కరోనా హాట్స్పాట్గా వోకార్డ్ హాస్పిటల్: సగం మంది నర్సులు, ముగ్గురు డాక్టర్లకు పాజిటివ్
ముంబై: ముంబైలోని ప్రఖ్యాత వొకార్డ్ ఆసుపత్రి తాజాగా కరోనా వైరస్ హాట్స్పాట్గా మారింది. ఈ ఆసుపత్రిలో పని చేస్తోన్న 26 మందికి పైగా నర్సులు, ముగ్గురు డాక్టర్లకు కరోనా వైరస్ సోకింది. వారంతా కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. ఫలితంగా- ఈ ఆసుపత్రి ప్రాంతం మొత్తాన్నీ మహారాష్ట్ర ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్గా ప్రకటించింది. ఆసుపత్రి సమీపంలో రాకపోకలను నిషేధించింది. ప్రస్తుతం ఆసుపత్రిలోకి రాకపోకలు సాగించడానికి ఎవ్వర్నీ అనుమతి ఇవ్వట్లేదని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు.
ముంబై సహా మహారాష్ట్రలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా ఉంటోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే 781 కరోనా పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో నమోదు అయ్యాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం వొకార్డ్ ఆసుపత్రిలో ఐసొలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. పెద్ద సంఖ్యలో అక్కడ కరోనా పాజిటివ్ పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు. పేషెంట్లకు చికిత్స అందించే క్రమంలో నర్సులు, డాక్టర్లు ఈ వైరస్ బారిన పడ్డారు. పాజిటివ్ పేషెంట్ల నుంచి వారికి సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు.
కిందటి నెల మార్చి 20వ తేదీన కస్తూర్బా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు పేషెంట్లను తొలిసారిగా వొకార్డ్కు తీసుకొచ్చారు. అప్పటి నుంచే వైరస్ వ్యాప్తి చెందడం విస్తృతమైందని భావిస్తున్నారు. వైరస్ బారిన పడిన నర్సులందరూ జనరల్ వార్డులో సేవలందించే వారే. పేషెంట్లకు వైద్యాన్ని అందించే సమయంలో ఎన్ని జాగ్రత్తలను తీసుకున్నప్పటికీ..ఈ మహమ్మారి బారిన పడటం కలకలం రేపుతోంది. మిగిలిన నర్సింగ్ స్టాఫ్, డాక్టర్లు ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో నర్సులు కరోనా వైరస్ బారిన పడటం ఇదే తొలిసారి.