ప్రియాంకా ఎఫెక్ట్: కాంగ్రెస్ను కూడా కలుపుకుపోదామా , పొత్తుపై పునరాలోచనలో ఎస్పీ బీఎస్పీలు..?
లక్నో: ఉత్తర్ ప్రదేశ్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు పొత్తు పెట్టుకోవడంతో ఇబ్బందిల్లో పడిపోయాయి జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్.ఇక మరో వార్త ఉత్తర్ ప్రదేశ్లో జోరుగా ప్రచారం చేస్తోంది. పొత్తులపై ఎస్పీ బీఎస్పీలు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇంతకీ వారి ఆలోచన ఏంటి.. ఏమి చేయాలని భావిస్తున్నారు...?
పొత్తులపై పునరాలోచనలో ఎస్పీ బీఎస్పీ
ఉత్తర్ప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కాయి. అఖిలేష్ యాదవ్ మాయావతి పార్టీలు కలవడంతో కొత్త సమీకరణాలు తెరపైకి వచ్చాయి. త్వరలోనే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసి ప్రకటించేందుకు రెడీ అవుతున్న నేపథ్యంలో రెండు పార్టీల నేతలు పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. పొత్తుల సందర్భంగా కాంగ్రెస్ పార్టీని రెండు పార్టీలు విస్మరించాయి. ఇప్పుడు ప్రియాంకా గాంధీ ఎంట్రీతో మళ్లీ ఆలోచనలో పడ్డారు అఖిలేష్, మాయావతి. ఇక ఇప్పటికే ఎస్పీ బీఎస్పీల అభ్యర్థులు డిసైడ్ అయిపోయినట్లు తెలుస్తోంది. జాబితాకు ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో పడ్డారు నేతలు. ఫిబ్రవరిలో తొలిజాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఇదే సమయంలో కాంగ్రెస్ను కూడా తమతో కలుపుకుని పోవాలనే ఆలోచనలో ఎస్పీ బీఎస్పీలు ఉన్నట్లు సమాచారం. ఇక బీఎస్పీకి పశ్చిమ ఉత్తర్ప్రదేశ్, బుందేల్ఖండ్ ప్రాంతాల్లో సీట్ల సంఖ్యలో అధిక ప్రాధాన్యత ఇవ్వగా... సమాజ్ వాదీ పార్టీకి తూర్పు ఉత్తర్ ప్రదేశ్, సెంట్రల్ యూపీలో అధిక సంఖ్యలో సీట్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పట్టున్న స్థానాలపై ఏం చేద్దాం
మిషన్ 30 వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ గెలవాలని భావిస్తున్న సీట్లపై ఎస్పీ బీఎస్పీలు కన్నేశాయి. ప్రియాంకా గాంధీ ఎంట్రీతో ఆ సీట్లు కాంగ్రెస్కు వెళ్లే అవకాశం కనిపిస్తుండటంతో ఎస్పీ బీఎస్పీలు ముందుగా వాటి పంచాయతీ తెంచేందుకు రెడీ అయ్యాయి. ఇందులో భాగంగానే ముందుగా 15 సీట్లకు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. సహరన్పూర్, గజియాబాదు, ఖుషీ నగర్, మీర్జాపూర్, ఖేరి, లక్నో, దౌరారా, ఉన్నావ్, ప్రతాప్గఢ్, బారాబంకి, కాన్పూర్, ఫైజాబాదు, గొండా నియోజకవర్గాలకు అభ్యర్థులను త్వరగా ప్రకటించాలని ఎస్పీ బీఎస్పీలు భావిస్తున్నాయి. ఈ సీట్లపైనే కాంగ్రెస్కు కాస్త పట్టు ఉందని భావించిన ఎస్పీ బీఎస్పీ ముందుగా వీటిపై దృష్టి సారించాలని భావిస్తున్నాయి. అలా కాకపోతే కాంగ్రెస్కు షేక్ హ్యాండ్ ఇచ్చి హస్తం పార్టీతో కలిసి వెళ్లే యోచనపై కూడా ఆలోచన చేస్తున్నాయి ఎస్పీ బీఎస్పీ పార్టీలు.
ప్రియాంకా ఎంట్రీతో పిక్చర్ మారే అవకాశం
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పై నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి లక్షకు పైగా ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ప్రియాంకా గాంధీ రాజకీయాల్లోకి అడుగుపెట్టనుండటంతో అక్కడ సమీకరణాలు మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రియాంకా గాంధీ ఎంట్రీ ఒక కారణమైతే.. బీజేపీ కూడా అక్కడ తన ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఎట్టి పరిస్థితుల్లోను 30 సీట్లు తమ ఖాతాలోనే పడాలని భావిస్తున్నారు అఖిలేష్, మాయావతి. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం ఎస్పీ బీఎస్పీలు అధికారికంగా పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించి సంచలనానికి తెరలేపాయి. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో ఉత్తర్ప్రదేశ్ కీలకం కానుండటంతో దేశం మొత్తం ఆ రాష్ట్ర రాజకీయాలవైపే చూస్తోంది.