మహారాష్ట్ర హర్యానా ఫలితాల ఎఫెక్ట్: రాజ్యసభలో బీజేపీకి తగ్గనున్న సీట్లు
మహారాష్ట్ర, హర్యానాలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అనుకున్న దానికంటే కాంగ్రెస్ మెరుగైన ప్రదర్శన కనబర్చగా.. బీజేపీ మాత్రం ఒక్కింత అసంతృప్తితోనే ఉంది. అయితే రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది బీజేపీ అధినాయకత్వం. ఇంతవరకు బాగానే ఉన్నా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన సీట్లు ఆధారంగా చూసుకుంటే రాజ్యసభ సీట్లపై ఏమైనా ప్రభావం చూపుతుందా..?
రాజ్యసభ సీట్లపై ప్రభావం
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో వెలువడిన అసెంబ్లీ ఫలితాలు బీజేపీని నిరాశపర్చాయి. రెండు రాష్ట్రాల్లో అత్యధిక స్థానాలు కొల్లగొట్టి రాజ్యసభ సీట్లను పెంచుకుందామనుకున్న మోడీ అండ్ షా టీమ్కు ఈ ఫలితాలు కొంత నిరాశకు గురిచేశాయనే చెప్పాలి. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఇక్కడ వచ్చిన సీట్ల సంఖ్య రాజ్యసభపై ఎఫెక్ట్ చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో అధికారం కోల్పోయిన బీజేపీ... రాజ్యసభ సీట్లు మెరుగుపర్చుకునే అవకాశం కోల్పోయింది. ఇక గురువారం రెండు రాష్ట్రాలకు వెలువడిన ఫలితాలతో బీజేపీకి రాజ్యసభలో సీట్ల సంఖ్య తగ్గి కాంగ్రెస్కు సీట్లు పెరిగే అవకాశాలున్నాయి.
2020,2022లో మహారాష్ట్ర హర్యానా రాష్ట్రాలకు రాజ్యసభ ఎన్నికలు
మహారాష్ట్ర నుంచి 19 మంది రాజ్యసభకు వెళ్లనుండగా హర్యానా నుంచి ఐదుగురు రాజ్యసభకు వెళతారు. హర్యానాలోని ఐదుగురిలో కాంగ్రెస్ నుంచి ఒకరు ఉండగా.. బీజేపీ నుంచి ముగ్గురు రాజ్యసభలో ఉన్నారు. మరొకరు ఇండిపెండెట్గా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే బీజేపీ మద్దతుతోనే సుభాష్ చంద్ర రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇక మహారాష్ట్రలో కాంగ్రెస్-నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీల నుంచి ఏడుగురు రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.ఇక ఎన్డీఏ నుంచి 11 మంది రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇక హర్యానా నుంచి ఐదు రాజ్యసభ సీట్లకు గాను రెండు సీట్లకు 2020 మరో రెండు సీట్లకు 2022లో ఎన్నికలు జరుగుతాయి. మహారాష్ట్రలోని 19 రాజ్యసభ సీట్లకుగాను, 2020లో ఏడు సీట్లకు ఎన్నికలు జరుగ నుండగా.. మరో ఆరు సీట్లకు 2022లో ఎలక్షన్ జరుగుతుంది. ఇక రెండు రాష్ట్రాల్లో మిగిలిపోయిన స్థానాలకు 2024లో ఎన్నికలు జరుగుతాయి.
మహారాష్ట్రలో 36 ఓట్లు, హర్యానాలో 30 ఓట్లు
2020, 2022లో హర్యానాలో నాలుగు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా కాంగ్రెస్కు అక్కడ ఒక స్థానమే ఉంది. ఇక 2020 ,2022లో మహారాష్ట్రలో 13 సీట్లకు ఎన్నికలు జరగనుండగా ఎన్డీఏకు ఏడు సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్-ఎన్సీపీలకు 5 సీట్లు ఉన్నాయి. ఇక హర్యానాలో రాజ్యసభ ఎంపీని ఎన్నుకోవాలంటే 30 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం, అదే సమయంలో మహారాష్ట్రలో రాజ్యసభ ఎంపీఎన్నిక కావాలంటే 36 ఎమ్మెల్యేల మద్దతు అవసరం.
పెద్దల సభకు హర్యానా నుంచి ఒకరు మహారాష్ట్ర నుంచి నలుగురు
2020లో హర్యానాలో రెండు సీట్లకు మహారాష్ట్రలో ఏడు సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. ఈ లెక్కన చూసుకుంటే హర్యానా నుంచి బీజేపీ ఒక్క రాజ్యసభ సీటును మాత్రమే గెలిచే అవకాశం ఉంది. ఇక బీజేపీ-శివసేనలకు 163 స్థానాలు వచ్చిన నేపథ్యంలో మహారాష్ట్ర నుంచి నలుగురు ఎంపీలను మాత్రమే పంపే అవకాశాలుంటాయి. ఇక కాంగ్రెస్ హర్యానా నుంచి ఒక రాజ్యసభ సీటు, మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ - ఎన్సీపీలకు అసెంబ్లీ ఎన్నికల్లో 103 సీట్లు సాధించాయి కాబట్టి ఇద్దరు ఎంపీలను ఈ పార్టీలు రాజ్యసభకు పంపే అవకాశం ఉంటుంది. 2022లో కూడా ఇంచుమించు ఇదే పద్దతి కొనసాగుతుంది.
రాజ్యసభ ఎన్నికల్లో కీలకం కానున్న ఇండిపెండెంట్లు
ఇక కాంగ్రెస్తో కానీ బీజేపీతో కాని పొత్తు పెట్టకుండా ఒంటరిగా బరిలోకి దిగిన పార్టీలు 18 స్థానాలు హర్యానాలో గెలుపొందగా మహారాష్ట్రలో 20 స్థానాల్లో విజయం సాధించాయి. ఈ పార్టీలన్నీ ఏకమైతే వీరు కూడా రాజ్యసభ ఎంపీల ఎన్నికలో కీలకంగా మారే అవకాశం ఉంది. బీజేపీకి రాజ్యసభలో ప్రస్తుతం 82 మంది ఎంపీలున్నారు. కాంగ్రెస్కు 45 మంది ఉన్నారు. అయితే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్లలో బీజేపీ ఓటమి పాలైనందున ఆ ప్రభావం ఈ సీట్లపై పడే అవకాశం ఉంది.
మూడు రాష్ట్రాల ఫలితాలతో దెబ్బతిన్న బీజేపీ
ఛత్తీస్గఢ్లో 15 ఎమ్మెల్యేలు బీజేపీకి ఉన్నారు. కానీ ఒక రాజ్యసభ సీటు పొందాలంటే 30 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం అవుతుంది. రాజస్థాన్లో 73 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి ఉన్నారు. అయితే ఒక రాజ్యసభ సీటు పొందాలంటే ఆరాష్ట్రంలో 50 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం అవుతుంది. అయితే ఇక్కడ బీజేపీకి ఒక రాజ్యసభ సీటు మాత్రమే దక్కుతుంది. ఇక మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీకి 109 సీట్లు ఉన్నాయి. అక్కడి నుంచి రాజ్యసభ సీటు పొందాలంటే 58 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది. ఇక్కడ కూడా బీజేపీకి ఒక్క సీటు మాత్రమే పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ నుంచి బీజేపీ తరపున రాజ్యసభలో ముగ్గరు ఎంపీలు ప్రాతినిథ్యం వహిస్తుండగా.. మధ్యప్రదేశ్నుంచి ఎనిమిది, రాజస్థాన్ నుంచి 9మంది అభ్యర్థులు రాజ్యసభలో బీజేపీ తరపున ఉన్నారు.