దక్షిణాదిన కాంగ్రెస్ పరిస్థితేంటీ? ఇప్పట్లో తేరుకోగలదా?
అమరావతి: అతి పెద్ద రాష్ట్రాలు ఉన్న దక్షిణాదిన కాంగ్రెస్ పార్టీ మనుగడ కొనసాగించడం కనాకష్టంగా మారింది. చేతికి అందిన అధికారాన్ని సైతం పోగొట్టుకునే దుస్థితికి దిగజారింది. భారతీయ జనతాపార్టీ రూపంలో ఎన్నికల్లో ఘోర పరాజయాలు ఆ పార్టీని వెంటాడుతున్నాయి. వేటాడేస్తున్నాయి. అధికారంలోకి రావడం ఒక ఎత్తయితే, అందిన అధికారాన్ని నిలుపుకోవడం మరో ఎత్తుగా మారింది. వంద సంవత్సరాలకు పైగా ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఆధునిక భారతంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. పల్లమే తప్ప ఎత్తు ఎరగని స్థితికి చేరుకుంది. దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయడం ఇక ఇప్పట్లో అసాధ్యమే అనిపించేలా ఉంది కాంగ్రెస్ సినారియో.
యడ్యూరప్ప అలా.. కుమార ఇలా.. బలపరీక్షతో పరువుతీసుకున్న సీఎం
ప్రాంతీయ పార్టీలదే హవా
దక్షిణాదిన ఆంధ్రప్రదేశ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలల్లో కాంగ్రెస్ అధికారంలో లేదు. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిపై మాత్రమే ఆ పార్టీ జెండా ఎగురుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలిసిన విషయమే. రాష్ట్ర విభజన తరువాత ఏపీ అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్కస్థానాన్ని కూడా దక్కించుకోలేకపోవడం ఆ పార్టీ దయనీయమైన దుస్థితికి అద్దం పడుతోంది. రాష్ట్ర విభజన తరువాత రెండు దఫాలుగా ఎన్నికలు నిర్వహించగా.. కనీసం డిపాజిట్లను కూడా సాధించుకోలేకపోయింది. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశంల హవా వీస్తోంది. తెలంగాణలో గట్టిగా పోరాడుతున్నప్పటికీ.. అక్కడ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష బారిన పడి కుదేలైంది. తమిళనాడులో కాంగ్రెస్ పరిస్థితి కేవలం నామమాత్రమే. అక్కడ కూడా ప్రాంతీయ పార్టీలదే హవా.
కంటి తుడుపుగా పుదుచ్చేరి, కేరళ..
ప్రస్తుతం పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతోంది. కేరళలో అధికారంలో లేకపోయినప్పటికీ.. బలమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తోంది. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ కేరళలో 20కి 20 స్థానాలనూ తన ఖాతాలో వేసుకుని, పరువు నిలబెట్టుకుంది. కేరళ అసెంబ్లీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించినప్పటికీ.. అధికారంలోకి రాగలమనే ధీమా కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమౌతోంది. దేశవ్యాప్తంగా కాషాయ జెండా గాలులు వీచినప్పటికీ.. కేరళలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. కాంగ్రెస్ ముందు నిలవలేక చతికిల పడింది. కేరళ, పుదుచ్చేరిల తరహాలో మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో పూర్వవైభవం సాధించడం కాంగ్రెస్కు ఇప్పట్లో సాధ్యపడే అవకాశాలు ఏ మాత్రం లేనే లేవు. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, తెలంగాణలో టీఆర్ఎస్, కర్ణాటకలో బీజేపీ, తమిళనాడులో అన్నా డీఎంకే లేదా డీఎంకే వంటి బలమైన పక్షాలను ఢీ కొని నిలదొక్కుకోవడం అనేది సవాలుగా మారింది.
కర్ణాటకలో స్వయంకృతాపరాధం
కర్ణాటకలో భారతీయ జనతాపార్టీకి అధికారాన్ని దక్కకుండా చేయాలనే సింగిల్ అజెండాతో కాంగ్రెస్ పార్టీ.. ప్రత్యర్థి జనతాదళ్ (సెక్యులర్)తో జట్టు కట్టింది. అధికారాన్ని అందుకోగలిగింది గానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. కాంగ్రెస్ పార్టీలో చెలరేగిన అంతర్గత కుమ్ములాటలు కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని కూలగొట్టాయి. పరిస్థితి చేయి దాటుతున్నప్పటికీ.. అటు పార్టీ అధిష్ఠానం గానీ, ఇటు రాష్ట్రస్థాయి నాయకత్వం గానీ సరిదిద్దే ప్రయత్నానికి పూనుకోలేదు. ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయవచ్చనే విషయం తెలిసినప్పటికీ.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది కాంగ్రెస్ అగ్రనాయకత్వం. చివరికి చాపకింద నీళ్లు వచ్చేంత వరకూ తెచ్చుకుంది. అధికారంతో పాటు పరువునూ పోగొట్టుకుంది.
14 నెలల్లోనే..
కర్ణాటకలో14 నెలల పాటు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ కూటమి ప్రభుత్వం కుప్పకూలింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని లేకపోవడం వల్ల ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం రాత్రి శాసనసభలో నిర్వహించిన బలపరీక్షలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం 99-105 సభ్యుల తేడాతో ఓటమి పాలైంది. ఆ వెంటనే- కుమారస్వామి రాజీనామా పత్రాన్ని గవర్నర్ వజూభాయ్ వాలాకు అందజేయడం, ఆయన వెంటనే దాన్ని ఆమోదించడం.. చకచకా సాగిపోయాయి.