ఆరెస్సెస్ నీడ నుంచి బీజేపీ బయటపడుతోందా - నడ్డా టీమ్ కూర్చు సంకేతమిదేనా ?
ఒకప్పుడు రాష్ట్ర్రీయ స్వయం సేవక్ సంఘ్ను తన ఆత్మగా చెప్పుకున్న భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు దాంతో అవసరం తీరిపోయిందా ? జనసంఘ్ రోజుల నాటి రాజకీయాలకు కాలం చెల్లిందని కాషాయ పార్టీ భావిస్తోందా ? ఆరెస్సెస్ నీడన ఉంటే కాలానుగుణంగా మారడం సాధ్యం కాదనే అంచనాకు బీజేపీ వచ్చేసిందా ? తాజాగా జేపీ నడ్డా ప్రకటించిన ఆ పార్టీ జాతీయ కార్యవర్గ కూర్పు చూస్తుంటే ఇదే అనిపించక మానదు. ఒకప్పుడు ఆరెస్సెస్ నేపథ్యం కలిగిన నేతలతో కళకళలాడిన బీజేపీ జాతీయ కార్యవర్గంలో ఇప్పుడు ఇద్దరు కీలక నేతలను, అదీ తెలుగువారిని పక్కనబెట్టేశారు.
బీజేపీ-ఆరెస్సెస్ సంబంధాలు...
ఆరెస్సెస్ భావజాలం నుంచి పుట్టుకొచ్చిన జనసంఘ్ ఆ తర్వాత కాలంలో భారతీయ జనతాపార్టీగా రూపుమార్చుకుంది. ఒకప్పుడు ఆరెస్సెస్ సిద్ధాంతాలే పునాదులుగా ఆవిర్భవించిన జనసంఘ్.. బీజేపీగా మారినా ఇప్పటికీ మాతృసంస్ధ ఆరెస్సెస్ నీడనే కొనసాగుతూ వస్తోంది. పలు సందర్భాల్లో ఆరెస్సెస్ చర్యలతో అధికారంలోకి ఉన్న బీజేపీ ఇరుకునపడినా అంతిమంగా ఆ పార్టీ లబ్ది పొందిన సందర్భాలే చరిత్రలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇప్పటికీ ఆరెస్సెస్ నేపథ్యమున్న నేతలనే బీజేపీ తమ రాష్ట్ర కార్యవర్గాల్లో సైతం చోటిస్తోంది. అెంతెందుకు ఏపీలో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోమువీర్రాజుతో పాటు మాజీ అధ్యక్షుడు కన్నా కూడా ఆరెస్సెస్ నేపథ్యం ఉన్న వారే. అంతగా పెనవేసుకుపోయిన బంధం బీజేపీ-ఆరెస్సెస్ది.
నడ్డా టీమ్ కూర్పులో ఆరెస్సెస్కు షాక్...
ఆరెస్సెస్తో బలమైన సంబంధాలను కొనసాగిస్తూ వచ్చిన బీజేపీ తాజాగా సంఘ్ నీడ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఆరెస్సెస్తో సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేసుకోవాలని మోడీ-అమిత్షా ద్వయం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ప్రకటించిన నడ్డా టీమ్లోనూ కేవలం ఒకే ఒక ఆరెస్సెస్ సభ్యుడికి చోటు దక్కడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. నడ్డా టీమ్లో హైప్రొఫెల్ ఆరెస్సెస్ నేతలుగా పేరుతెచ్చుకున్న రామ్ మాథవ్, మురళీధర్రావుకు చోటు దక్కలేదు. వీరిద్దరితో పాటు మరో ఇద్దరు ప్రధాన కార్యదర్శులు అనిల్ జైన్, సరోజ్ పాండే కూడా తాజాగా బీజేపీ కార్యవర్గంలో చోటు కోల్పోయిన వారిలో ఉన్నారు. వీరికి తాజాగా ఇతర బాధ్యతలు కూడా అప్పగించకపోవడంతో వీరికి కత్తెర పడిందనే చెప్పవచ్చు.
అయితే పైపైకి.. లేదా ఇంటికి.. ప్రచారక్ల నేపథ్యం...
బీజేపీలో కొన్నేళ్లుగా గమనిస్తే ఆరెస్సెస్ నేపథ్యం నుంచి వచ్చిన వారు పార్టీలో ఉన్నత స్ధానాలకు చేరుకోవడం లేదా పార్టీ నుంచి బయటికి వెళ్లిపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. పార్టీలో ఉన్నత స్ధానాలకు ఎదిగి, ప్రధాన మంత్రులైన వాజ్పేయ్, మోడీలు ప్రచారక్లే. అలాగే పార్టీ నుంచి వివాదాలతో బహిష్కరణలకు గురైన గోవిందాచార్య, సంజయ్ జోషీ కూడా ఆరెస్సెస్ ప్రచారక్లే. దీంతో ప్రచారక్లుగా ఉన్న వారు పార్టీలో ఉన్నత స్ధానాలకు వెళ్లడం లేదా కెరీర్ ముగించడం ఎందుకు జరుగుతోందనే చర్చ కూడా సాగుతోంది. ఉన్నత స్ధానాలకు వెళ్లిన వారిని గమనిస్తే ఆరెస్సెస్ నుంచి వారు నేర్చుకున్న క్రమశిక్షణ, అంకితభావం, కరోర శ్రమకు ప్రతిబింబాలుగా కనిపిస్తారు. రెండో కోవలో వారిని గమనిస్తే వారు పార్టీని వీడి వెళ్లాల్సిన పరిస్ధితుల వెనుక అసలు కారణాలు ఎప్పటికీ బయటికి రావు.
చాలా సందర్భాల్లో తమ ముక్కుసూటితనం కారణంగా వీరు పైకి ఎదగడం, ఆ తర్వాత పార్టీలో అంతర్గతంగా టార్గెట్ కావడం వంటివి ఇందుకు ఓ కారణంగా చెప్పవచ్చు.
కేబినెట్లోనూ బీజేపీ నేతలదే హవా...
తాజాగా ప్రకటించిన జేపీ నడ్డా టీమ్లో ఆరెస్సెస్ నేతలను సాగనంపగా.. వీరి స్ధానంలో అసలు ఆరెస్సెస్తో కానీ, జనసంఘ్తో కానీ ఎలాంటి సంబంధం లేని తృణమూల్ నుంచి వచ్చిన ముకుల్ రాయ్ వంటి వారికే చోటిచ్చారు. అటు కేంద్ర కేబినెట్లో సైతం సంఘ్ నేతలు కాని వారి హవాయే కొనసాగుతోంది. ఓ దశలో తాజాగా నడ్డా టీమ్ నుంచి తప్పించిన రామ్మాథవ్, మురళీథర్ రావుకు కేబినెట్లో చోటు దక్కవచ్చన్న ప్రచారం కూడా సాగుతోంది. కానీ దీనిపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఇప్పటికే ఆరెస్సెస్ ప్రబావం లేకుండానే కేబినెట్ను నడిపిస్తున్న మోడీ-షా ద్వయం.. ఇప్పుడు పూర్తిగా ప్రచారక్లను పక్కనబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న చర్చ సాగుతోంది. తద్వారా ఆరెస్సెస్ నీడ నుంచి బీజేపీనిబయటికి తీసుకురావాలన్నది వీరి ధ్యేయంగా కనిపిస్తోంది.