ఉడిపి స్వామీజీ మృతిపై అనుమానాలు: ఎవరీ రమ్య, మఠంపై ఆధిపత్యం?
బెంగళూరు: ఉడుపి శిరూర్ మఠాధిపతి శ్రీ లక్ష్మీరావ తీర్థ మృతి కేసులో పోలీసులు శనివారం ఓ మహిళను అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ మృతి కేసుపై ప్రత్యేక దర్యాఫ్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కొద్ది గంటలకే ఆమెను ప్రశ్నించారు. పోలీసులు విచారించిన మహిళ పేరు రమ్య. ఆమె వయస్సు ముప్పైకి పైగా ఉంటుంది. ఆమెను కస్టడీలోకి తీసుకోలేదని పోలీసులు తెలిపారు.
ఉడిపి స్వామీజీకి విష ప్రయోగం, మృతి: పోలీసు కస్టడీలో మహిళ, భారీగా నగలు, రాత్రి అక్కడే!
మఠాధిపతి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయని, అలాగే, స్వామీజీ సోదరుడు లతవ్యా ఆచార్య ఫిర్యాదు చేశారని, దీంతో తాము విచారణ ప్రారంభించామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే పలువురిని విచారించామని, మఠంను తమ ఆధీనంలోకి తీసుకున్నామని, కానీ ఇప్పటి వరకు ఎవరినీ కస్టడీలోకి తీసుకోలేదని చెప్పారు. విచారణ జరుగుతోన్నందున అన్ని విషయాలు వెల్లడించలేమన్నారు.
ఎవరీ మహిళ?
పోలీసులు ఆమెతో పాటు మరో ఆరుమందికి పైగా విచారించారు. ఫోరెన్సిక్ నివేదిక కోసం వేచి చూస్తున్నారు. ఆ మహిళను పోలీసులు సుదీర్ఘంగా విచారించడంతో ఈమె ఎవరు అనే చర్చ సాగుతోంది. ఆమె సులియా పుత్తూర్ ప్రాంతానికి చెందినవ్యక్తి. ఆమెకు అయిదేళ్ల వయస్సు కొడుకు ఉన్నాడు. మఠాధిపతికి చాలా క్లోజ్ అయిన ఓ ఆటో డ్రైవర్ సదరు మహిళను నాలుగేళ్ల క్రితం పరిచయం చేశాడు.
మఠాన్ని కంట్రోల్లోకి తెచ్చుకున్నారని
మఠంలో ఆమె వండిన పదార్థాలను కూడా ఆయన తినేవారని చెబుతున్నారు. గత ఒకటిన్నర రెండేళ్లుగా ఆమె రాకపోకలు సాగిస్తోందని అంటున్నారు. ప్రతి సోమవారం ఆమె తల్లితో కలిసి మఠానికి వచ్చేదని చెబుతున్నారు. అంతేకాదు, మఠానికి సంబంధించిన వ్యవహారాలను కూడా ఆమె చూసేస్థాయికి వచ్చారని అంటున్నారు. మఠంలోని వారికి ఆమె వేతనాలు కూడా ఇస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారని తెలుస్తోంది.
మఠంలకు రాకపోకలు
గత రెండేళ్లుగా ఆమె మఠానికి రాకపోకలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు, మఠంలోని కల్సంక అపార్టుమెంటులో ఆమె ఉండేదని కూడా చెబుతున్నారు. ఆమె తీసుకు వచ్చే ఆహారాన్నే లక్ష్మీవర తీర్థ తినేవారని అంటున్నారు. ఆ మహిళతో పాటు ఆమె తల్లి కూడా మఠానికి వచ్చేవారని అంటున్నారు. ఇదిలా ఉండగా మఠాధిపతి మృతికి ఆమెనే కారణమని శిరూర్ మఠం మాజీ ఉద్యోగి ఆరోపించారు.
సంయమనం పాటించాలని విజ్ఞప్తి
ఇదిలా ఉండగా, విచారణ పూర్తయ్యే వరకు సంయమనం పాటించాలని మఠం ప్రతినిధులను కోరారు. మఠం ఆవరణలోని పలు గదుల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. మఠాధిపతికి రూ.కోట్ల బకాయిలు రావాల్సి ఉందని అంటున్నారు. ఒక వ్యక్తి రూ.14 కోట్లు, మరొకరి నుంచి రూ.12 కోట్లు వసూలు కావాలంటూ స్వామీజీ చేప్పిన వివరాలను పోలీసులకు వెల్లడించారు. డబ్బు తీసుకున్న వారి వివరాలను గుర్తించే ప్రయత్నాలు పోలీసులు చేస్తున్నారు.
మఠాధిపతితో ఆత్మీయబంధం సంబంధం.. మంత్రి ఖాదర్
శిరూర్ మఠాన్ని మంత్రి యుటి ఖాదర్ శుక్రవారం సాయంత్రం పరిశీలించి స్వామీజీ మృతికి సంతాపం తెలిపారు. తాను ప్రభుత్వ ప్రతినిధిగా రాలేదని, మఠాధిపతితో తనకు ఆత్మీయ సంబంధం ఉందని, అందుకే వచ్చానని తెలిపారు. లక్ష్మీవర తీర్థ పెంచుకున్న శునకం ఆయన గది వద్దే నిలబడి రోదిస్తోందని మఠం ప్రతినిదులు చెప్పారు. రూ.పదివేలను చెల్లించి నిరుడు ఆయన దాన్ని కొనుగోలు చేశారు. తన మరణానికి ముందుగానే ఆయన తన ఉత్తరాధికారిని ఎంపిక చేశారని ప్రచారం సాగుతోంది.