మిగిలింది రెండు విడతలే: ప్రచారంలో వేగం పెంచిన ప్రధాని... 10 రోజుల్లో 31 ర్యాలీల్లో మోడీ
ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇప్పటికే ఐదు విడతల పోలింగ్ పూర్తయ్యింది. ఇక మిగిలిన రెండు దశలు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో నేతల ప్రచార జోరులో వేడి కనిపిస్తోంది. తక్కువ సమయం మిగిలి ఉండటంతో వీలైనన్ని బహిరంగ సభల్లో పాల్గొని ప్రచారం నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ 10 రోజుల్లో 31 ర్యాలీల్లో పాల్గొనాలని యోచిస్తున్నారు. ఇందులో ఆరు ర్యాలీలు పశ్చిమ బెంగాల్లో ఉండగా ఎనిమిది ర్యాలీలు ఉత్తర్ ప్రదేశ్లో ప్లాన్ చేశారు.
మోడీ షెడ్యూలు చూస్తే 8మే నుంచి 17 మే వరకు అంటే ప్రచారానికి చివరి రోజువరకు మొత్తం 31 సభలను ప్లాన్ చేసింది బీజేపీ అధిష్టానం. ఉత్తరాదినా మోడీ హర్యానా, ఢిల్లీ ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్లలో బహిరంగ సభల్లో మోడీ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ పై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడ ఎలాగైనా సరే మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని కమలం పార్టీ భావిస్తోంది.2014లో కేవలం రెండు సీట్లు మాత్రమే బీజేపీ అక్కడ గెలిచింది. ఇక పశ్చిమ బెంగాల్లో ఇంకా 17 స్థానాలుకు పోలింగ్ జరగాల్సి ఉండగా అక్కడ ఆరు సభల్లో మోడీ పాల్గొంటారు.
ఇక ఉత్తర్ ప్రదేశ్లో 27 స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా అక్కడ 8 ర్యాలీల్లో మోడీ ప్రసంగిస్తారు. 2014లో ఉత్తర్ ప్రదేశ్లో బీజేపీ మొత్తం 80 లోక్సభ స్థానాలకు గాను 71 స్థానాలు గెలుచుకుంది. కానీ ఈ సారి పరిస్థితి అక్కడ మారింది. ఎస్పీ బీఎస్పీలు కలిసి పోటీ చేస్తుండటంతో బీజేపీకి ఉత్తర్ ప్రదేశ్ క్లిష్టంగా మారింది. ఒక్కసారిగా యూపీలో రాజకీయ సమీకరణాలు మారాయి. అక్కడ తిరిగి పాగా వేసేందుకు బీజేపీ సర్వశక్తులను ఒడ్డుతోంది.