బ్యాంకులో ఖాతా లేకున్నా, ఆధార్ తో డబ్బుల లావాదేవీలు, ఆ నెంబరే కీలకం...
బ్యాంకు ఖాతాలు లేకుండానే డబ్బుల లావాదేవీలను జరపవచ్చు.ఆధార్ నెంబర్ సహయంతో ఎక్కడి నుండైనా ఎక్కడికైనా డబ్బులను పంపే కొత్త విధానాన్ని త్వరలో అమల్లోకి రానుంది.దీంతో బ్యాంకు ఖాతాలతో పనే లేకుండా పోనుంది.
న్యూఢిల్లీ:బ్యాంకు ఖాతాలు లేకుండానే డబ్బుల లావాదేవీలు సులభంగా చేసుకొనే వెసులుబాటు కలుగుతోంది. బ్యాంకు ఖాతాలు లేకుండా ఇది ఎలా సాధ్యమంటే ఆధార్ నెంబర్ బ్యాంకు మాదిరిగా పనిచేస్తోంది. త్వరలోనే ఈ విధానం దేశంలో అమల్లోకి రానుంది.
పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా నగదు రహిత విధానాలను కేంద్రం ప్రోత్సహిస్తోంది. ఈ మేరకు డిజిటల్ చెల్లింపులు చేసేవారికి ప్రోత్సాహకాలను ప్రభుత్వం ఇస్తోంది.
డబ్బుల చెల్లింపులు, తీసుకోవడం అన్ని కూడ బ్యాంకుల ద్వారానే చేపట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది. బ్యాంకులు లేకుండా ఇక పనులు జరిగే పరిస్థితులు లేవు. ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాల కోసం ప్రయత్నిస్తున్నారు.
అయితే బ్యాంకు ఖాతాలు లేకున్నా ఆధార్ ఉంటే చాలు బ్యాంకుల తరహలోనే లావాదేవీలు చేసుకొనేలా ప్రభుత్వం చర్యలను తీసుకొంటుంది. త్వరలోనే ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది.
బ్యాంకులో ఖాతాలు లేకున్నా డబ్బు లావాదేవీలు
బ్యాంకులో ఖాతాలు లేకున్నా డబ్బుల లావాదేవీలు చేసుకొనే వెసులుబాటు త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఆధార్ కార్డు నెంబరే బ్యాంకు ఖాతాగా మారనుంది. ఆధార్ కార్డు పై ఉండే 12 అంకెలు సింగిల్ పాయింట్ పేమెంట్ అడ్రస్ గా మారనున్నాయి. పేమేంట్స్ బ్యాంకు ఇండియా పోస్టు ద్వారా దేశంలో ఎక్కడి నుండైనా ఎక్కడికైనా డబ్బులను పంపే వెసులుబాటు కలగనుంది.
ఆధార్ బ్యాంకు ఖాతాకు అనుసంధానం అవసరం లేదు
ప్రస్తుతం ఆధార్ ను బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేస్తున్నారు.ఆయా బ్యాంకుల్లో ఆయా ఖాతాదారుల లావాదేవీల వివరాలతో పాటు ఇతరత్రా సమాచారం తెలుసుకొనేందుకు గాను ఆధార్ ను అనుసంధానిస్తున్నారు. ఆధార్ కు చెందిన 12 నెంబర్ల ఆధారంగా లావాదేవీల కోసం బ్యాంకు ఖాతాలకు ఆధార్ ను అనుసంధానం చేయాల్సిన అవసరమే లేదు.అసలు బ్యాంకు ఖాతానే అవసరం లేదు.
పేమెంట్ సులభతరం
ఆధార్ తనకు తానుగా పేమెంట్ అడ్రస్ మాదిరిగా లేదని ఇండియా పోస్టు సిఈఓ ఎపిసింగ్ చెప్పారు. కానీ, 2017 సెప్టెంబర్ నుండి ప్రారంభించనున్న పేమెంట్స్ బ్యాంకు ఆపరేషన్ లో మొత్తం మార్పులు చోటుచేసుకొంటాయని ఆయన చెప్పారు.పేమెంట్స్ ను మరింత సులభతరం చేసేలా ఈ ప్రక్రియను తీసుకురానున్నట్టు ఆయన చెప్పారు.
ఎంపిక చేసిన 650 జిల్లాలో తొలి దశలో అమలు
ఆధార్ నెంబర్ల సహయంతో డబ్బు లావాదేవీలు చేసేందుకుగాను దేశవ్యాప్తంగా తొలుత 650 జిల్లాల్లో అమలు చేయనున్నట్టు ఇండియా పోస్టు సిఈఓ ఎపి సింగ్ చెప్పారు. పేమెంట్స్ ను మరింత సులభతరం చేసేందుకు పరిష్కారం ఆధార్ ను పేమెంట్ అడ్రస్ చేయడమేనని తాము భావిస్తున్నామని ఎపి సింగ్ చెప్పారు.
40 కోట్ల బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింకు
దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం 40 కోట్ల బ్యాంకు ఖాతాలకు ఆధార్ ను అనుసంధానం చేశారని ఆయన చెప్పారు. ప్రతి నెలా రెండు కోట్ల మంది ప్రజలు తమ బ్యాంకు ఖాతాలకు ఆధార్ ను అనుసంధానం చేస్తున్నారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియాకు సింగ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా వ్యవహరించారు.కొత్తగా ప్రవేశపెట్టే విధానం ద్వారా డబ్బులను ఎక్కడి నుండి ఎక్కడికైనా వేసుకోవచ్చు, తీసుకొనే వెసులుబాటు కలుగుతోంది.