బీజేపీ నేత వద్ద నా అభ్యంతరకర వీడియోలు: ప్రెస్మీట్లో గుండు చేసుకున్న మహిళ
లక్నో: ఉత్తర ప్రదేశ్లో ఇప్పటికే ఉన్నావ్ కేసు కారణంగా బీజేపీ ఇరుకునపడింది. ఇప్పుడు మరో బీజేపీ నాయకుడిపై మరో మహిళ ఆరోపణలు చేశారు. అత్యాచారం, బెదిరింపులకు పాల్పడ్డాడని, తాను ఆత్మహత్య చేసుకుంటానని ఆమె ఆరోపించారు.
చదవండి: అమిత్ షా, మోడీలకు సిద్ధరామయ్య ఊహించని ఝలక్, లీగల్ నోటీసులు: ఇదీ కారణం
బీజేపీ సీనియర్ నేత సతీష్ గత మూడేళ్లుగా తనను మానసికంగా వేధిస్తున్నారని ఓ మహిళా లాయర్ ఆరోపించారు. సదరు బీజేపీ నేత వద్ద తనకు సంబంధించిన అభ్యంతరకర ఫోటోలు, వీడియోలు ఉన్నాయని, వాటిని చూపించి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు.
ప్రెస్ మీట్లో గుండు చేసుకున్న మహిళ
ఆమె మీడియా ఎదుట తన గోడును వెళ్లబోసుకున్నారు. ప్రెస్ మీట్ సందర్భంగానే ఆమె గుండు చేసుకున్నారు. తాను పోలీసులను కలిసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. సోమవారం సాయంత్రం లోగా నిందితుడిపై చర్యలు తీసుకోకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.
బీజేపీలో లీడర్
అతను బీజేపీలో పెద్ద లీడర్ అని ఆమె చెప్పారు. అతను ఇప్పటికే తన జుత్తును కట్ చేశారన్నారు. అతను మా కుటుంబాన్ని బెదిరిస్తున్నాడని చెప్పారు. తాను బార్ అసోసియేషన్లోను ఫిర్యాదు చేశానని, కానీ లాభం లేకుండా పోయిందన్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే వారు ఏవేవో కారణాలు చెబుతున్నారన్నారు.
ఫ్యామిలీకి బెదిరింపులు
తన కుటుంబానికి బెదిరింపులు రావడంతో పాటు డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకుంటామని కూడా చెబుతున్నారని ఆమె ఆరోపించారు. సతీశ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, తనను మూడేళ్లుగా మానసికంగా హింసిస్తున్నాడన్నారు. అభ్యంతరకర వీడియోలుఉంచుకుని ఎంతో కాలంగా తనను బెదిరిస్తున్నాడని ఆమె ఆరోపించారు.
గతంలో ఉన్నావ్ కేసు
కాగా, ఉన్నావ్ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి ఆరోపణలు చేసింది. ఈ కేసు సీబీఐకి అప్పగించగా విచారణ చేపట్టిన అధికారులు సెంగార్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.