ఫేస్బుక్-జియో డీల్: ఇక ఆన్లైన్ ద్వారా లోకల్ కిరాణా స్టోర్ల నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు..ఎలాగంటే..?
ముంబై:రిలయన్స్తో ఫేస్బుక్ జతకడుతుందని కొద్దిరోజులుగా వస్తున్న వార్తలు వాస్తవరూపం దాల్చాయి. రిలయన్స్ జియోలో 9.99 శాతం వాటాలను ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా సంస్థ అయిన ఫేస్బుక్ కొనుగోలు చేయడంతో ఇక రెండు సంస్థల మధ్య బంధం ఏర్పడింది. ఇక జియో గ్రూప్లో ఒకటిగా ఉన్న ఆన్లైన్ గ్రాసరీస్ డెలివరీ సంస్థ జియో మార్ట్ తన వ్యాపారాన్ని మరింత ప్రమోట్ చేసుకునే అవకాశం లభించింది.
ఇక ఫేస్బుక్ సంస్థకే చెందిన వాట్సాప్ ద్వారా జియోమార్ట్ తమ లోకల్ వెండార్స్ను ఒక గొడుగు కిందకు చేర్చనుంది. అంతేకాదు చిరు వ్యాపారస్తులను, కిరాణా దుకాణాలను ఆన్లైన్ వేదికపైకి జియో మార్ట్ తీసుకురానున్నట్లు సమాచారం. ఫేస్బుక్ యజమాని మార్క్ జుకర్బర్గ్, ముఖేష్ అంబానీకి చెందిన జియోతో డీల్ కుదిరాకా జియో మార్ట్ ఈ కొత్త ప్లాన్ను ఇంప్లిమెంట్ చేయనున్నట్లు సమాచారం.
జియోమార్ట్ సరికొత్త ఆలోచన
భారత్లోని ఈ-కామర్స్ రంగంలో జియో మార్ట్ ప్రవేశించి తన ఆన్లైన్ బిజినెస్ను మరింత విస్తరిస్తున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలో రిలయన్స్ ప్రకటిచింది. ఇక ఫేస్బుక్తో డీల్ ఓకే అయినందున జియోమార్ట్పై స్థానిక దుకాణాదారులు, చిన్న తరహా కిరాణా స్టోర్లు రిజిస్టర్ చేసుకునే వీలు జియో మార్ట్ కల్పిస్తోంది. ఇక ఆర్డర్లను వాట్సాప్ ద్వారా తీసుకోనుంది. ఇక వాట్సాప్ గురించి చాలామందికి అవగాహన ఉన్నందున ఈ వేదికను విరివిగా వినియోగించుకోవాలని జియో మార్ట్ భావిస్తోంది. అదే సమయంలో కిరాణా స్టోర్లను కూడా ఇందులో చేర్చడం ద్వారా తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలని జియో మార్ట్ భావిస్తోంది. ఇప్పటి వరకు కిరాణాస్టోర్లకు కస్టమర్లు వెళ్లి సరుకులను తీసుకునేవారని ఇప్పుడు అదే కిరాణా స్టోర్లు వాట్సాప్ ద్వారా ఆర్డర్లు అందుకుని డెలివరీ చేస్తాయని జియో మార్ట్ చెబుతోంది.
గ్రామీణభారతంలో పెరగనున్న ఇంటర్నెట్ వినియోగం
వాట్సాప్- జియోమార్ట్ ఆలోచన సక్సెస్ అయితే భారత్లో ఇంటర్నెట్ వినియోగం విరివిగా పెరగడమే కాకుండా వాట్సాప్ గురించి గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా తెలుసే అవకాశం ఉంది. తద్వారా తమ వ్యాపారం కూడా పెరుగుతుందని వాట్సాప్ భావిస్తోంది. ఇప్పటికే వాట్సాప్ భారత్లో తన సేవలను వివిధ రూపాల్లో అందజేస్తోంది. ఇందులో యూపీఐ ద్వారా చెల్లింపులు ముఖ్యమైనవి. ఇక ఫేస్బుక్-రిలయన్స్ జియో డీల్ గురించి మాట్లాడిన రిలయన్స్ ఛైర్మెన్ అంబానీ, రిలయన్స్ సంస్థలోకి దీర్ఘకాలిక భాగస్వామిగా ఫేస్బుక్ను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. భారత్లో పెరుగుతున్న డిజిటల్ వినియోగంకు ఈ భాగస్వామ్యం మరింత ఉపయోగపడుతుందని చెప్పారు. అంతేకాదు ఈ భాగస్వామ్యం ప్రధాని నరేంద్ర మోడీ విజన్ డిజిటల్ ఇండియా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లను నెరవేరుస్తుందని అంబానీ అన్నారు.
ఫేస్బుక్ జియో డీల్తో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది: అంబానీ
ప్రస్తుతం కరోనావైరస్తో భారత ఆర్థిక వ్యవస్థ కాస్త మందగించిందని చెప్పిన అంబానీ వైరస్ మహమ్మారి నుంచి దేశం కోలుకున్న తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ అతికొద్ది సమయంలోనే ట్రాక్పైకి వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంలో ఫేస్బుక్-రిలయన్స్ సంస్థల భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని అంబానీ వెల్లడించారు. జియోమార్ట్ ద్వారా దాదాపు 3కోట్ల చిన్న తరహా కిరాణా స్టోర్లను వాట్సాప్ వేదికపైకి తీసుకొస్తామని చెప్పిన అంబానీ... ఇక లావాదేవీలన్నీ డిజిటల్ పద్దతిలోనే జరుగుతాయని అన్నారు.
డీల్పై మార్క్ జుకర్బర్గ్ స్పందన
ఇదిలా ఉంటే ఈ భారీ డీల్పై ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్ తన స్పందన తెలియజేశారు. ఈ భారీ ఒప్పందం ద్వారా భారత్లో కొన్ని కీలక ప్రాజెక్టులను ప్రారంభించాలని భావిస్తున్నట్లు జుకర్బర్గ్ తెలిపారు. భారత్ తమకు ప్రత్యేకమైన మార్కెట్ అని చెప్పిన జుకర్ బర్గ్... ఫేస్బుక్ మరియు వాట్సాప్లకు అతిపెద్ద మార్కెట్గా భారత్ నిలిచిందని చెప్పారు. అంతేకాదు డిజిటల్ ఎకానమీగా రూపాంతరం చెందడంలో భారత్ పరుగులు పెడుతోందని చెప్పారు.