లంచం అడిగిన తహసీల్దారు.. ఏకంగా గేదెనే తీసుకొచ్చిన మహిళ
మధ్యప్రదేశ్ : ప్రభుత్వ కార్యాలయాల్లో లంచావతారం ఎక్కువగానే ఉంటుందన్న విషయం అందరికీ తెలుసు. దొరికినప్పుడే దొంగ అంతవరకు దొరే అన్నట్లుగా ఉంటుంది అక్కడి అధికారుల వ్యవహారం. రెవిన్యూ కార్యాలయాల్లోనే లంచాల బాగోతాలు ఎక్కువగా వెలుగు చూశాయి. తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ మహిళ తహసీల్దార్ ఆఫీసుకు వచ్చింది . ఎందుకొచ్చావ్ అని అక్కడి అధికారులు ప్రశ్నించగా అసలు బాగోతం వెలుగు చూసింది.
డబ్బుల్లేక గేదెను తీసుకొచ్చిన మహిళ
మధ్యప్రదేశ్లోని సిద్ధి జిల్లాలోని నౌదియా గ్రామంలోని రామ్కాలీ పటేల్ అనే ఓ మహిళ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చింది. ఆమెతో పాటుగా ఓ గేదెను కూడా తీసుకొచ్చింది. గేదెను ఒక దగ్గర కట్టేసి ఇక తహసీల్దారు కోసం ఎదురు చూసింది. అంతలోనే ఇతర అధికారులు కార్యాలయానికి వచ్చారు. అక్కడకి గేదెను ఎందుకు తీసుకొచ్చిందని అధికారులు ప్రశ్నించడంతో అసలు విషయం చెప్పేసింది. తను ఓ పని నిమిత్తమై కార్యాలయానికి వచ్చానని అయితే ఆ పని జరగాలంటే తహసీల్దారు లంచం అడిగారని చెప్పింది. ఆఫీసరుకు అంత మొత్తంలో డబ్బులు తనదగ్గర లేవని అందుకే గేదెను ఇద్దామని తీసుకొచ్చినట్లు చెప్పింది.
పని జరగాలంటే పదివేలు డిమాండ్
వారసత్వంగా తనకు వచ్చిన ఆస్తిని తనపేరుపై మార్చుకునేందుకు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చినట్లు చెప్పిన రామ్కాలీ పటేల్... లంచం ఇవ్వాల్సిందిగా అధికారులు అడిగారని మీడియా ప్రతినిధులతో చెప్పింది. పని కావాలంటే రూ.10వేలు డిమాండ్ చేసినట్లు చెప్పింది. వారు అడిగిన మొత్తాన్ని తాను చెల్లించినట్లు చెప్పిన మహిళ... ఆ తర్వాత కూడా డాక్యుమెంట్లు తన పేరుతో రాలేదని చెప్పింది. దీనిపై ఆరా తీయగా ఇంకొంత డబ్బులు లంచంగా ఇవ్వాలని అందుకే పని నిలిపివేసినట్లు అధికారులు చెప్పినట్లు రామ్కాలీ వెల్లడించింది.
బుకాయించిన తహసీల్దార్
ఇక తన దగ్గర లంచం ఇచ్చేందుకు డబ్బులు లేకపోవడంతో తాను పెంచుకుంటున్న గేదెను వారికి లంచం కింద ఇవ్వాలని దాన్ని కార్యాలయానికి తీసుకొచ్చినట్లు చెప్పింది రామ్కాలీ. ఇది వెలుగులోకి రాగానే నాలుక్కర్చుకున్న తహసీల్దార్ తాను లంచం తీసుకోలేదని బుకాయించాడు. మహిళ పెట్టుకున్న అర్జీని అధికారులకు ఫార్వర్డ్ చేశామని ఇందుకు సంబంధించిన ఒక కాపీ గతేడాది నవంబర్ 14న అందజేశామని చెప్పారు. అంతేకాదు ఆర్సీఎంఎస్ పోర్టల్లో కూడా దీన్ని అప్లోడ్ చేశామని చెప్పుకొచ్చారు. రామ్కాలీ పటేల్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని అదొక కుట్రగా అభివర్ణించారు.
మహిళపై పోలీసుకు ఫిర్యాదు చేసిన తహసీల్దార్
రామ్కాలీ చేసిన పనిపై తాను పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానని వెల్లడించారు. కొందరు కావాలనే ఆమెను ఇలా వ్యవహరించాలని చెప్పారని వారిపై కూడా ఫిర్యాదు చేసినట్లు తహసిల్దార్ వివరించారు. ఇదిలా ఉంటే లంచం అడిగిన క్లర్కు ఈ మధ్యనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి డ్యూటీలో చేరారని తహసిల్దార్ చెప్పారు. గతేడాది కూడా ఇదే మధ్యప్రదేశ్లోని ఖర్గాపూర్లో తహసిల్దార్ వాహనానికి ఓ రైతు తన గేదెను కట్టేసిన ఘటన వెలుగు చూసింది. ఆ ఘటనలో తన పేరుపైకి భూమిని ట్రాన్స్ఫర్ చేసేందుకుగాను తహసీల్దార్ లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లు రైతు ఆరోపించారు. అప్పటికీ ఆ రైతు రూ.50వేలు కట్టాడని అయినా సరే తహసీల్దార్ పనిచేయలేదని ఆరోపణలు చేశారు.