛార్జీలు రూ.7,200-24,200, మార్గాలు - దిల్లీ-కోయంబత్తూర్, దిల్లీ-తిరునంతపురం, దిల్లీ-పోర్ట్బ్లెయిర్.
ఇంతకు ముందు ఎయిర్లైన్సులో 80 శాతానికి మించి ప్రయాణికులను అనుమతించడానికి విమానయాన అధికారులు సూచనలు కోరారు.
ఇండిగో, విస్టారా, ఎయిర్ ఇండియా లాంటి ఎయిర్లైన్స్ దానిని సమర్థించాయి. స్పైస్జెట్ లాంటి కొన్ని సంస్థలు మాత్రం మెల్లమెల్లగా అనుమతించడాన్ని సమర్థించాయి.
కోవిడ్-19 వ్యాప్తితో 2020 మార్చి 25 నుంచి దేశీయ విమాన సేవలను కూడా ఆపేశారు. ఆ తర్వాత 2020 మే 25 నుంచి రకరకాల నిబంధనలు, జాగ్రత్తలతో ఎయిర్ లైన్స్ పూర్తి సామర్థ్యంలో మూడోవంతు విమానాల కార్యకలాపాలను మాత్రమే ప్రారంభించారు.
అప్పటి నుంచి విమానాలు, విమానాశ్రయాల్లో సోషల్ డిస్టన్సింగ్, పరిశుభ్రత ప్రొటోకాల్ పాటించేలా ప్రభుత్వం మెల్లమెల్లగా వాటి సామర్థ్యం పెంచుతూ వస్తోంది.
2020 డిసెంబర్ 3న ఎయిర్ లైన్స్ తమ డొమెస్టిక్ విమానాల్లో 80 శాతం విమానాలను నడపడానికి కేంద్రం అనుమతించింది. ఇటీవల ప్రభుత్వం దానిని మరింత పెంచడం గురించి ఎయిర్ లైన్స్ అభిప్రాయం కోరింది.
- పాకిస్తాన్ మీదుగా విమానాలు బంద్
- 1971 గంగా హైజాక్: నకిలీ పిస్టల్తో పైలెట్లను భయపెట్టి, లాహోర్ తీసుకెళ్లి తగలబెట్టారు.. ఆ తర్వాత
వేసవిలోపు ధరల్లో మార్పు రావచ్చు
దీనిపై విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురీ బుధవారం పార్లమెంటులో మాట్లాడారు. "మనం ఇప్పుడు ఒక ఆసక్తికరమైన పరిస్థితిని ఎదుర్కుంటున్నాం. ఒకవైపు కొన్ని ఎయిర్ లైన్స్ పూర్తిగా 100 శాతం సర్వీసులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతుంటే, మిగతావి మాత్రం దానిని మెల్లమెల్లగా పెంచాలని భావిస్తున్నాయి అన్నారు.
"80 శాతానికి పైగా సామర్థ్యానికి అనుమతి ఇవ్వడం అనేది వైరస్ వ్యాప్తి, మన అవగాహన మీద ఆధారపడి ఉంటుంది" అని ఆయన అన్నారు.
దేశీయ విమానాల ఛార్జీల పరిధిని నిర్ణయించాలనే ప్రభుత్వ చర్యలను ఈ ఏడాది వేసవినాటికి ఉపసంహరించుకోవచ్చు అని చెప్పారు.
"విమాన ప్రయాణ ఛార్జీల పరిధి నిర్ణయించడం ఒక 'అసాధారణ చర్య'. కరోనావైరస్ అంతమైన తర్వాత దానిని ఉపసంహరించుకోవచ్చు" అని హర్దీప్ పురీ బుధవారం అన్నారు.
కరోనాకు ముందు విమానాల ఛార్జీలను ఎయిర్ లైన్స్ కంపెనీలే నిర్ణయించేవి, అందులో ప్రభుత్వ జోక్యం ఉండేది కాదు.
"అది మా ఉద్దేశం కాదు ఓపెన్ మార్కెట్లో విమాన ఛార్జీల పరిమితిని నిర్ణయించడం సరికాదు. ఈ వేసవిలో విమానాలు కరోనా కంటే ముందున్నట్టు పూర్తి సామర్థ్యంతో ఎగిరినపుడు, మాకు ధరలు పెంచాల్సిన అవసరమే ఉండదని మేం ఆశిస్తున్నాం" అన్నారు.
ఇవి కూడా చదవండి:
- చైనా సైన్యం 'కెప్టెన్ అమెరికా', 'ఐరన్ మ్యాన్' లాంటి సూపర్ హీరోలను సృష్టిస్తోందా
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- బుమ్రా, షమీ, ఉమేశ్, ఇషాంత్... ఇంగ్లండ్ను భయపెడుతున్న భారత పేసర్లు
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- '18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- బడ్జెట్ 2021-22: సామాన్యులకు ఈ బడ్జెట్తో చేకూరే ప్రయోజనాలు ఇవే..
- పాకిస్తాన్ గురించి నేపాల్ ప్రజలు ఏమనుకుంటారు?
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)