అమ్మ రాజీనామా..! ప్రియాంక అరంగేట్రంతో సోనియా గాంధీకి పూర్తి విశ్రాంతి..!!
హైదరాబాద్ : రాజీవ్ గాంధీ హత్య తర్వాత కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఒడ్డున పడేసి, పార్టీకి కొండంత అండగా ఉన్న ధీర వనిత ఆమె. పార్టీ లో చెలరేగిన వివాదాలను, ఆదిపత్య పోరును చాకచక్యంగా పరిష్కరించి పార్టీని ఏక తాటిపై నడిపించిన మేధావి ఆమె. కాంగ్రెస్ పార్టీని రెండు పర్యాయాలు ఒంటి చేత్తో అదికారంలోకి తెచ్చిన అత్యంత సాహసోపేత మహిళ తాను. ఇప్పుడు రాజకీయలనుండి పూర్తిగా విశ్రాంతి తీసుకోబోతున్నారు. బాద్యతలను కూమారుడు రాహుల్ గాంధీకి, కూతురు ప్రియాంక గాంధీకి అప్పగించి రాజకీయ జీవితానికి స్వస్తి పలకాలనుకుంటున్నారు సోనియా గాంధీ. గత కొంత కాలంగా సోనియా ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉండడంతో ఇక పూర్తి విశ్రాంతి దిశగా ఆమె నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
రాయబరేలీ నుంచి బరిలో ప్రియాంక..! పూర్తి విశ్రాంతిలో సోనియా..!!
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ ఆగమనం దేశ రాజకీయాల్లోనే కాదు పార్టీలో అంతర్గతంగా కూడా పెనుమార్పులకు కారణం కానుందా, అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తనయ రాకతో అమ్మ ఇక పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నారు. ఇప్పటికే సోనియా గాంధీ పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరమయ్యారు. దాదాపు 22 ఏళ్లపాటు దేశ రాజకీయాలను శాసించి అలసిపోయి ఇక విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారు. కాంగ్రెస్ నేతలు చెబుతున్న దాని ప్రకారం వచ్చే ఎన్నికల్లో సోనియాగాంధీ స్థానంలో ఉత్తరప్రదేశ్లోని రాయబరేలీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.
రాయబరేలీలో ప్రియాంక సుపరిచితురాలే..! ప్రభావం ఉంటుందంటున్న నేతలు..!!
గత రెండు పర్యాయాలుగా ఎన్నికల ప్రచారంలో భాగంలో రాయ్బరేలీలో ప్రియాంక విస్తృతంగా పర్యటించారు. అక్కడ ఆమెకు మంచి పరిచయాలు కూడా ఉన్నాయి. ఈసారి అక్కడి నుంచి బరిలోకి దిగుతారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఇదే జరిగితే ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు దూరమైన సోనియాగాంధీ, ఇక పదవులకు దూరమై పూర్తి స్థాయిలో విశ్రాంతి తీసుకోనున్నారు. రెండు దశాబ్దాల రాజకీయ జీవితానికి సోనియాగాంధీ ఇక స్వస్తి పలకనున్నారు. రాజీవ్గాంధీ మరణించిన అయిదేళ్ల అనంతరం అగమ్యగోచరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి సోనియాగాంధీ చుక్కానిలా వ్యవహరించారు.
కాంగ్రెస్ పార్టీకి చుక్కాని లా సోనియా..! రెండు పర్యాయాలు అదికారంలోకి తెచ్చిన ఉక్కు మహిళ..!!
1997లో కాంగ్రెస్ అధినేత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పార్టీలో కొత్త జవసత్వాలు నింపి పార్టీ శ్రేణులను ఏకం చేశారు. 1999 ఎన్నికలలో తొలిసారిగా రాయబరేలీ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. అప్పట్నుంచి వరుస ఎన్నికల్లో 2004, 2009, 2014లో విజయం సాధిస్తూ వచ్చారు. రాయబరేలీ కాంగ్రెస్కు గట్టి పట్టున్న స్థానంగా మారింది. గతంలో రెండు పర్యాయాలు ఇందిరాగాంధీ కూడా ఇదే లోక్సభ స్థానం నుంచి గెలిచారు. ఇప్పుడు వారి రాజకీయ వారసురాలిగా ప్రియాంక ఆ స్థానంలోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడి ప్రజలు ప్రియాంకలో నాటి ఇందిరగాంధీని చూసుకుంటుంటారు.
రాజకీయాలు నుండి పూర్తిగా తప్పుకోనున్న సోనియా..! సహకరించని ఆరోగ్యం..!!
ప్రియాంక బరిలో దిగితే సోనియాగాంధీ తన రాజకీయ పదవులను త్యాగం చేయనున్నారు. ఇప్పటికే పార్టీ అధ్యక్ష బాధ్యతలు తనయుడు రాహుల్గాంధీకి అప్పగించి పార్టీ కార్యక్రమాలు చాలావరకు దూరంగా ఉంటున్నారు. అనారోగ్యం కారణంగా పార్టీ కార్యక్రమాలపై ఆమె దృష్టి పెట్టలేని పరిస్థితి నెలకొంది. అందుకే 2017 డిసెంబరులోనే రాహుల్కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత గతేడాది నవంబరులో తెలంగాణ ఎన్నికలలో బహిరంగసభలో పాల్గొనడం వినహాయించి మరెక్కడా రాజకీయా సభల్లో పాల్గొనలేదు. ఇక వచ్చే ఎన్నికలలో పోటీకి దూరంగా కావాలని నిర్ణయించుకున్నారు సోనియా గాంధీ. ఇక కాంగ్రెస్ పార్టీ లో రాజకీయాలు సోనియా ముందు, సోనియా తర్వాత అనే సందర్బం రానే వచ్చిందని చర్చ జరుగుతోంది.