కారణమిదే: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దూరంగా చౌదీపూర్
లక్నో: కనీస సౌకర్యాలు కూడ లేకపోవడంతో ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని చౌదీపూర్ గ్రామస్తులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దూరంగా ఉన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్ళు దాటినా ఈ గ్రామంలో సౌకర్యాలు కల్పించడంలో పాలకులు వైఫల్యం చెందారని ఆరోపిస్తూ వారు ఈ వేడుకులకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నారు.
దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకొంటున్న సందర్భంలో ఈ గ్రామస్తులు తీసుకొన్న నిర్ణయం సంచలనం కల్గిస్తోంది.
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరి జిల్లాలోని చౌదీపూర్ గ్రామంలో కనీస సౌకర్యాలు లేవు. మరుగుదొడ్లు లేకపోవడంతో గ్రామస్థులు బహిరంగ మల విసర్జన చేస్తున్నారు.
అటవీ ఉత్పత్తులను విక్రయిస్తూ వారు జీవనాన్ని సాగిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లా అధికారులు ఆ గ్రామాన్ని చూడనేలేదు. అభివృద్ది కార్యక్రమాలు చేపట్టే జాబితాలో ఈ గ్రామం పేరు ఉండదని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
80 కుటుంబాలున్న ఈ గ్రామంలో 4 మరుగుదొడ్లున్నాయి. ఈ గ్రామానికి సమీపంలోనే అటవీ ప్రాంతం ఉంటుంది. బహిర్భూమికి వెళ్ళే సమయంలో క్రూర మృగాలు దాడి చేస్తాయోమనే భయం గ్రామస్తుల్లో నెలకొంది.
కనీస సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దూరంగా ఉన్నారు.