లాకర్ లో రూ.80 వేల రద్దైన నోట్లు, సుప్రీం కోర్టును ఆశ్రయించిన మహిళ
రద్దైన రూ.500, వెయ్యి నోట్లను మార్చుకోవడానికి తమకు మరో అవకాశం కల్పించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.
న్యూఢిల్లీ: రద్దైన రూ.500, వెయ్యి నోట్లను మార్చుకోవడానికి తమకు మరో అవకాశం కల్పించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.
ఫరీదాబాద్ కు చెందిన ఓ మహిళ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రూ.80 వేల మేర పాత నోట్లను మార్చుకోవడానికి మరో సారి అవకాశం కల్పించాలని కోరారు.తన తండ్రి చనిపోయిన తర్వాత లాకర్ లో ఈ పాత నోట్లను కనుగొన్నట్టుగా సవితా అనే మరో మహిళ సుప్రీం కోర్టును కోరారు.
రద్దైన పాత నోట్లను మార్చుకోవడానికి గత ఏడాది డిసెంబర్ 30వ, తేది వరకే కేంద్రం గడువు ఇచ్చింది. అయితే తన తండ్రి ఆస్తి విషయంలో వాటా కోసం తన సోదరి నిధి గుప్తాతో న్యాయపోరాటం చేయాల్సి వచ్చిందని. ఈ కేసులో మార్చి6న, కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారామె.
అయితే కోర్టు ఉత్తర్వుల ప్రకారంగా తండ్రి బ్యాంక్ లాకర్ తన వాటాకు వచ్చిందన్నారు. లాకర్ ను తెరిచి చూస్తే రద్దైన పాత నోట్లు ఉన్నాయని ఆమె సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చింది.
రద్దైన పాత నోట్లను మార్చుకొనే అవకాశం మళ్ళీ కల్పిస్తే ప్రజలందరికీ వర్తించేలా ఉంటుందని సుప్రీంకోర్టు మంగళవాంర పేర్కొంది.
ఈ కేసు విషయమై ఆర్ బి ఐ కు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు పంపింది. ఇతర పిటిషన్లన కూడ కలిపి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెఎస్ ఖేహర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ ఎస్కే కౌల్ లతో కూడిన ధర్మాసనం మంగళవారం నాడు విచారించింది.