తప్పుకో: సీఎం అభ్యర్థికి బెదిరింపు లేఖ
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో పోటి చేస్తే నీ అంతు చూస్తామని బెదిరిస్తూ బీజేపీ సీనియర్ నాయకుడు ప్రేమ్ కుమార్కు గుర్తు తెలియని వ్యక్తులు లేఖ రాశారు. బీహార్ లో ఎన్టీఏ కూటమి తరఫున ప్రేమ్ కుమార్ ముఖ్యమంత్రి అభ్యర్థి అనే విషయం ప్రచారం ఉంది.
గయా టౌన్ నియోజక వర్గం నుంచి ప్రేమ్ కుమార్ పోటి చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన ఐదు సార్లు శాసన సభ్యుడిగా గెలుపొందారు. ఈ సందర్బంలో గుర్తు తెలియని వ్యక్తులు నీవు గయా టౌన్ నుంచి పోటి చెయ్యరాదని, ఎన్నికలకు అయిన ఖర్చు మొత్తం తిరిగిచ్చేస్తామని, గయా టౌన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేస్తున్న రాజ్ కుమార్ ప్రసాద్ గెలవాలని లేఖలో వ్రాశారు.
అయితే పోటి నుంచి తప్పుకోకుంటే తీవ్రపరిణామాలు ఎదుర్కోంటావని ప్రేమ్ కుమార్ ను హెచ్చరించారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ మను మహరాజ్ ను కలిసి ప్రేమ్ కుమార్ కు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని మనవి చేశారు.
బెదిరింపు లేఖ వ్రాసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఈ విషయంపై బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి రాజ్ కుమార్ ప్రసాద్ స్పందించారు. తనను తప్పుడు కేసులో ఇరికించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. లేఖ ఎవరు వ్రాశారో పోలీసులు ఆరా తీస్తున్నారు.