ఘోరం: వైద్యుల నిర్వాకం... బతికున్న మహిళకు అంత్యక్రియలు
ప్రాణాలతో ఉన్న ఓ యువతి(21) మృతి చెందినట్లు వైద్యులే నిర్ధారించడంతో ఆమె కుటుంబ సభ్యులు చూసుకోకుండా ఆమెకు దహనక్రియలు నిర్వహించిన ఉదంతమిది.ప్రాణాలతో ఉన్న ఓ యువతి(21) మృతి చెందినట్లు వైద్యులే నిర్ధారించడం
ఉత్తరప్రదేశ్: ప్రాణాలు పోయాల్సిన వైద్యులే నిండు ప్రాణం బలిగొన్నారు. ప్రాణాలతో ఉన్న ఓ యువతి(21) మృతి చెందినట్లు వైద్యులే నిర్ధారించడంతో ఆమె కుటుంబ సభ్యులు చూసుకోకుండానే ఆమెకు దహనక్రియలు నిర్వహించారు. దీంతో చితిపైనే ఆమె ప్రాణాలు వదిలింది.
ఈ దారుణం ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నొయిడాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రద్ధా ఆసుపత్రి వైద్యులు సదరు మహిళ ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ తో మృతి చెందిందని ఆదివారం రాత్రి 11.45 గంటలకు నిర్ధారించారు.
సోమవారం తెల్లవారుజామున ఒంటిగంట ప్రాంతంలో ఆమె భర్తకు మృతదేహాన్ని అప్పగించారు. ఆయన తన స్నేహితులతో కలిసి కారులో భార్య మృతదేహాన్ని అలీగఢ్ జిల్లాకు తీసుకెళ్లి ఉదయం 8 గంటలకు దహనక్రియలు నిర్వహించారు.
అయితే సదరు మహిళ సోదరుడికి ఆమె ఆకస్మిక మృతిపై అనుమానం వచ్చి అలీగఢ్ పోలీసులకు సమాచారమిచ్చాడు. వారు దహనక్రియలు జరుగుతున్న ప్రదేశానికి వచ్చేసరికి ఆమె శరీరం దాదాపు 70 శాతం కాలిపోయింది.
అయినా సరే, పోలీసులు మధ్యలోనే దాన్ని అడ్డుకుని ఆమె దేహాన్ని శవపరీక్షకు పంపించారు. పరీక్షించిన వైద్యులు ఆమె చావుకు కారణం చితిమంటలేనని తేల్చారు. దహనం చేసే వరకు కూడా ఆమె ప్రాణంతోనే ఉందని, ఆమె శ్వాస తీసుకోవడం వల్లే శ్వాసనాళంలోకి, ఊపిరితిత్తుల్లోకి మసి కణాలు చేరాయని, ఆమెలో ప్రాణం లేకపోతే అవి లోపలికే ప్రవేశించవని పేర్కొన్నారు.
డీఎన్ఏ పరీక్ష కోసం వైద్యులు ఎముకను భద్రపరిచారు. దీంతో తన మేనకోడలిపై అత్యాచారం, హత్య జరిగాయంటూ మృతురాలి మేనమామ.. ఆమె భర్త, మరో పది మంది కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితులైన వారు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.