గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత తొలగించడం ప్రజాస్వామ్యంపై దాడి చేయడమే: గెహ్లాట్, అమరిందర్ సింగ్
నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం అగ్గిరాజేసింది. గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత వెనక్కి తీసుకోవడంపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డాయి. ఎస్పీజీ భద్రతను ఎందుకు తీసేస్తున్నారో తెలియజేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు మోడీ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.
భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు
గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత వెనక్కి తీసుకోవడంపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇంటి వద్ద ఆందోళన చేపట్టాయి. గాంధీ కుటుంబానికి భద్రత కుదించడంలో కుట్ర ఉందని నినాదాలు చేశారు. అప్పటికే మొహరించిన పోలీసులు కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.
ప్రజాస్వామ్యంపై దాడి..?
గాంధీ కుటుంబానికి భద్రత కుదించడం అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్టేనని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. ఇదీ రాజకీయాలు దిగజారినతనానికి అద్దం పడుతుందని చెప్పారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకు కేంద్ర ప్రభుత్వం ఎస్పీజీ రక్షణ కల్పిస్తోంది. ఇవాళ భద్రతను కుదిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గాంధీ కుటుంబానికి తక్షణమే ఎస్పీజీ భద్రత కల్పిచాలని రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ డిమాండ్ చేశారు.
ఇప్పుడు కాదు.. 1991 నుంచి
గాంధీ కుటుంబానికి 1991 నుంచి కేంద్ర ప్రభుత్వం ఎస్పీజీ భద్రతను కల్పిస్తోంది. 1991లో అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య తర్వాత.. సెక్యూరిటీ ప్యానెల్ సిఫారసు మేరకు ఎస్పీజీ భద్రతను కల్పిస్తోంది. దానిని తీసివేసి సీఆర్పీఎఫ్ జవాన్లతో భద్రత కల్పిస్తామని కేంద్ర హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి.
నెలకొరిగిన నేతలు
గాంధీ కుటుంబం నుంచి ఇద్దరు నేతలు నెలకొరిగారని అశోక్ గెహ్లాట్ గుర్తుచేశారు. ఉగ్రవాద దాడుల నేపథ్యంలోనే వారు చనిపోయారని తెలిపారు. ఈ క్రమంలో ఎస్పీజీ భద్రతను తీసేయడం సరికాదన్నారు. గాంధీ కుటుంబానికి తప్పకుండా ఎస్పీజీ ప్రొటెక్షన్ కల్పించాలని డిమాండ్ చేశారు.
అనాలోచిత నిర్ణయం
గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను తప్పించడాన్ని పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా నిర్ణయం తీసుకుందని విమర్శించారు. గాంధీ కుటుంబం నుంచి ఇప్పటికే ఇద్దరు నేతలు చనిపోయారనే విషయాన్ని గుర్తుచేశారు. కొద్దిరోజుల క్రితం మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు కూడా కేంద్రం ఎస్పీజీ భద్రతను తీసివేసింది.
ప్రధాని, ఆ స్థాయి వ్యక్తులకు..
సాధారణంగా ఎస్పీజీ భద్రతను ప్రధానమంత్రి, ఆ స్థాయి వ్యక్తులు, మాజీ ప్రధానమంత్రులు, మావోయిస్టులు, ఉగ్రవాదుల హిట్లిస్ట్లో ఉన్న వారికి కల్పిస్తారు. 1991 నుంచి గాంధీ కుటుంబానికి ఎస్పీ రక్షణ కొనసాగుతుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం భద్రతను తీసేయడంపై సర్వత్రా చర్చానీయాంశమైంది.