ఎమ్మెల్యే 2సార్లు అబార్షన్ చేయించాడు: సీఎం ఇంటి ముందు మహిళ ఆత్మహత్యాయత్నం
Recommended Video
భువనేశ్వర్: తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసేందుకు విఫలయత్నం చేసింది ఓ మహిళ. అంతేగాక, తాను ఎమ్మెల్యే భార్యనంటూ సీఎం ఇంటి ముందే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ నగరంలో సంచలనం రేపింది.
మూడేళ్లక్రితం తనను ఒడిశా రాష్ట్రంలోని బీజేడీ పార్టీకి చెందిన తాల్చర్ ఎమ్మెల్యే బ్రజా కిషోర్ ప్రధాన్ పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. అంతేగాక, రెండుసార్లు తాను గర్భం దాల్చడంతో ఎమ్మెల్యే బలవంతం చేయడంతో తాను అబార్షన్ చేయించుకున్నానని మహిళ ఆరోపించింది.
ఎమ్మెల్యే అయిన తన భర్త తనను వేధిస్తున్నాడని, తనకు న్యాయం చేయాలని కోరేందుకు బాధిత మహిళ భువనేశ్వర్లోని సీఎం నివాసానికి వచ్చింది. ఆ మహిళకు సీఎంను కలిసే అవకాశం లభించకపోవడంతో చేతి మణికట్టును బ్లేడుతో కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది.
దీంతో పోలీసులు మహిళను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సదరు మహిళ మే 9వతేదీన తన స్వగ్రామమైన హందిదువాలో ఎమ్మెల్యే ప్రధాన్ ఇంటి ముందు ధర్నా చేసింది. కాగా, మహిళ చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే బ్రజా కిషోర్ ప్రధాన్ ఖండించారు. ఇది ఇలా ఉంటే.. బాధిత మహిళకు న్యాయం చేయాలంటూ పలువురు మద్దతుగా నిలిచారు.