ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా..! జర బద్రం సుమీ..!!
న్యూఢిల్లీ/హైదరాబాద్ : ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా..! తస్మాత్ జాగ్రత్త.. పిన్ నంబర్ ఎంటర్ చేసేముందు ఒక చేతిని నంబర్ బటన్స్ కి అడ్డుగా పెట్టి మరో చేత్తో పిన్ నంబర్ ఎంటర్ చేయడం సురక్షితం. కొన్ని చిన్న చిన్న సూత్రాలు పాటిస్తే పెద్ద పెద్ద పొరపాట్లనుండి బయటపడే అవకాశాలు ఉంటాయి. మన దేశంలో సర్వసాధారణంగా మారిన కార్డు స్కిమ్మింగ్ మోసాల గురించి చాలామందికి అవగాహన ఉండదు. ఏటీఎం కార్డు స్కిమ్మింగ్ పరికరాలు ఎలా ఉంటాయి.
కార్డు వివరాలు, పిన్ నంబర్లు దొంగిలించి మోసగాళ్లకు ఎలా చేరవేస్తాయి అనేది కూడా అంతగా తెలియదు. అయితే దిల్లీలోని అర్జున్ నగర్ ప్రాంతంలో అప్రమత్తంగా వ్యవహరించిన కొందరు స్థానికులు ఈ ఏటీఎం మోసాల గుట్టురట్టు చేశారు. ఓ ఏటీఎంలో ఎవరూ గుర్తుపట్టలేని విధంగా అమర్చిన కార్డు స్కిమ్మింగ్ పరికరంతో పాటు రహస్య కెమేరాను బయటికి తీశారు. దీని తాలూకు వీడియోను ఉత్తర ప్రదేశ్ పోలీస్ అడిషినల్ ఎస్పీ రాహుల్ శ్రీవాస్తవ ట్విటర్లో పోస్టు చేశారు.
'అప్రమత్తంగా ఉన్న కొందరు పౌరులు ఢిల్లీలోని ఓ ఏటీఎం వద్ద కెమేరా, స్కిమ్మింగ్ పరికరాన్ని బయటపెట్టారు. వినియోగదారుడి పిన్ నంబర్ తెలుసుకునేందుకు ఏటీఎం లోపల దొంగలు ఓ కెమేరా, స్కిమ్మర్లను అమర్చారు. ఒక్కసారి పిన్ నంబర్ రికార్డు అయ్యి, స్కిమ్మర్లో కార్డు వివరాలు స్టోర్ అయితే చాలు, వీటి ఆధారంగా దొంగలు క్లోన్డ్ కార్డులు తయారు చేయడం, ఆన్లైన్లో కొనుగోళ్లు చేయడం మొదలు పెడతారు' అని ఆయన వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్లో ఢిల్లీలోని లక్ష్మినగర్ ప్రాంతంలో పెద్దఎత్తున ఏటీఎం మోసాలు జరిగాయి.
ఇక్కడ ఏటీఎంలలో కార్డులు స్వైప్ చేసిన దాదాపు 12 మంది వినియోగదారుల ఖాతాల్లో నుంచి 10 లక్షల రూపాయలకు పైగా మాయమయ్యాయి. ఏటీఎం కార్డు స్కిమ్మింగ్ల కారణంగానే ఇలా జరుగుతున్నదనీ, చాలా కాలం నుంచి బ్యాంకులకు ఇది పెద్ద తలనొప్పిగా మారిందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వినియోగదారులు డబ్బులు డ్రా చేయడానికి ఈ సారి ఏటీఎంకి వెళితే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఏటీఎం నంబర్ ప్లేటు పైభాగంలో రహస్య కెమేరాలు అమర్చే అవకాశం ఉన్నందున చేతులు అడ్డుగాపెట్టి నంబర్ బటన్స్ నొక్కడం మంచిది. అలా కాకుండా ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఖాతాలోని సొమ్ము ఇట్టే మాయమవడం ఖాయమనే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి.