వేదికపై మంత్రులకు ముచ్చెటమలు, ఆమాత్యులపై అతివ ప్రశ్నల వర్షం, సీఏఏపై కడిగిపారేసిన నారీ..
అదో ప్రభుత్వ కార్యక్రమం. అతిథులు అంతా హాజరయ్యారు. మంత్రులు కూడా విచ్చేశారు. లబ్దిదారులకు సాయాన్ని కూడా అందజేస్తున్నారు. ఇంతలో ఓ వివాహిత స్టేజీ మీదికొచ్చారు. పౌరసత్వ సవరణ చట్టంపై మంత్రులపై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో ఏం చేయాలో.. ఏం చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొంది. తమిళనాడులోని విరుదులో జరిగిన ఘటన చర్చకు దారితీసింది.
ప్రభుత్వ కార్యక్రమంలో..
విరుదునగర్లో సహకారశాఖ ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ విక్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం జరిగింది. సహకారశాఖ మంత్రి సెల్లూరు రాజు, పాడిపరిశ్రమల శాఖ మంత్రి రాజేంద్ర బాలాజీ పాల్గొన్నారు. లబ్దిదారులకు ప్రోత్సహకాన్ని అందజేస్తున్నారు. ఇంతలో మహ్మద్ కిలోఫర్ ఫాతిమా వేదికపైకి వచ్చారు. అంతే సీఏఏపై మంత్రులపై ఊపిరి తీల్చుకోనియలేదు.
అనుకూలంగా ఎలా..?
పౌరసత్వ సవరణ చట్టానికి అన్నాడీఎంకే ఎంపీ ఎందుకు అనుకూలంగా ఓటేశారు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మీ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ముస్లింలు ఓటేయలేదా అని నిలదీశారు. అలాంటప్పుడు ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన చట్టానికి అనుకూలంగా ఎందుకు వ్యవహరించారని అడిగారు. ఇలా రకరకాల ప్రశ్నలు గుప్పించారు. దీంతో మంత్రులు వేదికపైనే నీళ్లు నమిలారు.
అబ్బే ఏం కాదు...
ఫాతిమాకు మెల్లగా మంత్రులు నచ్చజెప్పారు. పౌరసత్వ సవరణ చట్టంతో ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టంచేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ నుంచి వచ్చే ముస్లింలకు మాత్రమే పౌరసత్వం ఇవ్వరని తెలిపారు. తమిళనాడులో ఉన్న ముస్లింల హక్కులను కాపాడేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. ఇలా మంత్రులు నచ్చజెప్పడంతో.. ఫాతిమా శాంతించారు. ఫాతిమా మిన్నకుండిపోవడంతో మంత్రులు ఊపిరి పీల్చుకున్నారు. మెల్లగా అక్కడినుంచి జారుకొని.. హమ్మయ్యా అంటూ రిలాక్స్ అయ్యారు.
Recommended Video
అమల్లోకి సీఏఏ
2014 డిసెంబర్ 31కి ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్లో మతపరమైన హింసను ఎదుర్కొని దేశంలోకి వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులు పౌరసత్వం పొందేందుకు అవకాశం లభించింది. ఆయా దేశాల్లో మతపరమైన వేధింపుల్ని తట్టుకోలేక వచ్చిన వారికి మాత్రమే పౌరసత్వం ఇస్తారు. సీఏఏకు గత డిసెంబర్లో పార్లమెంట్ ఆమోదం తెలిపింది. వెంటనే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రాజముద్ర వేయడంతో చట్టం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. సీఏఏను నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు కూడా మిన్నంటాయి. ఈ క్రమంలోనే ఆదివారం ఫాతిమా తమిళనాడు మంత్రులపై ప్రశ్నల వర్షం కురిపించారు.